KTR | సీనియర్ మహిళా జర్నలిస్టు రేవతి అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఉదయం 5 గంటలకు ఇంటి మీద దాడి చేసి జర్నలిస్టు రేవతిని అక్రమంగా అరెస్టు చేయడం రాష్ట్రంలో కొనసాగుతున్న ఎమర్జెన్సీ తరహా పాలనకు నిదర్శనమని విమర్శించారు. రేవతితో పాటు యువ జర్నలిస్టు తన్వీ యాదవ్ను అరెస్టు చేయడం దారుణమని అన్నారు.
ఒక రైతు కాంగ్రెస్ సర్కారులో తను ఎదుర్కొంటున్న కష్టాలను చెబితే ఆ వీడియోను పోస్టు చేసిన జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వ నిర్బంధ పాలనకు పరాకాష్ట అని కేటీఆర్ అన్నారు. ప్రజా పాలనలో మీడియా స్వేచ్ఛ అనేదే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చెబుతున్న రాజ్యాంగబద్ధమైన పాలన ఇదేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మీడియా , సోషల్ మీడియా గొంతుకలపై చేస్తున్న ఈ దాడులను, అక్రమ కేసులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.
బుధవారం ఉదయం 5 గంటల సమయంలో 12 మంది మఫ్టీ పోలీసులు రేవతి ఇంటికి వెళ్లి ఆమెను అరెస్టు చేశారు. జర్నలిస్ట్ రేవతి ఫోన్, ఆమె భర్త దర్శకుడు చైతన్య దంతులూరి ఫోన్, ల్యాప్టాప్ సైతం బలవంతంగా పోలీసులు తీసుకెళ్లారు. అలాగే రేవతికి చెందిన పల్స్ యూట్యూబ్ ఆఫీసును సీజ్ చేశారు. రైతుబంధు రావట్లేదని ఒక రైతు మాట్లాడిన వీడియో ప్రసారం చేసినందుకుగానూ అక్రమ కేసులు బనాయించి రేవతిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.