కరీంనగర్ డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇలాకాలో జరిగిన సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ విజయంతో బీజేపీలో కలకలం మొదలైంది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు స్వయంగా సంజయ్ రంగంలోకి దిగి ఎన్నో అడ్డదారులు తొక్కినా ప్రజలు మాత్రం కేసీఆర్ కారుకే అండగా ఉంటామని మరోసారి నిరూపించారు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మారిన తదుపరి తెలంగాణతో అనుబంధం తెగిపోయిందంటూ కొందరు కుహనా నాయకులు చేస్తున్న విమర్శలకు చెంపపెట్టు లాంటి తీర్పు ఇదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సెస్ ఎన్నికల ఫలితాలు ప్రస్తుత రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్గా మారగా.. బీజేపీలో మాత్రం భయాందోళన మొదలైంది. కూట్లో రాయి తీయలేనోడు.. ఏట్లో రాయి తీస్తాడా అన్నట్టు.. సొంత జిల్లా, సొంత నియోజకవర్గంలో ఎన్నికను గెలిపించనోడు, రేపు రాష్ట్రంలో పార్టీని ఎలా గెలిపిస్తాడని బీజేపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.
సిరిసిల్ల సహకార విద్యుత్తు సరఫరా సంఘం (సెస్) ఎన్నికల ఫలితాలు ఈ నెల 26న వెల్లడయ్యాయి. మొత్తం 15 డైరెక్టర్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్చేసింది. రాబోయే జనరల్ ఎన్నికలకు కారుకు గెలుపు బాట పరిచింది. సెస్ ఎన్నికల గురించి రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా కొనసాగుతున్నారు. బండి నియోజకవర్గం పరిధిలోనే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో సెస్ పరిధిలో సిరిసిల్ల, వేములవాడ, మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాలున్నాయి. సెస్ పరిధిలో 85,130 మంది ఓటర్ల ఉండగా 73,189 మంది (84 శాతం) ఓటు వేశారు. సెస్ చరిత్రలో అత్యధిక పోలింగ్ జరిగింది. అందులో ప్రధానంగా రైతులు, నేత కార్మికులు ఉద్యోగులు, వ్యాపార, వాణిజ్యవర్గాలు అధికంగా ఉన్నారు.
ఫలించని బండి విశ్వప్రయత్నాలు
బీఆర్ఎస్గా ఏర్పడిన తదుపరి తొలిసారి జరిగే ఈ ఎన్నికల్లో విజయం సాధించి.. బీఆర్ఎస్కు షాక్ ఇవ్వాలని బండి సంజయ్ విశ్వ ప్రయత్నం చేశారు. అందుకోసం కరీంనగర్ ఉమ్మడి జిల్లా బీజేపీ నాయకులను పక్కన పెట్టి.. జిల్లాయేతర ప్రాంతాల నుంచి మండలాలకు తరలించి.. వారిని ఇంచార్జులుగా నియమించి ప్రచారం నిర్వహించారు. అక్కడితో ఆగకుండా ఆయనే స్వయంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పచ్చి అబద్ధాలు చెప్పారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందని, అది బీఆర్ఎస్ కాదని, వీఆర్ఎస్ అంటూ విమర్శలు చేశారు. పేరు మార్పుతో ప్రజల్లో గులాబీ పార్టీ తన ఉనికి కోల్పోయిందని, సెస్ ఎన్నికలో ్లఘోర పరాజయం పాలవువుతుందంటూ విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రతిపాదించిన అభ్యర్థుల ఓటమికి సెస్ ఎన్నికల నుంచే శ్రీకారం చుట్టాలంటూ పిలుపునిచ్చారు. బీజేపీ శ్రేణులతో తాజాగా నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లోనూ సెస్ ఎన్నికల్లో మంచి విజయం సాధిస్తున్నట్లు ముందే గొప్పలు చెప్పారు. తీరా చూస్తే.. మొత్తం 15 స్థానాల్లో గులాబీ ప్రభంజనం సృష్టించింది.
సొంత గడ్డపై గెలువని సంజయ్.. జనరల్ ఎన్నికల్లో నెగ్గుతాడా..?
‘సెస్ ఎన్నికలు చాలా చిన్నవి’ అంటూ సంజయ్ పలు సందర్భాల్లో చెప్పారు. నిజానికి ఆయన అన్నట్టు ఎన్నికలు చిన్నవే అనుకుంటే.. ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత గడ్డపై జరిగిన ఈ ఎన్నికల్లో ఎందుకు విజయం సాధించలేకపోయారనే చర్చ బీజేపీ శ్రేణుల్లోనే జరుగుతున్నది. ఆయన ఎంపీగా ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో 73 వేల పైచిలుకు ఓటర్లు పాల్గొంటే.. ఒక్కటంటే ఒక్క డైరెక్టర్ పదవిని ఎందుకు దక్కించుకోలేక పోయారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆయన స్వయంగా ఎంపీగా ఉన్న నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంటే.. రేపు రాష్ట్రంలో జరిగే సాధారణ ఎన్నికల్లో గెలుస్తాడా అన్న చర్చ ప్రస్తుతం రాజకీయవర్గాల్లో నడుస్తున్నది. బీఆర్ఎస్ను కూల్చుతాం..
రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అంటూ నిత్యం ప్రగల్భాలు పలుకుతున్న బండి.. తన సొంత ఇలాకాలో బోల్తా పడ్డారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. లోతుగా విశ్లేషిస్తే.. బండియే కాదు.. బీజేపీకి ప్రజల్లో ఆదరణ లేదని సెస్ ఓటర్ల ద్వారా సుస్పష్టమైందంటున్నారు. ఎన్నికలు ఏవైనాసరే.. కారు-కేసీఆర్-బీఆర్ఎస్కే భవిష్యత్లోనూ ప్రజలు అండగా నిలిచి పట్టం కడుతారని చెప్పడానికి సెస్ ఎన్నికలు నిలువెత్తు నిదర్శంగా నిలుస్తున్నాయి. ఇటీవల మునుగోడు ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరింది. ఆ షాక్ నుంచి తెరుకకోక ముందే.. సెస్ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. తొలి ఎన్నికల్లోనే బీఆర్ఎస్ క్లీన్స్వీప్గా బోణీ కొట్టింది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించిన ప్రతి అభ్యర్థిని ప్రజలు గెలిపించారు.