హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయించిన ఎంపీ కే కేశవరావుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి పదవి ఇస్తుందా? బీఆర్ఎస్లో దక్కినంత గౌరవం దక్కుతుందా? అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ప్రశ్నించారు. ‘కడుపునిండా తిన్నంక గారెలు చేదు’ అన్నట్టు కేకే వ్యహారం ఉన్నదని ఎద్దేవాచేశారు. బీఆర్ఎస్లో సకల భోగాలు అనుభవించి ఇప్పుడు అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. తన కుటుంబాన్ని కేటీఆర్ చీల్చారంటూ కేకే చిల్లర ఆరోపణలు చేస్తున్నారని ఆదివారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. కేకే తన కుటుంబాన్ని తానే, తన స్వహస్తాలతో చీల్చుకున్నారని ఆరోపించారు. కూ తురి రాజకీయ భవిష్యత్తు కోసం కొడుకును దూరం చేసుకున్నారని తెలిపారు.
కొడుకును పార్టీ మారాలంటూ అర్ధరాత్రి మెసేజ్లు పెట్టి వేధించి దూరం చేసుకున్నారని పేర్కొన్నారు. తాను చేసిన తప్పునకు కేటీఆర్పై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. కేశవరావుకు బీఆర్ఎస్లో ఇచ్చిన గౌరవం దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎకడా దొరకలేదని చెప్పారు. కేకేకు రెండుసార్లు రాజ్యసభతోపాటు పార్టీ సెక్రెటరీ జనరల్ హోదా ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని పేర్కొన్నారు. కేకే కుటుంబానికి కూడా కేసీఆర్ ఇచ్చినంత గౌరవం మరొకరు ఇవ్వలేదని తెలిపారు. తన కూతురు విజయలక్ష్మికి జీహెచ్ఎంసీ మేయర్ పదవి దక్కించుకున్న కేకే.. బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లాక తన కొడుకుకి ఎమ్మెల్సీ ఇవ్వలేదని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఆయన కుట్రలు ఎట్టి పరిస్థితుల్లోనూ సఫలీకృతం కావని పేర్కొన్నారు.