Y Satish Reddy | కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో జరిగిన ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్ రెడ్డి కోరారు. ఈ ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 11న ఘటన జరిగిన తర్వాత రాత్రి గ్రామంలోకి వెళ్లిన పోలీసులు లంబాడా బిడ్డలతో దుర్మార్గంగా వ్యవహరించారని స్థానికులు చెబుతున్నారని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మహిళలతో చాలా నీచంగా వ్యవహరించారని, యువతులు, మహిళలు, వృద్ధుల శరీరభాగాలను తడిమారని ఆ ఆడబిడ్డలు చెబుతుంటే కన్నీళ్లు ఆగడం లేదన్నారు.
ఓ లంబాడ వృద్ధురాలి నుదుటిపై కొడితే చర్మం కమిలిపోయిందని వై సతీశ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.. మరో మహిళ తొడపై లాఠీతో కొడితే చర్మం కమిలిపోయి నడవలేని పరిస్థితిలో ఉందన్నారు. మరో మహిళ చేతిపై, మెడపై దాడి చేయడంతో గోర్లు గీరుకుపోయి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. అర్థరాత్రి గ్రామంలోకి వెళ్లి గిరిజన మహిళలతో దుర్మార్గంగా వ్యవహరించిన పోలీసులపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవహక్కుల కమిషన్ స్పందించాలని కోరారు. ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నీచంగా వ్యవహరించిన పోలీసులు, పోలీసు ఉన్నతాధికారులు, వారికి ఆదేశాలిచ్చిన ప్రభుత్వ పెద్దలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.