హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): ఒక తప్పును కప్పిపుచ్చడానికి ప్రభుత్వం మరో తప్పు చేస్తున్నదా? అజ్ఞానాన్ని మసిపూసి మారేడు కాయచేయటానికి మరో అగాథ సదృశ్య నిర్ణయానికి తెరలేపిందా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. మంగళవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేవనెత్తిన అంశాలతో తత్తరపాటుకు గురైన సర్కారు అసలు ‘జయజయహే తెలంగాణ’ గీతం నుంచి కాకతీయ వైభవ ప్రస్తావన, గోలుకొండ నవాబుల గొప్పదనాన్ని చాటే చార్మినార్ను కీర్తించే చరణాన్ని కూడా తొలగించబోతున్నదా? అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు.
అందెశ్రీ రాసిన ‘జయజయహే తెలంగాణ…’ గీతాన్ని రాష్ట్రగీతంగా గుర్తించేందుకు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా జూన్ 2న జరగనున్న కార్యక్రమంలో అధికారికంగా ఈ గీతం విడుదల చేయటానికి సర్కారు కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ‘జయజయహే తెలంగాణ’ గీతానికి కీరవాణి సంగీతాన్ని సమకూర్చటంపై తెలంగాణ వాదులు నొచ్చుకోవటంతో వివాదం ముసురుకున్నది.
దీనిపై అందెశ్రీ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలకు తోడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు మండేగుండెల్ని మరింత రగిలించాయి. ‘రాచరికపు ఆనవాళ్లు లేకుండా తెలంగాణ అధికార చిహ్నం ఉంటుందని, ఇందులో కాకతీయుల కళాతోరణం ఉండదని సీఎం వెల్లడించారు.
కేటీఆర్ ప్రశ్నలకు డైలమాలో పడ్డ ప్రభుత్వం
సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ‘జయజయహే తెలంగాణ గీతం’లో ఏముందో తెలుసా ? అని రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. ‘కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప.. గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్…’ అని అధికారిక గీతంలో కీర్తించి… అధికార చిహ్నంలో మాత్రం అవమానిస్తారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. దీంతో సీఎం రేవంత్రెడ్డి సహా ప్రభుత్వ అధికార యంత్రాంగం తత్తరపాటుకు గురైంది.
‘మనసునెరిగి నడచుకోవలె’ అన్నట్టుగానే సీఎం రేవంత్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగానే సర్కారు రాజమద్రలో కాకతీయకళాతోరణం, చార్మినార్ ముద్రలు ఉండవనే విషయంపై అప్పటికే స్పష్టత ఉన్న ఉన్నతాధికారులు ఇప్పుడు ఏకంగా ‘జయజయహే తెలంగాణ’ గీతం నుంచి ‘కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప.. గోలుకోండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్’ అనే చరణాన్ని తొలగించే పనిలో నిమగ్నం అయినట్టు తెలుస్తున్నది.