KTR | వికారాబాద్ : చేవెళ్ల ఎంపీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ పడుతున్న రంజిత్ రెడ్డితో పాటు పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేశారని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. వీరిద్దరిని శిక్షించాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందని కేటీఆర్ అన్నారు. వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మంత్రి కావాలని రాజకీయాల్లోకి వచ్చినప్పట్నుంచి కలలు కన్నాడు పట్నం మహేందర్ రెడ్డి.. ఆ కలను కేసీఆర్ నెరవేర్చారు. ఒకసారి కాదు.. రెండు సార్లు మహేందర్ రెడ్డికి మంత్రి అవకాశం కల్పించారు. చేవెళ్ల ప్రజలకు తెలియని అనామకుడైన రంజిత్ రెడ్డిని కేసీఆర్ ఎంపీగా గెలిపించారు. ఇవాళ పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోయిన వీళ్లిద్దరిని శిక్షించాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తినైనప్పటికీ గుండె ధైర్యం ఉన్న నాయకుడిని.. నేను వారితో పోటీ పడుతానని ముందుకు వచ్చారు కాసాని జ్ఞానేశ్వర్. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఇవాళ రంజిత్ రెడ్డి రన్నింగ్ రెడ్డిగా, బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి విశ్వాసం లేని రెడ్డిగా మారారు. వీరిద్దరూ మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారు. మోదీ, రేవంత్ దొరికారని వీళ్లు సంబురపడిపోతున్నారు. ఈ ఇద్దరు దిక్కులేని నాడు మీరు గెలిపించారన్న విషయాన్ని ఆ ఇద్దరు నాయకులు మరిచిపోతున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వారి కోసం పని చేశారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు.. గెలిపించిన వారిని వదిలేసి ఇతర పార్టీలకు వెళ్లారని కేటీఆర్ మండిపడ్డారు.