Telangana | న్యూఢిల్లీ, నవంబర్ 4: కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వాపు చూసి బలుపు అనుకొన్నదని తేలిపోయింది. అంతన్నాడింతన్నాడే గంగరాజు అన్నట్టు పోలింగ్ దగ్గరపడుతున్నాకొద్ది ఆ పార్టీ బలం కొడిగడుతున్నదని తాజా సర్వేలో వెల్లడైంది. అధికార పార్టీ బీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీ సాధించి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందని తేల్చిచెప్పింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఏబీపీ-సీవోటర్ సంస్థ మరోసారి నిర్వహించిన సర్వే ఫలితాలను శనివారం ప్రకటించింది. ఈ సర్వేలో బీఆర్ఎస్ 49 నుంచి 61 సీట్ల వరకు గెలుచుకొంటుందని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ 43 నుంచి 55 సీట్లకే పరిమితమవుతుందని పేర్కొన్నది. బీజేపీకి 5 నుంచి 11 మధ్య, ఇతరులకు 4-10 మధ్య సీట్లు రావచ్చని తెలిపింది.
నెలలోనే స్పష్టమైన మార్పు
నిజానికి తెలంగాణలో బీఆర్ఎస్ ఏనాడూ బలహీనంగా లేదు. విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఎన్నడూ బీఆర్ఎస్తో పోటీపడే స్థాయిలో లేవు. అయితే, ఏబీపీ-సీవోటర్ సర్వే అక్టోబర్లో నిర్వహించిన సర్వేలో ఎన్నికల్లో బీఆర్ఎస్కంటే కాంగ్రెస్ అధిన స్థానాలు సాధిస్తుందని తెలిపింది. కాంగ్రెస్కు 48-60 సీట్లు, బీఆర్ఎస్కు 43 నుంచి 55 సీట్లు రావచ్చని విశ్లేషించింది. నెల తర్వాత మళ్లీ సర్వే నిర్వహించింది. ఈ సర్వే సమయానికి కాంగ్రెస్ పార్టీ దాదాపు 10 సీట్ల వరకు బలం కోల్పోయిందని వెల్లడించింది.
ఎన్నికల కోసం అభ్యర్థుల ప్రకటన మొదలైన తర్వాత కాంగ్రెస్లో అసలు డొల్లతనం బయటపడింది. టికెట్ల ఆశించి భంగపడ్డ నేతలు పార్టీ కార్యాలయాలపైనే దాడులకు తెగబడటం, టికెట్లు వచ్చిన వారికి రెబల్స్ బెడత తీవ్రం కావటంతో ఆ పార్టీ మెజారిటీ సీట్లు సాధించే అవకాశమే లేదని సర్వే తేల్చింది. మరోవైపు ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్.. గత పదేండ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు స్పష్టంగా వివరిస్తుండటంతో న్యూట్రల్గా ఉన్న ఓటర్లు కూడా ఆ పార్టీవైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నది.
బీఆర్ఎస్కు 72 స్థానాలు: ఇండియా టీవీ
ఇండియా టీవీ సర్వేలో కూడా బీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని తేలింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 72 స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తుందని తేల్చింది. కాంగ్రెస్ 33 స్థానాలకే పరిమితమవుతుందని వెల్లడించింది. బీజేపీ 6, ఎంఐఎం 7, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.