సంగారెడ్డి : ఆటో కార్మికుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. పటాన్చెరువు ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు శుక్రవారం హరీష్రావును కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ జీవితాలు దయనీయంగా మారాయని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి తమను మోసం చేశారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాడాలని వారు కోరారు.
ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల వ్యవధిలో 142 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. అవి ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనని మండపడ్డారు. ఆటో కార్మికులకు ఏడాదికి రూ.12,000 భృతి ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని, ఇప్పుడు ఆటో కార్మికుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని విమర్శించారు.
ఆటో కార్మికులు తమ ఆటోలు నడవక, బ్యాంకుల కిస్తీలు చెల్లించలేక ఆర్థికంగా కుదేలవుతున్నారని హరీష్రావు అన్నారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆటో కార్మికులు తమ కుటుంబాల పోషణ భారంగా మారి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వేదికగా కూడా ఆటో కార్మికుల పక్షాన బీఆర్ఎస్ మాట్లాడిందని గుర్తుచేశారు.
కార్మికుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని, ఆటో కార్మికులకు కేసీఆర్ అండగా ఉంటారని హరీష్రావు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేసి, ఆటో కార్మికులకు భద్రత కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు. చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు కనీసం రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయాలని సూచించారు.
అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏడాది రూ.12 వేల చొప్పున రెండేళ్లుగా ఒక్కో ఆటో కార్మికుడికి బాకీపడిన రూ.24 వేలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.