మహదేవపూర్, జూన్ 30 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ వార్డు సభ్యుడు సమ్మ రాజు మాట్లాడిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానించిన ఆ పార్టీ నాయకులకు ‘సచ్చేదాకా బీఆర్ఎస్ జెండా మోస్త.. నా పార్టీని వదిలే ప్రసక్తే లేదు’ అంటూ స్పష్టంచేశారు. ఈ ఆడియోను బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
ఈ పోస్ట్కు విశేష స్పందన లభించగా, సామాజిక మాధ్యమాల్లో ఆడియో వేగంగా వైరల్ అవుతున్నది. అన్నారం గ్రామానికి చెందిన ఆ కార్యకర్త పార్టీపై తన విధేయతను, ఆత్మాభిమానాన్ని వ్యక్తంచేసిన తీరు బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. అధికారం కోసం పార్టీ మారడం కంటే సిద్ధాంతాలు, నమ్మకాలకు కట్టుబడి ఉండటమే ముఖ్యమనే సందేశాన్ని ఆయన మాటల్లో ప్రతిబింబిస్తున్నట్టు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పేరొంటున్నారు.
కాంగ్రెస్ నాయకుడు : పార్టీల కలుత్తాండ్రు వీళ్లంతా..
బీఆర్ఎస్ వార్డు సభ్యుడు : ఎవరెవరు?
కాంగ్రెస్ నాయకుడు : ఉపసర్పంచ్, వీళ్లంతా.. గవర్నమెంట్ ఉన్నది కాబట్టి పావలా పరకో సంపాదించుకోవచ్చు.. మళ్లా నువ్వు పెద్ద లీడర్ అయితవ్
బీఆర్ఎస్ వార్డు సభ్యుడు : కరెక్టే కానీ, నేను రాలేను బావా! నేను సచ్చినా కూడా రాలేను.. రాను.. రాను..
కాంగ్రెస్ నాయకుడు : కారణమేంటోయ్?
బీఆర్ఎస్ వార్డు సభ్యుడు : కారణం ఏమీ లేదు.. నేను రాలేను.. అంతే
కాంగ్రెస్ నాయకుడు : మనోనికి ఇల్లు వస్తది కదా..
బీఆర్ఎస్ వార్డు సభ్యుడు : మనోనికి ఇల్లు వచ్చినా, రాకపోయినా వద్దు.. అంతే సచ్చేదాక నేను ఇదే బీఆర్ఎస్ జెండానే మోస్త.. రాలేను నేను