హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : ఉచితంగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని నాడు చెప్పిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు దరఖాస్తుకు రూ.10వేలు, లబ్ధిదారుల వాటా కింద రూ.6లక్షలు కట్టాలని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపిందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. ఈ మేరకు కంటోన్మెంట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే తీరుకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలతో కలిసి గోడలకు పోస్టర్లు అతికించారు. ఈ సందర్భంగా క్రిశాంక్ మాట్లాడుతూ.. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక సమయంలో ప్రకటించిన 6వేల ఇందిరమ్మ ఇండ్ల హామీని ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ ఉచిత ఇండ్ల పథకం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, ఎన్నికల హామీలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఇది ప్రజా సంక్షేమ పాలన కాదని, ప్రభుత్వ రియల్ ఎస్టేట్ పాలన అంటూ ఎండగట్టారు. ఇందిరాగాంధీ పేరును కూడా కాంగ్రెస్ నాయకులు అపఖ్యాతిపాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇప్పటికే మూడు బడ్జెట్లను ప్రవేశపెట్టిందని, ఇక మిగిలింది ఒక సాధారణ బడ్జెట్, ఆ తర్వాత ఎన్నికల బడ్జెట్ మాత్రమేనని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో ఉన్నారని, ఆ పార్టీకి ఓటు వేసి తప్పు చేశామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారని పేర్కొన్నారు.