హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ బుధవారం తమ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించాయి. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, యువజన కాంగ్రెస్ నాయకుడు అనిల్కుమార్ యాదవ్ను కాంగ్రెస్ తమ అభ్యర్థులుగా ప్రకటించగా.. బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తిరిగి ఎంపికయ్యారు. కాంగ్రెస్ నుంచి అనిల్కుమార్ యాదవ్ ఎంపిక మాత్రం అనూహ్యంగా జరిగింది.
బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్రను పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. బుధవారం సాయంత్రం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అనంతరం వద్దిరాజుకు బీఫాం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. గతంలో బండ ప్రకాశ్ రాజీనామా వల్ల ఖాళీ అయిన రాజ్యసభ సీటు వద్దిరాజును వరించిన విషయం తెలిసిందే. 2022 మే 24న ఈ పదవికి ఎన్నికైన వద్దిరాజు కేవలం రెండేండ్లే ఎంపీగా కొనసాగడంతో ఆయనకు మరోసారి అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తున్నది.
రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న మున్నురు కాపు వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే వద్దిరాజుకు మరోసారి ఎంపీగా అవకాశం ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఆయన కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన అనంతరం ఆయన పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు కవిత శుభాకాంక్షలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనగుర్తి గ్రామంలో 1964 మార్చి 22న జన్మించిన వద్దిరాజు.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వరంగల్ ఈస్ట్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం బీఆర్ఎస్లో చేరారు.
బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజును ఎంపిక చేయడం ద్వారా పార్టీ అధినేత కేసీఆర్ బీసీ వర్గాలకు న్యాయం చేశారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్కు లభించే అవకాశమున్న ఒక్క రాజ్యసభ సీటును బీసీకి ఇవ్వడం ద్వారా ఆ సామాజిక వర్గంపై ఉన్న ప్రేమను కేసీఆర్ మరోసారి చాటుకున్నారని తెలిపారు. బీఆర్ఎస్కు, కేసీఆర్కు బీసీ వర్గాలు రుణపడి ఉంటాయని పేర్కొన్నారు.
నామినేషన్ల దాఖలుకు గురువారమే తుది గడువు కావడంతో వద్దిరాజుతోపాటు కాంగ్రెస్ అభ్యర్థులు రేణుకాచౌదరి, అనిల్ కుమార్ యాదవ్ కూడా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈనెల 16న నామినేషన్ల పరిశీలన, 20న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు ముగ్గురే నామినేషన్లు దాఖలు చేసే అవకాశాలు ఉండటంతో వారి ఎన్నిక ఏకగ్రీవం కానున్నది. దీంతో వారి ఎన్నికను ప్రకటిస్తూ 20వ తేదీ సాయంత్రం ధ్రువపత్రాలు అందజేస్తారు.