హైదరాబాద్ : కె.కేశవరావు(Keshava Rao )వ్యవహారం కడుపునిండా తిన్నాక గారెలు చేదు అన్నట్టుగా ఉంది. బీఆర్ఎస్(BRS) పార్టీలో సకల భోగాలు అనుభవించి ఇప్పుడు అవాకులు చవాకులు పేలుతున్నారు. కేటీఆర్ తన కుటుంబాన్ని చీల్చారంటూ చిల్లర ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి( Y Satish Reddy) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేకే కుటుంబాన్ని ఆయనే స్వహస్తాలతో చీల్చుకున్నారు.
కూతురి రాజకీయ భవిష్యత్తు కోసం కొడుకును దూరం చేసుకున్నారని చెప్పారు. కొడుకును పార్టీ మారమని అర్ధరాత్రి మెజులు పెట్టి వేధించింది దూరం చేసుకున్నది ఆయనేనని పేర్కొన్నారు. తాను చేసిన తప్పుకు కేటీఆర్ పై విమర్శలు చేయడం అంత చిల్లర పని మరొకటి లేదని విమర్శించారు. కేశవరావుకు బీఆర్ఎస్లో ఇచ్చిన గౌరవం ఆయన దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎక్కడ దొరకలేదు. ఆయనకు రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇచ్చారు. పార్టీ జనరల్ సెక్రటరీ బాధ్యతలు కూడా ఇచ్చారు.
కనీసం ఒక వేదికపై పదిమంది వినగలిగేలా, పదిమందికి అర్థమయ్యేలా మాట్లాడలేకపోయినా.. సీనియర్ నాయకుడు కాబట్టి కేసీఆర్, కేటీఆర్ ఆయనకు సముచిత గౌరవం ఇచ్చారని తెలిపారు. ఆయనకే కాదు ఆయన కుటుంబానికి చాలా చేశారని చెప్పారు. అసలు రాజకీయం తెలవని ఆయన కూతురుకి హైదరాబాద్ మేయర్ గా అవకాశం కల్పించారు. ప్రచారంలో అన్ని తానే ఉండి గెలిపించిన వ్యక్తి కేటీఆర్ అని పేర్కొన్నారు.
అంతేకాదు తన కొడుక్కి పదవి కావాలని అడగ్గానే కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. అయినా కేశవరావు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇన్ని చేసినా తన కొడుకుకి ఎమ్మెల్సీ ఇవ్వలేదంటూ ఇప్పుడు ఆయనను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి చేస్తున్నది తప్పు అనే విషయం తెలుసు కాబట్టి ఆయన కుమారుడు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు.
కొనసాగుతానని ప్రకటించారు. కేకేకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన దానికంటే గొప్ప గౌరవం ఇప్పుడు కాంగ్రెస్ లో ఏం దక్కుతుంది? ఇప్పటికిప్పుడు కేకేను సీఎంగా ప్రకటిస్తారా? లేకపోతే ఇంకేదైనా అత్యున్నత పదవి ఆయన చేయాల్సి ఉందా? అని ప్రశ్నించారు. కేవలం స్వార్థం కోసం పార్టీ మారి ఇప్పుడు నంగనాచి దొంగ ఏడుపులు ఏడ్చినంత మాత్రాన అబద్ధం నిజం అయిపోదన్నారు.
ఇప్పుడు ఏదో ఎన్నికల ముందు ఏడ్చి సెంటిమెంట్ డ్రామా రగిలించి బీఆర్ఎస్ పార్టీపై ఒక తప్పుడు ముద్ర వేయాలని చేస్తున్న కుట్రలు ఎట్టి పరిస్థితుల్లోనూ సఫలీకృతం కాబోవన్నారు. కేకే ఇకనైనా ఇలాంటి చిల్లర చీప్ టెక్నిక్స్ మానేసి కేసీఆర్ కేసీఆర్, కేటీఆర్కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.