BRS Walkout | అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అసెంబ్లీలో మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ సభ్యులు అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన దాటవేసే ధోరణిలో సమాధానం ఇవ్వడంపై కేటీఆర్ మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనపై రేవంత్ సర్కార్ తీరుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నామని కేటీఆర్ అసెంబ్లీలో తెలిపారు. ప్రభుత్వం దగ్గర పైసలు లేవు.. ప్రణాళికలు లేవని విమర్శించారు. మూసీ ప్రక్షాళనకు మేం వ్యతిరేకం కాదు.. లక్షన్నర కోట్ల దోపిడీకి మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు.
మూసీ ప్రక్షాళనపై అసెంబ్లీలో బుధవారం జరిగిన చర్చ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. మూసీ ప్రాజెక్టు కోసం రుణం మంజూరైందని గతంతో మంత్రి చెప్పారని తెలిపారు. డీపీఆర్ కూడా సబ్మిట్ చేయలేదని అప్పుడు ఏడీబీ చెప్పిందని పేర్కొన్నారు. రుణం మంజూరు కాలేదని ఈ నెల 11వ తేదీన ఏడీబీ లేఖ ఇచ్చిందన్నారు. డీపీఆర్ తయారీకి 18 నెలలు పడుతుందని గతంతో ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు. 18 నెలలు పడుతుందన్న డీపీఆర్ రెండు నెలల్లో ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
మూసీ ప్రాజెక్టు మొదటి ఫేజ్ తర్వాత ఎన్ని ఫేజులు ఉంటాయని కేటీఆర్ అడిగారు. మూసీ ప్రాజెక్టుకు ఎన్ని ఫేజులు ఉన్నాయని ప్రశ్నించారు. రూ.16వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు లక్షన్నర కోట్లు ఎం దుకు అని నిలదీశారు. మూసీ ప్రాజెక్టులో బఫర్ జోన్ ఎంత అని ప్రశ్నించారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుతో వేలాది మంది నష్టపోతున్నారని తెలిపారు. మూసీ ప్రాజెక్టుతో రేవంత్ సర్కార్ గృహ మేధ యాగం చేస్తోందని మండిపడ్డారు. బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీలకు కాంట్రాక్టు ఎందుకిస్తున్నారని ప్రశ్నించారు. డీపీఆర్ లేకుండా హడావిడిగా ఇళ్లు ఎందుకు కూలుస్తున్నారని అడిగారు. కేటీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన ప్రభుత్వం.. దాటవేసే ధోరణిలో వ్యవహరించింది. దీంతో బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. మూసీపై రేవంత్ సర్కార్ తీరుకు నిరసన తెలిపారు.