హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ‘పార్టీకి మీరే బలం.. మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం’ అని బీఆర్ఎస్ నేత లు పార్టీ కార్యకర్తలకు అభయమిస్తున్నారు. రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జోరుగా సాగుతున్నాయి. కార్యకర్తలు తమ కుటుంబ సభ్యులతో హాజరవుతున్నారు. కష్టసుఖాలు మాట్లాడుకుంటున్నారు. వీరి సమస్యలు విన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు వాటిని పరిష్కరించడంతోపాటు అండగా ఉంటామని భరోసా కల్పిస్తున్నారు. ఆటపాటలతో సభా వేదిక ప్రాంతమంతా సందడిగా మారుతున్నది. అంతా కలిసి భోజనం చేస్తుండటంతో కుటుంబ వాతావరణం కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నది. ఆదివారం కూడా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు జరిగాయి.
‘కేసీఆర్ అనే అద్భుత దీపం వల్లనే రాదన్న తెలంగాణ వచ్చింది.. కానే కాదన్న కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అర కిలోమీటరు ఎత్తులో ఉన్న రంగనాయకసాగర్కు గోదావరి నీళ్లు తెచ్చుకున్నం.. తెలంగాణ అంటే ప్రతిపక్షాలకు పెదాలపై మాత్రమే ఉంటుంది.. అదే కేసీఆర్కు గుండె నిండ ప్రేమ ఉంటుంది’ అని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం బుగ్గరాజేశ్వరస్వామి దేవాలయ ఆవరణలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రితోపాటు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ పాల్గొన్నారు. కాగా, బీజేపీ పాలిస్తున్న 20 రాష్ర్టాల్లో తెలంగాణ లాంటి పథకాలు అమలు చేస్తున్నారా? అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. వనపర్తి జిల్లా మదనాపురంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. గుజరాత్లోనూ ఇలాంటి సంక్షేమ పథకాలు లేవన్నారు. ప్రధాని మోదీ ప్రపంచంలోనే పెద్ద మోసకారి అని, ఆయన చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారిలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. మోదీ అదానికి బినామీగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ సమ్మేళనంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే జాజాల సురేందర్, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఆత్మీయ సమ్మేళనంలో ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల మాట్లాడుతూ..దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్న బీజేపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఇందులో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొలేటి దామోదర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్నేత, ఎమ్మెల్సీ ఎల్ రమణ పాల్గొన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్సే శ్రీరామరక్ష అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఆత్మీయ సమ్మేళనంలో ఎర్రబెల్లితోపాటు మంత్రి సత్యవతి, ఎమ్మెల్యే రెడ్యానాయక్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఎంపీ కవిత, జడ్పీ చైర్పర్సన్ బిందు హాజరయ్యారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెదమడూరులోనూ ఎర్రబెల్లి పాల్గొన్నారు.
ఆడబిడ ్డఎదుగుతుంటే బాధపడుతుండే వాల్లం. ఎంత పనిచేసినా డబ్బులు ఇంటి ఖర్చులకే సరిపోయేది. కుటుంబం గడువక ఇబ్బందులు ఎడేటోళ్లం. కూతురు పెండ్లి కుదిరింది. కానీ.. పెండ్లి ఎట్ల చేయాలని ఆలోచనలో పడ్డాం. కేసీఆర్ సారు పెట్టిన కల్యాణలక్ష్మి పథకంలో నా బిడ్డ పెండ్లికి రూ.1.16 లక్షల చెక్కు వచ్చింది. పెండ్లి ఖర్చుకు సరిపోయింది. మా కుటుంబాన్ని ఆదుకున్న దేవుడు కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటం.
– శాగంటి స్వర్ణలత, కల్యాణలక్ష్మి లబ్ధిదారు, భీమారం