KTR | హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): అధికారంలో ఉన్నప్పుడు ప్రజా ప్రయోజనాలు, ప్రజల సౌకర్యాల కోసమే పనిచేశామని, రాజకీయ ప్రయోజనాల గురించి ఏనాడూ ఆశించలేదని అందువల్లే పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో ప్రజలను ఏనాడూ లైన్లల్లో నిలబెట్టలేదని చెప్పారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సృష్టించిన అసత్య ప్రచారం ముందు కేసీఆర్ సర్కార్ చేసిన అభివృద్ధి, సంక్షేమం ఓడిపోయిందని పేర్కొన్నారు. ఓటమికి కారణాలను విశ్లేషించుకొని, ముందుకుసాగితే బీఆర్ఎస్ పడిలేచిన కెరటంవలే తిరిగి నిలబడుతుందన్న విశ్వాసం వ్యక్తంచేశారు.
గురువారం తెలంగాణభవన్లో బీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో మా జీ అసెంబ్లీ స్పీకర్లు సిరికొండ మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, సత్యవతిరాథోడ్, ఎంపీ మా లోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, మాజీ ఎంపీలు ఆజ్మీరా సీతారాంనాయక్, రావుల చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, రేగా కాంతారావు, హరిప్రియనాయక్, శంకర్నాయక్, డీఎస్ రెడ్యానాయక్, బడే నాగజ్యోతి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వీ ప్రకాశ్తోపాటు మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని జెడ్పీ చైర్పర్సన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అన్ని స్థాయి పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, అన్నిస్థాయిల శ్రేణుల మధ్య సమన్వయం లేకపోవడం వంటి కారణాలతో బీఆర్ఎస్ ఓడిపోయిందని, భవిష్యత్తులో అలా జరుగకుండా చూస్తే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమనే ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణ ప్రజల జీవన ముఖచిత్రాన్ని మార్చాలనే ఆలోచనతో, దార్శనికతతో పాలించారని చెప్పారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడంలో మెతక వైఖరిని అవలంబించామని పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇవ్వలేదంటూ కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టలేకపోయమని చెప్పారు. ఉద్యోగులకు 73% జీతాలు పెంచిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ గర్వపడుతుందని, అయినా ఆ వర్గం దూరమైందని పేర్కొన్నారు. 2014లో 29 లక్షల మందికే పింఛన్లు ఉండగా ఆ సంఖ్యను 46 లక్షల మందికి పెంచిన విషయం, 6,47,479 రేషన్కార్డులు ఇచ్చిన విషయం చెప్పుకోలేకపోయామని ఉదహరించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రచారం మీద కంటే పనుల మీదే దృష్టి పెట్టిందని, పనుల మీద కాకుండా ప్రచారం మీద దృష్టిపెడితే రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ సర్కారే అధికారంలోకి వచ్చేదని పేర్కొన్నారు.
దేశంలో ఒక్క పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నాలుగు మెడికల్ కాలేజీలు ఉన్న నియోజకవర్గం మహబూబాబాద్ అని, దేశంలో ఇదొక రికార్డు అని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను కాపాడుకోవాలనే తపనతో కేసీఆర్ చేసిన కృషికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేమి కావాలని ప్రశ్నించారు. ప్రజలకు అన్ని చేసినా దురదృష్టవశాత్తు పార్టీ అధికారంలోకి రాలేదని, పార్టీ కార్యకర్తలు అధైర్యపడొద్దని చెప్పారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తే భవిష్యత్ అంతా బీఆర్ఎస్దేనన్న ధీమా వ్యక్తంచేశారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన బీఆర్ఎస్నే తెలంగాణ ప్రజలు ఆదరిస్తారని ధీమా వ్యక్తంచేశారు.
కార్యకర్తలు, నాయకులకు చిన్న ఆపద వచ్చినా యావత్ పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకునేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేసి, దాని ద్వారా అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టే ఆలోచన ఉన్నదని వెల్లడించారు. అక్రమ కేసుల నుంచి కార్యకర్తలను కాపాడేందుకు లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన విధానం, అవగాహన లేని కారణంగా నాగార్జునసాగర్ కింద సాగునీరు ప్రశ్నార్థకమైందని విమర్శించారు. విద్యుత్పై కొత్త పాలసీ తెస్తామంటున్న ప్రభుత్వం 24 గంటల కరెంట్ను ఎత్తుగొట్టే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. హామీలను అమలు చేయడం చేతగాక కాళేశ్వరం, విద్యుత్తు అవినీతి అంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. కిషన్రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నా రాష్ర్టానికి ఒక్క మేలు జరగలేదని నిప్పులు చెరిగారు.
తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్రెడ్డి లాంటివాళ్లనే ఎదుర్కొన్నామని, సీఎం రేవంత్రెడ్డిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందామని పార్టీ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం రేవంత్రెడ్డికి మోసపూరిత హామీలతో పదవి వచ్చిందని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తోపాటు కృష్ణార్జునులుగా హరీశ్రావు, కేటీఆర్ ఉన్నారని వీరి సారధ్యం లో పార్టీతోపాటు ప్రజలు సుభిక్షంగా ఉంటారని కడి యం శ్రీహరి పేర్కొన్నారు. కాంగ్రెస్లో అప్పుడే కు మ్ములాటలు మొదలయ్యాయని చెప్పారు. ప్రభుత్వంలో తానే నెంబర్ 2 అని పొంగులేటి, తన భర్త కు సీఎం పదవి రాలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి వాపోతున్నారని ఉదహరించారు. లోపాలను సవరించుకొని కార్యకర్తలకు అగ్రనాయకత్వం అందుబాటులో ఉండాలని సూచించారు.
దేశంలో రికార్డుస్థాయిలో పోడుభూములకు పట్టా లు ఇచ్చిన ఘనత కేసీఆర్దేనని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలే అనుకోలేదని, చిన్న పొరపాట్లతో బీఆర్ఎస్ ఓడిపోయిందని తెలిపారు.
తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను పూర్తిగా తిరస్కరించలేదనే విషయాన్ని పార్టీ క్యాడర్ గుర్తించాలని కేటీఆర్ సూచించారు. అసెంబ్లీలో మూడోవంతు సీట్లు (39 ఎమ్మెల్యేలు) ఇచ్చారని, 14 స్థానాల్లో కేవలం ఆరు వేల ఓట్ల తేడాతో ఓడిపోయామని వివరించారు. రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా 1.85 శాతమేనని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి నాయకత్వం సరైన సమయం ఇవ్వలేకపోయిందని ఇకనుంచి తెలంగాణభవన్ కేంద్రంగా తనతోపాటు హరీశ్రావు, ఇతర ముఖ్యనాయకులు అందుబాటులో ఉంటారని చెప్పారు. పార్టీ సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తామని, పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీలు వేసుకొని త్వరలోనే శిక్షణా తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు.
రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ కలలో కూడా ఊహించలేదని, దీంతో నోటికి వచ్చిన హామీలు ఇచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు మాత్రమే కాదని అందులో 420 హమీ లు ఉన్నాయని వివరించారు. సరైన హోంవర్క్ చేయకుండానే ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. హామీల అ మలుకు బీఆర్ఎస్ బాధ్యత గల ప్రతిపక్షంగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తామని ఊదరగొట్టిన కాం గ్రెస్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. హామీల అమలు సాధ్యం కాదని గ్రహించి రేవంత్రెడ్డి సర్కార్ కాలయాపన చేస్తున్నదని ధ్వజమెత్తారు. అందులో భాగంగానే రాష్ట్ర అప్పులపై, కరెంట్పై శ్వేతపత్రాలు విడుదల చేసిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ స్వేదపత్రంతోపాటు కాంగ్రెస్ 420 హామీలను ఇంటింటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.