KTR | హైదరాబాద్ : తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణనే లేకుండా చేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలంటే రేవంత్ రెడ్డి వల్ల కాదు.. ఆయన జేజమ్మ వల్ల కూడా కాదు అని కేటీఆర్ తేల్చిచెప్పారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మే డే వేడుకల్లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
చెమటబొట్టే చరిత్రకు ఆధారం అని అలిశెట్టి ప్రభాకర్ అన్నారు. శ్రామికులే చరిత్ర నిర్మాతలు.. కార్మికులే సంపద సృష్టికర్తలు.. శ్రమైన జీవన సౌందర్యానికి సమానమైనది ఏది లేదని మహాకవి శ్రీశ్రీ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కార్మికవర్గం నిర్వహించిన పాత్ర ఎనలేనిది. సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు జంగ్ సైరన్ చేయడంతో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. వారు తమ సత్తా చాటారు. ఆ తర్వాత ఆర్టీసీ కార్మికులు నిరవధికంగా అండగా నిలిచారు. పబ్లిక్ సెక్టార్లో పని చేసే కార్మికులు కూడా తమ విధులను బహిష్కరించి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు అని కేటీఆర్ గుర్తు చేశారు.
అనేక పోరాటాల తర్వాత తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణలో అద్భుతాలు జరిగాయి. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలంటే రేవంత్ రెడ్డి వల్ల కాదు.. ఆయన జేజమ్మ వల్ల కూడా కాదు. చిన్నచితకా పని చేయలేదు. కాళేశ్వరం నిర్మించాం. కాళేశ్వరం నిర్మాణంలో వేలాది మంది కార్మికుల శ్రమ ఉంది. తాజ్మహల్ను తలదన్నేలా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం నిర్మించాం. అందులోనూ మన కార్మికుల శ్రమ ఉంది. అద్భుతమైన యాదాద్రి నిర్మాణంలో వందలాది కార్మికుల శ్రమ ఇమిడి ఉంది. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలంటే కాళేశ్వరం కూల్చేయాలి. యాదాద్రి ఆలయం, సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం, కమాండ్ కంట్రోల్ సెంటర్ వంటి వాటిని కూల్చేయాలని కేటీఆర్ తెలిపారు. వీటన్నింటికి మించి తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణనే లేకుండా చేయాలి. ఎందుకంటే తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కేసీఆర్. ఇక ఈయన మళ్లా తన పాత బాస్తో మాట్లాడుకుని అటుఇటు చేసి కలుపుకుంటే తప్ప కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసే సత్తా రేవంత్ రెడ్డికి కానీ ఆయన ప్రభుత్వానికి గానీ లేదు. ఆ విషయంలో మనకు రెండో అభిప్రాయం అవసరం లేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు.