తొర్రూరు/మరిపెడ/కురవి, జనవరి 17: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా, రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా బుధవారం ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని పార్టీ శ్రేణులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మహబూబాబాద్ జిల్లా మరిపెడ, కురవి, తొర్రూరులో నిర్వహించిన సమావేశాల్లో ఖమ్మం సభపై బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఈ సభకు తరలివచ్చేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఊహించిన దానికంటే రెట్టింపు సంఖ్యలో ఉత్సాహాన్ని చూపుతున్నందున తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. బీజేపీ ఆగడాలకు అడ్డుకట్ట వేసి దేశంలో రైతు ప్రభుత్వాన్ని నెలకొల్పాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారని తెలిపారు. ఖమ్మంలో నిర్వహించే తొలి బీఆర్ఎస్ సభకు జనం జాతరలా తరలివచ్చి కేసీఆర్ సంకల్పానికి బాసటగా నిలువాలని కోరారు. ఈ సభతో దేశ రాజకీయాల్లో మార్పు చూడబోతున్నామని చెప్పారు.