హనుమకొండ, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ వికారాబాద్ : రెండేండ్లలో కాంగ్రెస్ దుకాణం బంద్ అవుతదని, కేసీఆర్ తిరిగి రాష్ర్టానికి సీఎం అవుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. కాంగ్రెస్కు ఓటు వేసి మొదటిసారి మోసపోయిన ప్రజలు రెండోసారి కూడా ఆ తప్పు చేయరాదని, కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటే ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కే పట్టం కట్టాలని కోరారు. కాంగ్రెస్ పార్టీది అభయ హస్తం కాదని, భస్మాసుర హస్తమని మండిపడ్డారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి రెండేండ్లుగా మోసం చేస్తున్న కాంగ్రెస్కు మళ్లీ ఓటేస్తే తెలంగాణ మరింత ఆగమవుతుందని హెచ్చరించారు. మహాలక్ష్మి పథకం పేరిట రేవంత్రెడ్డి రాష్ట్రంలోని ఆడబిడ్డలను మోసం చేశాడని మండిపడ్డారు. సోనియాగాంధీపై ఒట్టేసి మరీ రైతు బంధు కింద రూ.10 వేలకు బదులు రూ.15 వేలు ఇస్తానని రేవంత్రెడ్డి చెప్పాడని, కేసీఆర్ హయాంలో డిసెంబర్లోనే రైతుబంధు ఇస్తే, ఇప్పుడు ఫిబ్రవరి వచ్చినా రైతులకు అందలేదని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ వాళ్లు స్టువర్టుపురం దొంగలని, మరోసారి వాళ్లను నమ్మి మోసపోవద్దని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని, ఆగం కావొద్దని ప్రజలను కోరారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ ఆదివారం వికారాబాద్ జిల్లా తాండూరు, వరంగల్ జిల్లా నర్సంపేట, వర్ధన్నపేట, మహబూబాబాద్ జిలా తొర్రూరులో రోడ్ షో నిర్వహించారు. ఆయా చోట్ల కేటీఆర్ మాట్లాడుతూ ‘రేవంత్రెడ్డి రెండేండ్ల నుంచి సంపాదించుకొని పదవిని కాపాడుకొనేందుకు ఢిల్లీకి మూటలు మోస్తున్నడు. చేతిలో వెయ్యి రూపాయలు పెడితే మళ్లీ ఓటేస్తరని అనుకుంటున్నడు. కాంగ్రెస్ వాళ్లు మళ్లీ ఇప్పుడు ఇండ్లకు వస్తరు. ఏవేవో కల్లబొల్లి, మాయ మాటలు చెప్తరు. వాళ్లను అస్సలు నమ్మొద్దు. వాళ్లు ఇచ్చిన డబ్బు తీసుకొని కారు గుర్తుకు ఓటు వేయాలి’ అని సూచించారు.
ఒక తప్పుడు ఓటు వేస్తే శిక్ష ఐదేండ్లు పడుతది. కేసీఆర్ నర్సంపేటకు వచ్చినప్పుడు ఆగం కావద్దు, మోసపోతే గోసపడుతరు.. కాంగ్రెస్ను నమ్మితే కుకతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే ఉంటుందని చెప్పిండ్రు. కాంగ్రెస్ వాళ్లు తులం బంగారం ఇచ్చేటోళ్లు కాదు.. మెడల పుస్తెల తాడు గుంజుకపోయే వాళ్లని ఆరోజే చెప్పినా వినకుండా నర్సంపేటలో ఆగమై బొందలపడ్డరు’ అని వాపోయారు. ‘రాష్ట్రంలో వ్యాపారాలు నడుస్తలేవు. రియల్ ఎస్టేట్ పడిపోయింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారింది. తులం బంగారం అన్నవాళ్లు తెలంగాణ తల్లి నెత్తిన బంగారం ఎత్తుక పోయిండ్రు. చేతిలో బతుకమ్మను మాయం చేసి హస్తం పెట్టిండ్రు. కాంగ్రెస్ వాళ్లది అభయ హస్తం కాదు, భస్మాసుర హస్తం’ అని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలోనే కేసీఆర్ నాయకత్వంలో నర్సంపేట, వర్ధన్నపేట, తొర్రూరు మున్సిపాలిటీల్లో అభివృద్ధి జరిగిందని, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, అరూరి రమేశ్ పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. జిల్లా కేంద్రంలో ఉండాల్సిన మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలను నర్సంపేటలో ఏర్పాటు చేశారని చెప్పారు. ‘కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం, నా సిరిసిల్ల నియోజకవర్గంతోపాటు రాష్ట్రంలో ఎకడా లేని విధంగా నర్సంపేటలో ఇంటింటికీ గ్యాస్ పైపు కనెక్షన్లు అందించారు. అన్ని మున్సిపాలిటీల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చేశారు’ అని గుర్తుచేశారు.

రేవంత్ ఎప్పటికీ బీజేపీ మనిషే
‘ఇక బీజేపీకి ఓటు వేస్తే మోరీలో వేసినట్టే. దేశంలో రాహుల్గాంధీ మోదీని చౌకీదార్.. చోర్ అంటే.. రేవంత్రెడ్డి మాత్రం మా బడే భాయ్ అని పిలుస్తున్నడు. రేవంత్రెడ్డి ఎప్పటికీ బీజేపీ మనిషే. బీజేపీ, కాంగ్రెస్ రెండూ తోడు దొంగలే’ అని కేటీఆర్ దెప్పిపొడిచారు. నర్సంపేట, వర్ధన్నపేట, తొర్రూరులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, తాండూరులో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి పంజుగుల శ్రీశైల్రెడ్డి, బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింహులు, కౌన్సిలర్ అభర్థులు దీపా నర్సింహులు, పరిమళ, శోభారాణి, నాగలక్ష్మి, ఇర్షాద్, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనుముల రేవంత్రెడ్డి కాదు..లాగుల తొండల్రెడ్డి
‘గతంలో చాలా మంది సీఎంలను చూసినం.. వాళ్లు నాలుగు మంచి మాటలు చెప్తే విన్నం. కానీ బూతులు మాట్లాడే సీఎంను నేడు మనం చూస్తున్నం. చరిత్రలో బూతులు మాట్లాడే ఏకైక ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి మిగిలిపోతడు’ అని కేటీఆర్ దెప్పిపొడిచారు. ‘రేవంత్రెడ్డిని ప్రజలు ఆరు గ్యారెంటీలపై నిలదీస్తే లాగులో తొండలు ఇడుస్తా.. గుడ్లు పీకి గోటీలాడుతా.. పేగులు మెడలో వేసుకుంటా అంటడు.. ఆయన అనుముల రేవంత్రెడ్డి కాదు.. లాగుల తొండల్రెడ్డి’ అని ఎద్దేవాచేశారు. తెల్లారితే కేసీఆర్ను తిడుతూ రూ. వేల కోట్లు దండుకోవడమే రేవంత్రెడ్డి దినచర్యగా
మారిందని దుయ్యబట్టారు.