హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే సాధించిన విజయాలను చూసి దేశం అబ్బురపడుతున్నదని బీఆర్ఎస్ పార్టీ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు చెప్పారు. లోక్సభలో జరిగే చర్చల సందర్భంగా తాను తెలంగాణ సాధించిన విజయాల గురించి చెప్తుంటే.. చాలామంది ఎంపీలు ఆశ్చర్యపోయారని అన్నారు. ఇది నిజమేనా? అంటూ తనను అడిగేవారని, తెలంగాణకు వచ్చి చూడాలని తాను వారితో చెప్పానని నామా వెల్లడించారు. నెహ్రూ తర్వాత దేశం గురించి పట్టించుకున్న నేతలెవరూ లేరని, ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న రాజకీయ పార్టీ ప్రజల గురించి ఆలోచించడం లేదని అన్నారు. 25 ఏండ్లుగా నదుల అనుసంధానంపై చర్చ జరుగుతూనే ఉన్నదని, ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదని చెప్పారు. గోదావరి నీటిని 600 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి, బీడుభూములకు నీళ్లు ఇచ్చామని, ఇది కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే సాధ్యమైందని అన్నారు. రైతుబంధు, దళితబంధు, మిషన్ భగీరథ లాంటి అనేక అద్భుతాలను తెలంగాణ సాధించి చూపిందని వివరించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను చాలా ప్రభుత్వాలు తమ తమ రాష్ర్టాల్లో ప్రవేశపెట్టాయని, కేంద్రప్రభుత్వం కూడా ‘హర్ ఘర్ జల్’ యోజన సహా అనేక పథకాలను తెలంగాణలో చూసే కాపీ కొట్టిందని అన్నారు. గుజరాత్లో బీజేపీ రాజకీయంగా గెలిచిందే కానీ, అభివృద్ధిపరంగా చూస్తే తెలంగాణ కన్నా ఆ రాష్ట్రం వెనుకబడే ఉన్నదని తెలిపారు. ఇప్పటికీ తాగునీటి సమస్యలు వీడలేదని, సరైన విద్యుత్తు సౌకర్యంలేని పల్లెలు కనిపిస్తాయని, 24 గంటల విద్యుత్తు కూడాఅక్కడలేదన్నారు. దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కొత్తశకం ప్రారంభమైందన్నారు. ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా బీఆర్ఎస్ ఉంటుందని, జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ అత్యంత కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు.