17న రాష్ట్రవ్యాప్తంగా జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి. పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. సెప్టెంబర్ 17 సువిశాల భారత్లో తెలంగాణ అంతర్భాగంగా మారిన రోజు..రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిన సుదినం.
– కేటీఆర్
KTR | హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు, ప్రజలు జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. తెలంగాణ భారత సమాఖ్యలో విలీనమైన 17వ తేదీని జాతీయ సమైక్యత దినోత్సవంగా రాష్ట్ర ప్రజలు జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో నిర్వహించే వేడుకల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పాల్గొంటారని తెలిపారు.
ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించే సంబురాల్లో మంత్రులు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేస్తారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఎకడికకడ జాతీయ సమైక్యతా దినోత్సవాల్లో పాల్గొనాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదేండ్లలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జోడెద్దులుగా దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు ప్రతి అంశాన్ని రాజకీయం చేసే దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రజలు సంబురంగా జరుపుకొనే జాతీయ సమైక్యత దినోత్సవంపై కూడా కొన్ని పార్టీలు రాజకీయ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రతి అంశానికి మతాన్ని జోడించి సమాజంలో చిచ్చుపెట్టే విచ్ఛిన్నకర శక్తుల కుట్రలను ప్రజలు గమనించి జాగ్రత్తగా ఉండాలని కోరారు.
దేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిన రోజు
1948 సెప్టెంబర్ 17 సువిశాల భారత్లో తెలంగాణ అంతర్భాగంగా మారిన రోజు అని, రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిన రోజు అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక స్వేచ్ఛ వైపు పరివర్తన చెందడానికి యావత్ తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేసిన మహోజ్వల సందర్భం అందరికీ గుర్తుంటుందని తెలిపారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి, తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే ఎత్తుగడలకు విచ్చిన్నకర శక్తులు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. నాటి చరిత్రతో, పరిణామాలతో సంబంధమే లేని అవకాశవాదులు, చిల్లర రాజకీయాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు. అత్యంత మేథో సంపత్తితో, క్రియాశీలతతో చురుకుగా స్పందించే తెలంగాణ సమాజం.. అదే చైతన్యాన్ని ప్రదర్శించి, తెలంగాణ జీవనాడిని కలుషితం చేయాలని చూస్తున్న శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.