Deeksha Divas | పద్నాలుగేండ్ల కిందట.. ఇదే రోజు! 2009 నవంబర్ 29.. ఓ బక్క మనిషి దీక్షబూనాడు. అత్యంత సాహసానికి పూనుకున్నాడు. ఆ రోజు ఆయన మనోబలం వజ్ర సదృశం. తెలంగాణ సాధించాలన్న పంతమే.. ఆయన సంకల్పానికి ఉక్కు కవచం. ‘ఇది మనకు అంతిమ యుద్ధం..’ పిడికిలెత్తి ప్రకటించాడు ఉద్యమ కేసరి కేసీఆర్.
‘తెలంగాణ జైత్రయాత్రనా.. కేసీఆర్ శవయాత్రనా’ అని గొంతుక నరాలు తెగేలా నినదించాడు. ఆ పిలుపు.. తెలంగాణ ఊరూరా ప్రతిధ్వనించింది. వాడవాడనూ కదిలించింది. ప్రతీ తెలంగాణ బిడ్డను పిడికిలి బిగించేలా చేసింది.
పొద్దున నిలారం ఉంటే.. సాయంత్రానికి ఆగమైతదేమో అనుకునేంత బక్కపల్చటి శరీరం. కానీ, దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయానికి ఉడుకెత్తి ఉన్న రక్తం.. సలసలా మరుగుతూ దీక్షబూనమని ప్రేరేపించింది. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహానికి మండిన ఆయన గుండె.. ‘తెలంగాణ వొచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అన్న నిర్ణయానికి వచ్చేలా చేసింది. ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని చేసిన వాగ్దానానికి కాలదోషం పట్టేలా హస్తిన పెద్దలు వేసిన ఎత్తులకు.. పైఎత్తుగా కేసీఆర్ సంధించిన బ్రహ్మాస్త్రం ఆమరణ దీక్ష.
తెలంగాణ కణకణ రగులుతున్న వేళ, కరీంనగర్లో కేసీఆర్ దీక్షకు బైఠాయించడంతో నాటి ప్రభుత్వం భయపడింది. ఆయనను అరెస్టు చేసి, ఖమ్మం జైలుకు తరలించింది. ఉద్యమ నేత అరెస్టుతో తెలంగాణ అగ్నిగుండమైంది. 11 రోజులపాటు చేసిన దీక్షకు మద్దతుగా ఉద్యమంలో ఊరూరూ ఉప్పెనై ఎగిసింది. నిరసన సెగ ఢిల్లీకి తగిలింది. అప్పటికే 33 పార్టీలు తెలంగాణకు మద్దతివ్వడం, రాష్ట్రపతి ప్రసంగంలోనూ రాష్ట్ర ఏర్పాటును ప్రస్తావించడంతో కేంద్రం దిగిరాక తప్పలేదు. తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ 9నాటి ఆ ప్రకటనకు కారణమైంది నవంబర్ 26నాటి కేసీఆర్ దీక్ష. ఆ తర్వాత కూడా కేంద్రం మాట తప్పడంతో, తెలంగాణ ఉద్యమం శిఖరాగ్రానికి చేరుకున్నది. కేసీఆర్ సారథ్యంలో ప్రజలు కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించేదాక శాంతించలేదు. తెలంగాణ రాష్ట్ర సాధనకు మూల కారణమైన, కేసీఆర్ దీక్షబూనిన రోజును తెలంగాణ గుండెల్లో పెట్టుకున్నది. ఏటా నవంబర్ 29ని దీక్షాదివస్గా జరుపుకొంటున్నది.
నేడు దీక్షా దివస్!