Bandi Sanjay | హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ నెట్వర్క్): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మహిళాలోకం భగ్గుమన్నది. తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. నోరును అదుపులో పెట్టుకోకపోతే తగినశాస్తి తప్పదని హెచ్చరించింది. శనివారం గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీఆర్ఎస్ శ్రేణులు, పలు మహిళా సంఘాలు, జాగృతి శ్రేణులు బండి సంజయ్పై నిరసన చేపట్టాయి. ప్రధాని మోదీ, బండి సంజయ్ దిష్టిబొమ్మలు దహనం చేశాయి. మహిళా నాయకులు ఆగ్రహంతో బండి సంజయ్ దిష్టిబొమ్మలను చెప్పులతో కొడుతూ దహనం చేశారు. బండిని కఠినంగా శిక్షించాలని, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఢిల్లీ తెలంగాణభవన్ ముందు బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేపట్టారు.
బండి దిష్టిబొమ్మను చెప్పుతో కొడుతూ హైదరాబాద్లోని తెలంగాణ భవన్ సమీపంలోనూ బీఆర్ఎస్కేవీ నాయకులు రాంబాబు యాదవ్, రూప్సింగ్, నల్లా భారతి, బాబాయమ్మ, సెలయేరు ప్రభాకర్ తదితరులు ప్రధాని మోదీ, బండి సంజయ్ దిష్టిబొమ్మలకు శవయాత్ర చేసి దహనం చేశారు. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు, ఈడీ అక్రమ కేసులను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు దానం నాగేందర్, తలసాని సాయికిరణ్యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఈడీ కార్యాలయం వద్ద శనివారం దిష్టిబొమ్మ దహనం చేశారు. అక్రమ కేసులను సహించబోమని దానం నాగేందర్ అన్నారు.
బండి క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రంలో తిరుగనివ్వమని తలసాని సాయికిరణ్ హెచ్చరించారు. గోషామహల్ అసెంబ్లీ బీఆర్ఎస్ నాయకులు ఆశీశ్కుమార్యాదవ్ ఆధ్వర్యంలోనూ ఈడీ ఆఫీస్ను ముట్టడించారు. బండి సంజయ్ను మహిళలతో చీపురు దెబ్బలు కొట్టిస్తామని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హెచ్చరించారు. కీసరలో శనివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ మెంటలోడని, మహిళలపై ఇష్టారీతిగా నోరుపారేసుకుంటారని ధ్వజమెత్తారు. పిచ్చి పట్టినట్టుగా వ్యవహరిస్తున్న బండిని ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్పించాల్సి వస్తుందని మల్లారెడ్డి మండిపడ్డారు.
బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, పార్టీ నేతలు బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో బండి సంజయ్ దిష్టి బొమ్మను గాడిదపై ఊరేగించి దగ్ధం చేశారు. గవర్నర్కు ఫిర్యాదు చేసేందుకు రాజ్భవన్కు వెళ్లిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే గొంగడి సునీత, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డితోపాటు పలువురు బీఆర్ఎస్ నేతలను అనుమతించకపోవడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు రాజ్భవన్ ముందు రోడ్డుమీద బైఠాయించారు. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఉమ్మడి పది జిల్లాలవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. నిరసన ర్యాలీలు నిర్వహించారు. బండి దిష్టిబొమ్మ, ఫ్లెక్సీలను దహనం చేశారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్ దిష్టిబొమ్మను బర్రెపై ఊరేగించారు.
ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ తదితర రాష్ర్టాల్లో నిరసనలు జరిగాయి. ఏపీలోని విశాఖపట్నం జీవీఎంసీ సెంటర్లోని గాంధీ విగ్రహం వద్ద జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
బండి సంజయ్ను కఠినంగా శిక్షించాలని రాష్ట్రంలోని దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లలో బీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ సోషల్మీడియా నాయకులు మాత్రమే కాకుండా కొన్నిచోట్ల స్వచ్ఛందంగా మహిళలు పోలీస్స్టేషన్లకు వెళ్లి బండి సంజయ్పై ఫిర్యాదు చేయటం గమనార్హం.