హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన కల్వకుంట్ల కవిత రాజకీయాలకు పనికిరారని బీఆర్ఎస్ఎల్పీ విప్ కేపీ వివేకానంద విమర్శించారు. తెలంగాణ భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ను తెలంగాణ సమాజం పెద్ద దిక్కుగా భావిస్తారని, ఆయన సాదాసీదా నాయకుడు కాదని, అలాంటి వ్యక్తిపై కవిత చేసిన వ్యాఖ్యల పట్ల యావత్ తెలంగాణ సమాజం చీత్కరించుకుంటున్నదని మండిపడ్డారు. పద్నాలుగేండ్ల పాటు ఉద్యమం నడిపి, తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలతో కవిత తన విలువలను కోల్పోయారని విమర్శించారు.
కవిత ఎవరి చేతిలో కీలు బొమ్మగా మారారో ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు అర్థమైందని అన్నారు. తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ అధినేత కేసీఆరే అని పునరుద్ఘాటించారు. ప్రజాపాలన ప్రగతి నివేదిక 99 రోజల కార్యక్రమం అన్నారు కానీ, అందులో ఇప్పటికే 60 రోజులు పూర్తయిందని ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించలేదని విమర్శించారు.
రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో ప్రజలను వంచించే పాలన నడుస్తున్నదని, మొదటి దఫా తీసుకున్న దరఖాస్తులతోనే కాలం గడుపుతున్నారని వివేకానంద మండిపడ్డారు. రాష్ట్రంలో కొత్తగా సంక్షేమ పథకాలు ప్రకటించకపోగా.. ఉన్న వాటిని కూడా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి కూడా మంచి చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం తాగటానికి నీరు లేక మహిళలు బిందెలతో రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో తాగు నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగను అని శపథం చేసిన నాయకుడు కేసీఆర్ అని గుర్తుచేశారు. రాష్ట్రంలో చాలాచోట్ల ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయని చెప్పారు. రాజీవ్ యువ వికాసం ప్రకటించి ఏడాదైనా.. ఒక్కరికైనా అందిందా? అని ప్రశ్నించారు.
‘కవిత వెనుక ఎవరున్నారో ప్రజలకు అర్థమైంది సీఎం రేవంత్రెడ్డీ’ అని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వ్యాఖ్యానించారు. వికారాబాద్లో రైతుల భూములు గుంజుకున్న నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్రావు అక్కడికి వెళ్తే. ఆయనతోపాటు తమను కూడా హౌస్అరెస్టు చేశారని, కానీ కవిత వస్తే.. ఆమెకు రక్షణగా 100 మంది పోలీసులు వచ్చారని దుయ్యబట్టారు. పోలీసుల సాయంతో కవిత ధర్నా చేసుకుని వెళ్లిపోయారని విమర్శించారు. రేవం త్ పనుల వల్ల కాంగ్రెస్ 20 ఏండ్ల దాకా కనుమరుగు అవుతుందని అన్నారు.