BRS Plenary | బీసీ వర్గాల అభ్యున్నతి కోసం రాజీలేని పోరాటం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్లీనరీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘దేశంలో గుణాత్మకమైన మార్పును సాధించే దిశగా బీఆర్ఎస్ ఉద్యమ స్ఫూర్తితో పురోగమించాలని కోరుతూ తీర్మానం’ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ‘ఒక దేశం సామాజిక సమగ్ర స్వరూపాన్ని అవగాహన చేసుకోవడంలో గణాంకాలు కీలకపాత్ర వహిస్తాయి. ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్’ పేరొందిన ‘మహాలనోబిస్’ పేర్కొన్నట్టు.. ‘ప్రణాళిక లేని గణాంకాలతో ఫలితం ఉండదు. గణాంకాలు లేని ప్రణాళికలతో ప్రయోజనం ఉండదు’ మన దేశంలో 1872లో మొదటిసారిగా జనాభా గణన జరిగింది.
ప్రపంచ యుద్ధాలు జరుగుతున్న కాలంలో జనాభా గణన జరపకుండా ఆపలేదు. కానీ, నేడు దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం మాత్రం జనాభా గణన చేపట్టడానికి నిరాకరిస్తున్నది. దురదృష్టమేమిటంటే ఈనాటికీ పన్నెండేళ్ల క్రితం 2011 సంవత్సరంలో జరిపిన జనాభా లెక్కల ప్రాతిపదికనే కేంద్ర ప్రభుత్వ పాలసీలు కొనసాగుతున్నాయి. ఫలితంగా ఆయా సామాజిక వర్గాలకు వారి జనాభా దామాషాకు అనుగుణంగా అభివృద్ధి ఫలితాలు లభించడం లేదు. ఇంతకంటే ప్రజా ద్రోహం మరోటి లేదు. బడుగు బలహీన వర్గాల వ్యతిరేక భావజాలం కలిగిన బీజేపీ, అట్టడుగువర్గాలకు సామాజిక న్యాయం లభించకుండా ఉండాలనే దుర్మార్గపు తలంపుతోనే జనాభా గణన చేపట్టడం లేదు.
1953లో ఏర్పాటు చేసిన కాలేల్కర్ కమిషన్ ఆ తర్వాత వచ్చిన అనేక కమిషన్లు బీసీ వర్గాల జనగణన చేయాలని సిఫారసు చేసినా ఏ ప్రభుత్వం ఆయా కమిషన్ల సిఫార్సులను పట్టించుకున్న పాపాన పోలేదు. పదే పదే తాను బీసీ వర్గానికి చెందిన వాడినని గొప్పలు చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోదీ సైతం నేడు బీసీ జనగణన జరపడానికి ముందుకు రాకపోవడం బీసీ వర్గాల పట్ల బీజేపీకి ఉన్న చిన్నచూపునకు నిదర్శనం. తాజాగా రూపొందించిన ఖచ్చితమైన గణాంకాలతో మాత్రమే అభివృద్ధి, సంక్షేమంలో బీసీ వర్గాలకు న్యాయమైన వాటా లభిస్తుంది. కానీ, ఈ సామాజిక న్యాయ సూత్రాన్ని అమలు చేయడంలో దేశాన్ని పాలించిన అన్ని ప్రభుత్వాలు విఫలమయ్యాయి.
దేశ జనాభాలో 50శాతానికి పైబడి బీసీ వర్గాల సంఖ్య ఉన్నప్పటికీ 75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో వారికోసం ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేయలేదు. ఇది ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల అప్రజాస్వామిక వైఖరికి, అణచివేత ధోరణికి నిదర్శనం. ఇంతకాలం వెనుకబాటుకు గురైన బీసీ వర్గాల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ రాజీలేని పోరాటం చేస్తున్నది. భవిష్యత్తులో దేశ పరిపాలనా విధానాన్ని నిర్ణయించే శక్తిగా బీఆర్ఎస్ ఎదిగి, శాస్త్రీయంగా జనగణనను జరపాలని, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల జనగణన జరిపి, ఆ గణాంకాల ఆధారంగా వెనుకబడిన వర్గాలకు తగిన ప్రయోజనాలను అందించాలని ఈ సభ కోరుతున్నది. అదేవిధంగా కేంద్రంలో బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని ఆ దిశగా బీఆర్ఎస్ పురోగమించాలి’ అంటూ బీఆర్ఎస్ ప్రతినిధుల సభ తీర్మానించింది.