హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో ఆంధ్రా ఉద్యోగులకు రెడ్ కార్పెట్ వేస్తున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ఆరోపించారు. కీలక స్థానాల్లో వారిని నియమిస్తూ ఇక్కడి ఉద్యోగులకు తీరని ద్రోహం చేస్తున్నారని ఆదివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఏపీ జెన్కోకు చెందిన దుర్గాప్రసాద్ అనే డీఈని డిప్యుటేషన్పై తీసుకొచ్చి ఏడీగా నియమించారని విమర్శించారు. నాడు చంద్రబాబుకు బ్యాగులు మోసిన రేవంత్రెడ్డి, ఇప్పుడు గురువు కనుసన్నల్లో తెలంగాణ ఉద్యోగులకు కీలక పోస్టులు దక్కకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో ఈ వ్యవహారానికి అడ్డుకట్టపడగా, కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత తిరిగి ప్రభుత్వ సంస్థల్లో ఆంధ్రా ఉద్యోగులకు పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. తన శాఖలో ఆంధ్రా ఉద్యోగుల నియామకంపై డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క స్పందించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆయన కనుసన్నల్లోనే ఈ తతంగం నడుస్తున్నదని అనుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.