KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది. లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ సర్వీసెస్ సంస్థ ప్రాగ్మాటిక్ డిజైన్ సొల్యూషన్స్ లిమిటెడ్ (PDSL), యూకేలోని వార్విక్ టెక్నాలజీ పార్క్లో ఏర్పాటుచేసిన తమ నూతన కేంద్రాన్ని ప్రారంభించాల్సిందిగా కేటీఆర్ను ఆహ్వానించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద, విలువైన కారు బ్రాండ్ అయిన మైక్లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి ప్రముఖ ఆటో దిగ్గజాలకు పీడీఎస్ఎల్ సేవలు అందిస్తోంది. గత 15 ఏళ్లకు పైగా ఈ సంస్థ ఆటోమోటివ్ పరిశ్రమలో అనేక ఉత్పత్తులను, సేవలను అందిస్తూ కొనసాగుతోంది. తమ నూతన కేంద్రం ద్వారా ఆటోమోటివ్ డెవలప్మెంట్, టెస్టింగ్ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు పీడీఎస్ఎల్ సంస్థ పేర్కొంది.
ఈ నెల 30వ తేదీన యూకేలోని వార్విక్ యూనివర్శిటీ సైన్స్ పార్క్లోని పరిశోధన కేంద్రాన్ని కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటుచేసిన ఈ కేంద్రాన్ని కేటీఆర్ ప్రారంభించాలని సంస్థ ఇవాళ ఆహ్వానం పంపింది.
తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ, ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్లో అగ్రగామిగా తీర్చిదిద్దిన కేటీఆర్ నాయకత్వాన్ని గౌరవంగా గుర్తించిన పీడీఎస్ఎల్, తమ ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించుకోవడం గర్వకారణంగా భావిస్తోంది. “ఇన్నోవేషన్ మరియు రీసెర్చ్ రంగాల పట్ల కేటీఆర్ గారి వినూత్నమైన విప్లవాత్మకమైన దృక్పథం.. అంతర్జాతీయ స్థాయిలో భాగస్వామ్యాల స్థాపన, ఇన్నోవేషన్ ప్రోత్సాహానికి ఆయన పెట్టిన కృషి మా సంస్థ విధానాలకు అనుగుణంగా ఉంది. ఆయన చేతుల మీదుగా మా కేంద్రం ప్రారంభం కావడం గర్వకారణం.” అని సంస్థ డైరెక్టర్ క్రాంతి పుప్పాల తెలిపారు. పీడీఎస్ఎల్ సంస్థ ఆహ్వానం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తాను వ్యక్తిగతంగా ప్రారంభోత్సవానికి హాజరవుతానని తెలిపారు.