హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): కేంద్ర బడ్జెట్లోని రైల్వే పద్దు ఈ సారి కూడా తెలంగాణకు నిరాశే మిగిల్చింది. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. తెలంగాణకు కొత్త ప్రాజెక్టుల ప్రస్తావనే లేదు. రాష్ట్ర విభజన హామీ మేరకు కాజీపేటలో ఏర్పాటుచేయాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని లాతూర్కు తరలించిన కేంద్రం.. వందేభారత్ రైలు కోచ్ ఫ్యాక్టరీ విషయంలోనూ నిరాశే మిగిల్చింది. వందేభారత్ కోచ్ ఫ్యాక్టరీని ఇప్పటికే చెన్నైకు ఇవ్వగా రాయబరేలి, లాతూర్లో కూడా ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు రైల్వేశాఖ మంత్రి అశ్వనీవైష్ణవ్ తెలిపారు.
తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు సులభంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా రాష్ట్రంలో కొత్తగా పదికి పైగా రైల్వే మార్గాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. తాజా బడ్జెట్లో వీటిని బుట్టదాఖలు చేసింది. కొత్త రైల్వే ప్రాజెక్టులు, కొత్త రైల్వేలైన్ల నిర్మాణాలకు సంబంధించి రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రతిపాదనల్లో కనీసం ఒక్కటి కూడా ఆమోదించక పోవడం పట్ల పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. కొత్త ప్రాజెక్టులు ఇవ్వకపోగా ప్రస్తుతం కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులకు నిధుల విడుదల విషయంలోనూ వివక్ష చూపుతున్నది. కొనసాగుతున్న రైల్వే పనుల్లో ఏ ప్రాజెక్టుకు ఎన్ని నిధులు కేటాయించారు? వాటి పురోగతి ఏమిటి? తదితర వివరాలు ప్రకటించలేదు. ఈ విషయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కూడా తనకు ఏమీ తెలియదని చెప్పడం గమనార్హం. ఒకటి రెండు రోజుల్లో రైల్వే ప్రాజెక్టుల కేటాయింపు వివరాలు తెలియజేస్తామని పేర్కొన్నారు.