హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అవమానపరుస్తున్న మంత్రుల వైఖరి గర్హనీయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బీఆర్ఎస్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. రైతుబంధు రాలేదన్న వారిని చెప్పుతో కొట్టండన్న కోమటిరెడ్డి.. తాజాగా యాదాద్రి జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డిపై దుర్భాషలాడటం ఆ పార్టీ నియంతృత్వ పోకడలకు నిదర్శనమని విమర్శించారు.
ప్రభుత్వ అధికారిక కార్యక్రమం నుంచి బలవంతంగా సందీప్రెడ్డిని బయటకు పంపిన తీరును ఖండించారు. అత్యుత్సాహం ప్రదర్శించిన రాచకొండ పోలీసులపై డీజీపీ చర్యలు తీసుకోవాలని కోరారు. కోమటిరెడ్డికి ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం గౌరవమున్నా జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డికి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.