వరంగల్, మే 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా నిండకముందే తెలంగాణలో చీకట్లు తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం దవాఖానలో ఐదు గంటలపాటు కరెంట్ పోవడం కాంగ్రెస్ అసమర్థతకు నిదర్శమని దుయ్యబట్టారు. ‘ఎంజీఎంలో ఐదు గంటలపాటు కరెంట్ లేదు. జనరేటర్లు లేవు. చిన్నపిల్లలు, నవజాత శిశువులు, క్రిటికల్కేర్లో వెంటిలేటర్లపై ఉండే పేషెంట్ల పరిస్థితి ఎలా ఉంటుంది? ఇదేనా మార్పు?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. వరంగల్-నల్లగొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కేటీఆర్ బుధవారం నర్సంపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాల గ్రాడ్యుయేట్స్ సన్నాహక సమావేశాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీ బోగస్గా మారిందని, ఇప్పుడు సన్న వడ్లకే ఇస్తామంటూ రైతులను మోసం చేశారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అరచేతిలో వైకుంఠం చూపి, అధికారంలోకి రాగానే రైతులు, మహిళలు, యువత.. ఇలా అన్ని వర్గాలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మాటలకు మోసపోయి ఓటు వేస్తే, పదేండ్లు వెనక్కి తీసుకుపోయిందని విమర్శించారు. గ్రాడ్యుయేట్లు రేవంత్రెడ్డి మాటలను నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు.
రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు ఆశలు పెట్టిన రేవంత్రెడ్డి వారిని ఘోరంగా మోసం చేశారని కేటీఆర్ విమర్శించారు. డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చి ఆరునెలలు కావస్తున్నా రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో వరి నాట్ల సమయంలోనే రైతుబంధు పడేదని, రేవంత్రెడ్డి మాత్రం ఓట్లు ఉన్నప్పుడే వేస్తున్నారని దుయ్యబట్టారు. రైతుభరోసా ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. విత్తనాలు, ఎరువులు, నీళ్లు, కరెంట్ అన్నింటికీ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామన్నరు. దొడ్డు వడ్ల ఎంఎస్పీ రూ.2,183కి రూ.500 కలిపి రూ.2,686 ఇస్తామని మ్యానిఫెస్టోలో రాసి, ఇప్పుడేమో సన్నవడ్లకే ఇస్తామని సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. హామీలను అమలుచేయాలని అడిగేవారు శాసనమండలిలో ఉండాల్నా? రేవంత్రెడ్డి మాటలకు సన్నాయి నొక్కులు నొక్కేవారు ఉండాల్నా? విద్యావంతులు ఆలోచించాలి’ అని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్తోపాటు వరంగల్లోనూ ఐటీ పరిశ్రమల విస్తరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఐటీ పరిశ్రమలు పోతున్నా పట్టించుకోవడం లేదని కేటీఆర్ విమర్శించారు. తాను ఐటీశాఖ మంత్రిగా ఉన్నప్పుడు హనుమకొండలో ఐదు ఐటీ కంపెనీలు ఒకేరోజు ప్రారంభించానని, కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న టెక్ మహీంద్ర హైదరాబాద్కు వెళ్లే పరిస్థితిని కాంగ్రెస్ తీసుకొచ్చిందని మండిపడ్డారు. ‘కాకతీయ కళాతోరణం, చార్మినార్ రాచరికానికి పోకడగా ఉన్నాయని రాజముద్ర నుంచి వాటిని తీసేస్తానని రేవంత్రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. ‘జయ జయహే’ను తెలంగాణ గీతం చేస్తామని చెప్పారు. అసలు ఆ పాటలో ఏమున్నదో రేవంత్రెడ్డికి తెలియదు. కాకతీయ కాంతిరేఖ రామప్ప, గోల్కొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినార్’ అని కేటీఆర్ వివరించారు. రేవంత్రెడ్డి పెట్టిన రాష్ట్ర గీతంలోనే చార్మినార్, రామప్ప, కాకతీయ తోరణం ఉన్నదని గుర్తుచేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రేవంత్రెడ్డి రెండు ఉద్యోగాలు కూడా ఇయ్యలేదని కేటీఆర్ మండిపడ్డారు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇయ్యకుండానే 30 వేల ఉద్యోగాలిచ్చామని చెప్పుకుంటున్నారని, రేవంత్రెడ్డి ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమేనని ఎద్దేవా చేశారు. నోటిఫికేషన్ ఇయ్యకుండా, పరీక్ష పెట్టకుండా ఉద్యోగాలు ఇస్తరా? అని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు జాబ్ల పరీక్ష ఫీజులు వసూలు చేయొద్దన్న రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే టెట్ ఫీజును రూ.2 వేలకు పెంచారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీలోకి పోవాల్నా, ఎటు పోవాల్నా? అని రేవంత్రెడ్డి ఆలోచిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీల్లో ఒక్క ఫ్రీ బస్సు తప్ప ఏదీ అమలు కాలేదని పేర్కొన్నారు. రద్దీ బస్సులు ఎక్కలేక, సీట్లు దొరక్క మహిళలు ఇబ్బండి పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తున్నామని ప్రియాంకగాంధీ, రాహుల్గాంధీ చెప్తున్నారు. ఎవరికైనా అందుతున్నాయా? రైతుభరోసా వచ్చిందా? పంట రుణాలు మాఫీ అయ్యాయా?’ అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డి గెలిస్తే ఇక్కడకు పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తారని కేటీఆర్ భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న గెలిస్తే చంచల్గూడలో ఉన్న తన సీనియర్లను పిలిపించి మాట్లాడిస్తడని ఎద్దేవా చేశారు. రాజకీయాలపై ఇప్పటికే చాలామందిలో ప్రతికూల అభిప్రాయం ఉన్నదని, దానిని మార్చాలని పిలుపునిచ్చారు. క్రిమినల్ రికార్డు ఉన్నవారికి పట్టం కడితే, చట్టసభల్లో ఇలాంటివారు దూరితే ఎలా ఉంటుందో ఆలోచించాలని విజ్ఞప్తిచేశారు. కేసీఆర్ హయాంలో బండా ప్రకాశ్, సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్, గిరిజన మహిళ సత్యవతిరాథోడ్, విద్యాసంస్థల అధినేత తక్కళ్లపల్లి రవీందర్రావు లాంటివారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ అభ్యర్థి ఒక బ్లాక్మెయిలర్ అని, తెల్లారితే యూట్యూబ్ చానల్లో పెద్దవారనే గౌరవం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు తిడుతుంటాడని విమర్శించారు. ఇటు బిట్స్ పిలానీ ఉంటే, అటు పల్లీ బఠానీ పోటీలో ఉన్నారని వివరించారు. బిట్స్ పిలానీలో గోల్డ్మెడల్ సాధించిన రాకేశ్రెడ్డి ఏడేండ్లు ఫేస్బుక్, సిటీ బ్యాంకులో పనిచేసి, రైతుబిడ్డగా వరంగల్కు వచ్చి సేవ చేయాలనుకున్నారని చెప్పారు. చదువుకున్న రాకేశ్రెడ్డికి ఓటు వేస్తారా? చంచల్గూడ వ్యక్తికి ఓటు వేస్తారో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు సంజయ్కుమార్, కల్వకుంట సంజయ్, పాడి కౌశిక్రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, తాటికొండ రాజయ్య, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మారెపల్లి సుధీర్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్, బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, కే వాసుదేవరెడ్డి, సర్దార్ రవీందర్సింగ్, జీవీ రామకృష్ణారావు, వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక అహంకారికి, ఆశయానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. రాకేశ్రెడ్డి ఆశయం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. సీఎం రేవంత్రెడ్డి ఏ మాత్రం విలువలు లేని తీన్మార్ మల్లన్నను తీసుకొచ్చి ప్రజలపై రుద్దాలని చూస్తున్నారని ఆరోపించారు. కరోనా వైరస్ లాంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న అని విమర్శించారు. ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్, పోలీస్ కానిస్టేబుళ్లతో కొట్లాట, మార్ఫింగ్ లాంటి వాటికి సంబంధించి 56 కేసులు ఉన్నాయని, 70 రోజులు జైలుకు వెళ్లాడని వివరించారు. ఇలాంటి వ్యక్తి పట్టభద్రులకు ఎలా ప్రతినిధి అవుతారని ప్రశ్నించారు. దుర్మార్గులను ఓడించి, ప్రశ్నించేతత్వం ఉన్న విద్యావంతుడు రాకేశ్రెడ్డిని గెలిపించాలని కోరారు.
గీసుగొండ, మే 22: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ నుంచి నర్సంపేటకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మానవత్వం చాటుకున్నారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం అంబేద్కర్ సెంటర్ వద్ద వడదెబ్బతో అంజయ్య రోడ్డు పక్కన పడిపోయి ఉండటంతో అది గమనించిన కేటీఆర్ తన వాహనాన్ని ఆపారు. అతను ఆసస్మారక స్థితిలో ఉండటంతో వెంటనే తన కాన్వాయ్లోని వాహనంలో వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. దగ్గరుండి అతనికి చికిత్స అందేలా చూడాలని తనతోపాటు ఉన్న పోలీసులను కోరారు.