హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ స్థానిక సంస్థల ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రహమత్ బేగ్ను ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఎంఐఎం అభ్యర్థన మేరకు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. పార్టీ సీనియర్ నేతలతో చర్చించిన అనంతరం ఎంఐఎం అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సయ్యద్ అమీనుల్ హస్సన్ జాఫ్రీ పదవీ కాలం ఈ ఏడాది మే ఒకటో తేదీన ముగియనున్నది. ఖాళీ కానున్న ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వచ్చే నెల 13న హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంతోపాటు హైదరాబాద్ స్థానిక సంస్థల స్థానానికి ఎన్నిక జరుగనున్నుది. ఎంఐఎంకు బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడంతో విజయం సునాయాసం కానున్నది.
గతంలో ఎమ్మెల్యే పీఏగా..
పదేండ్ల క్రితం మీర్జా రహమత్ బేగ్.. మాజీ ఎమ్మెల్యే అహ్మద్ పాషాఖాద్రీ వద్ద కారు డ్రైవర్గా, కొంతకాలం పీఏగాను పనిచేశారు. గోల్కొండ సమీపంలోని ఇబ్రహీం బాగ్ అధ్యక్షుడిగా బేగ్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని శాస్త్రిపురం, సులేమాన్నగర్ డివిజన్లకు ఇంచార్జిగా పనిచేసిన సందర్భంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపునకు కృషిచేశారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం 2018లో రాజేంద్రనగర్ నుంచి బేగ్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టింది. టీఆర్ఎస్ అభ్యర్థి టీ ప్రకాశ్గౌడ్ చేతిలో ఓటమి చెందారు. ప్రస్తుతం బేగ్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎంఐఎం ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు.
బయోడేటా
అభ్యర్థి పేరు: మీర్జా రహమత్ బేగ్
తండ్రి పేరు: మీర్జా సాహెబ్ బేగ్ (లేట్) వయస్సు: 36 వృత్తి: వ్యాపారం
రాజకీయ నేపథ్యం: ఎంఐఎం పార్టీలో క్రియాశీల నాయకుడు
విద్యార్హత: 1990లో 5వ తరగతి ఉత్తీర్ణత. 7వ తరగతి (మధ్యలోనే విద్యాభ్యాసం ఆగింది.)
పాఠశాల పేరు: లిల్లీ ఫ్లవర్ స్కూల్, నార్సింగి, రాజేంద్రనగర్