హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన విభజన హామీల సాధన కోసం బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ నేతృత్వంలో త్వరలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్టు పార్టీ నేతలు చెప్పారు. ఏపీలోని గుంటూరు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం పార్టీ నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర నేతలు జేటీ రామారావు, షేక్ బాషా మాట్లాడుతూ.. తమకు అధికారమిస్తే కేంద్రం మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు. విజభన హామీల అమలులో వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసగించిందని మండిపడ్డారు. టీడీపీ, వైసీపీ కేంద్రంలోని బీజేపీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబ్బు పుల్లారావునాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రానికి రాజధాని ఏదో చెప్పుకోలేని అయోమయ స్థితిలో రాష్ట్ర ప్రజానీకమున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
షేక్ ఖాజావలి మాట్లాడుతూ.. వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి ఏపీలో శాంతిభద్రతలు అదుపులో లేవని విమర్శంచారు. తిరుమలనాయుడు మాట్లాడుతూ.. తెలంగాణ మాడల్ అభివృద్ధి జరగాలంటే ఏపీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు గిద్దా శ్రీనివాసనాయుడు, కే భాసర్, కే లక్ష్మికమల, సైదావలి, నళిని కాంత్ తదితరులు పాల్గొన్నారు.