హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): అధికారం, ఆస్తులు కాపాడుకోవడానికే చేవేళ్ల ఎంపీ రంజిత్రెడ్డి పార్టీ మారారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ధ్వజమెత్తారు. ఆయనకు బీఆర్ఎస్ ఏం తక్కువ చేసిందని పార్టీని విడిచి వెళ్లారని ప్రశ్నించారు. చేవేళ్లలో సామాజిక సమీకరణాల రీత్యా బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు సులువు అవుతుందని ధీమా వ్యక్తంచేశారు. ఏప్రిల్ 13న చేవేళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, ఈ సభకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ హాజరవుతారని వెల్లడించారు. బుధవారం ఆయన తెలంగాణభవన్లో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. సమావేశానికి కాసాని జ్ఞానేశ్వర్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీఅర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన ఎంపీ రంజిత్రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రంజిత్రెడ్డి ఎవరో బీఆర్ఎస్ సీటు ఇచ్చి, గెలిపించుకున్న తర్వాతనే ప్రపంచానికి తెలిసిందని పేర్కొన్నారు. రాజకీయాలకు కొత్త వాడైనా 2019లో ప్రతి కార్యకర్త కష్టపడి ఆయనను గెలిపించారని చెప్పారు. రంజిత్రెడ్డికి రాజకీయంగా పార్టీలో అత్యధిక ప్రాధాన్యం, నియోజకవర్గంలో స్వేచ్ఛ ఇచ్చామని తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయనని, రాజకీయాల నుంచి తప్పుకుంటానని పార్టీ ముందు అనాసక్తతను వ్యక్తంచేసిన రంజిత్రెడ్డి.. కేవలం అధికారం, ఆస్తుల కోసమే బీఅర్ఎస్ను విడిచి ద్రోహం చేశారని మండిపడ్డారు. పా ర్టీ సీనియర్ నాయకురాలు, రంజిత్రెడ్డి తన సోదరి అని చెప్పుకునే కవితపై కేంద్ర ప్రభుత్వ సంస్థలు సోదాల పేరుతో దాడి చేసి, అరెస్టు చేసిన రోజే ఆయన నవ్వుకుంటూ పార్టీకి ద్రోహం చేసి, కాంగ్రెస్లో చేరిన స్వార్థపరుడని ధ్వజమెత్తారు.
కాసాని జ్ఞానేశ్వర్ అందరి మనిషి
గతంలో ఎన్నికలకు ముందు అప్పటి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కూడా పార్టీ కన్నా తానే ఎకువ అనుకొని వేరే పార్టీలోకి వెళ్తే ఫలితం ఏమైందో అందరికీ తెలుసని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ అహంకారం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో గెలవరని స్పష్టంచేశారు. సీఎం రేవంత్రెడ్డి, రంజిత్రెడ్డి కలిసినంత మాత్రాన కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో కలిసిపోతాయనుకోవడం వారి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని పేర్కొన్నారు. నేడు కాంగ్రెస్లో అయోమయం నెలకొన్నదని, చేవెళ్లలో ఆ పార్టీకి కనీసం అభ్యర్థి కూడా దొరకలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజులతోపాటు బీసీలకు కొన్ని దశాబ్దాలుగా అండగా నిలబడిన వ్యక్తి అని కొనియాడారు. ఒకవైపు బీసీల కోసం పాటుపడుతూనే, మరోవైపు అన్ని సామాజిక వర్గాలను, మైనార్టీలను కలుపుకుపోయిన మంచి మనిషి అని ప్రశంసించారు.