కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 5గంటలే కరెంటిస్తున్నది. ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ నిన్న తెలంగాణకు వచ్చి మరీ ఒప్పుకొని పోయిండు. ఇక్కడ కూడా 3 గంటల కరెంటిస్తే చాలని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అంటున్నడు. మరి మీరేమంటరు? రైతుబంధు దుబారా.. ధరణి దండగ అంటున్న కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు నమ్మితే మనకూ కర్ణాటక గతేపడ్తది.
– సీఎం కేసీఆర్
ఐదు గంటల కరెంటు
కర్ణాటకలో వ్యవసాయానికి ఐదు గంటల కరెంటు ఇచ్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఈ 5 గంటల కరెంటు కూడా పొద్దున, సాయంత్రం, రాత్రి.. మూడు షిఫ్టుల్లో సరఫరా చేస్తాం.
– కర్ణాటక సీఎం సిద్దరామయ్య
అంతకు మించి ఇయ్యలేం
కర్ణాటకలో రైతులకు మేం 5 గంటల కరెంటు ఇస్తున్నం. 7 గంటలనుకున్నా.. 5 గంటలకు మించి ఇవ్వలేకపోయినం. తెలంగాణ నేతలు వచ్చి చూడండి. అందుకు బస్సులు పెడుతం.
– కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్
మూడు గంటలు మస్తు!
తెలంగాణలో 3 ఎకరాలలోపు ఉన్న రైతులే ఎక్కువ. కాబట్టి రైతులందరికీ 3 గంటల కరెంటు ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తు అవసరం లేదు.
– పీసీసీ అధ్యక్షుడు రేవంత్
CM KCR | హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): ‘రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నాం. కాంగ్రెస్ నేతలు అది వేస్ట్ అంటున్నరు. 3 గంటల కరెంటు చాలంటున్నరు. రైతుబంధు దుబారా అంటున్నరు. ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామంటున్నరు. రైతులకు 3 గంటల కరెంటు సరిపోతదా? రైతుబంధు దుబారానా? ధరణిని ఎత్తేసి మళ్లీ దళారుల పెత్తనం తీసుకొస్తరా?’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ నేతల కల్లబొల్లి మాటలను నమ్మవద్దని, తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష అని, ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం కోదాడ, తుంగతుర్తి, ఆలేరు నియోజవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆదివారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ నేతలు రాహుల్గాంధీ, ఉత్తమ్కుమార్, రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్కు చురకలంటించారు.
కాంగ్రెస్ పార్టీ గత పదేండ్లుగా అధికారం లేక ఆకలితో ఆవురావురుమంటున్నది. చాన్స్ ఇస్తే గొర్రెలమందపై తోడేళ్లు పడినట్టు పడి పంటికంటకుండా మింగుదామని చూస్తున్నది.
– సీఎం కేసీఆర్
తెలంగాణకు బీఆరెస్సే శ్రీరామరక్ష
సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ దద్దమ్మలు నోరు మొదపలేదని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టి, కడతామన్న ప్రాజెక్ట్లను ఆపినా, సాగర్ ప్రాజెక్టును గోల్మాల్ చేసినా నోరుమూసుకుని పడి ఉన్నారని ధ్వజమెత్తారు. 2001లో గులాబీ జెండా ఎగిరేసే వరకు ఈ అన్యాయాలపై అడిగినవారే లేరని అన్నారు. ఆ రోజు తెలంగాణ కాంగ్రెస్ నేతల మౌనం వల్లే ఈ రోజు మనం శిక్ష అనుభవిస్తున్నామని, అయినా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వైఖరి అలాగే ఉన్నదని ధ్వజమెత్తారు. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒకసారి కూడా రాష్ట్రంలో కర్ఫ్యూ రాలేదని, భగవంతుడి దయతో ఎన్నడూ కరువు లేదని వివరించారు. ‘పెద్దపెద్ద రాష్ట్రాలను తలదన్ని తెలంగాణ ముందుకెళ్తున్నది. రూ.3.18 లక్షల తలసరి ఆదాయంతో దేశంలో నంబర్ వన్గా ఉన్నది. తలసరి విద్యుత్తు వినియోగం నాడు 1,100 యూనిట్లే. నేడు 2,200 యూనిట్లకు పెరిగింది.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ఒకసారి కూడా కర్ఫ్యూ రాలేదు. భగవంతుడి దయతో ఎన్నడూ కరువు లేదు. రాహుల్గాంధీకి ఎవుసం ఎరుకనా? ఎద్దు ఎరుకనా? రాసింది ఇస్తే చదువుతున్నడు.
– సీఎం కేసీఆర్
ఎక్కడా వెనకడుగు వేయకుండా పెన్షన్ రూ.2 వేలు ఇస్తున్నాం. రాబోయే రోజు ల్లో మరింత పెంచుతాం. కిడ్నీ రోగులు డయాలసిస్ కోసం వివిధ ప్రాంతాల్లో 103 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశాం’ అని తెలిపారు. గతంలో రైతులకు సహాయం చేయాలని ఏ ప్రభుత్వమూ ఆలోచించలేదని, మొదటిసారి రైతుబంధు పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆవిష్కరించిందని చెప్పారు. రైతుబంధును ప్రఖ్యాత శాస్త్రవేత్త స్వామినాధన్ ఎంతగానో కొనియాడారని గుర్తుచేశారు. ‘కర్ణాటకే కాదు ఏ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు ఇస్తలేరు. ప్రధాని రాష్ట్రం గుజరాత్లో కూడా ఇస్తలేరు. తెలంగాణలోనే అనేక వ్యయప్రయాసలకోర్చి కరెంటు ఇస్తున్నం. రూ.25 వేల కోట్లు కాదు, ఇంకో రూ.10 వేల కోట్లు ఖర్చయినా కరెంటిస్తాం’ అని సీఎం పునరుద్ఘాటించారు. కర్ణుడికి కవచకుండలాల లెక్క తెలంగాణకు బీఆర్ఎస్సే శ్రీరామరక్ష అని అభివర్ణించారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ నేతలు వచ్చి కల్లబొల్లి మాటలు చెప్తున్నారని, వాళ్లను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కర్ణాటకలో ప్రజలు నమ్మి ఓటేస్తే వారికి 5 గంటల కరెంటు దికు చేశారని, తెలంగాణలో ఆ పార్టీని నమ్మి తే గ్యారెంటీగా కరెంటును కాట్ల గలుపుతుందని హెచ్చరించారు.
3 గంటల కరెంటు సరిపోతదా?
వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలు అని రాహుల్గాంధీతోపాటు కాంగ్రెస్ నేతలంతా అంటున్నారని, నిజంగా 3 గంటల కరెంటు సరిపోతదా? అని రైతులను కేసీఆర్ ప్రశ్నించారు. ‘పీసీసీ అధ్యక్షుడు 24 గంటల కరెంటు వద్దంటుండు. పైసలు వేస్ట్ అంటుం డు. 3 గంటల కరెంటే చాలు అంటుండు. అది సరిపోతదా? ప్రజలు చెల్లించే పన్నులను రైతుబంధు పేరిట దుబారా చేస్తున్నామని ఉత్తమ్కుమార్రెడ్డి అంటుండు. రైతుబంధు అంటే దుబారానా? రాహుల్గాంధీకి ఎవుసం ఎరుకనా? ఎద్దు ఎరుకనా? ఆయన కూడా ధరణిని తీసేస్తామంటున్నడు. మరి రైతుబంధు పైసల్ ఎట్ల వస్తయ్? పంట అమ్మిన డబ్బులు ఎట్ల వస్తయ్? ధరణి తీసేస్తే మళ్లా దఫ్తర్ల కాడికి పోవాల్నా?’ అని నిలదీశారు. ధరణి వద్దంటున్న కాంగ్రెస్నే బంగాళాఖాతంలో విసిరేయాలని పిలుపునిచ్చారు.
కోదాడలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చైతన్యం చాటాలి..
ఖమ్మం, కోదాడ, సాగర్ ఆయకట్టుకు ఎప్పుడూ నీళ్ల సమస్యే ఉండేదని సీఎం అన్నా రు. కృష్ణానదిలో నీటి వాటాలపై ఎప్పుడూ పంచాయితీయేనని తెలిపారు. సాగర్ ఆయకట్టును కాళేశ్వరంతో కలిపితే పీడపోతుందని సీనియర్ బీఆర్ఎస్ నేత శశిధర్రెడ్డి చెప్తున్నారని, నాలుగేండ్లక్రితమే మంత్రి జగదీశ్రెడ్డి, తాను కలిసి అదే ఆలోచన చేశామన్నారు. ఉదయసముద్రం వరకు వచ్చే ఆసిఫ్నగర్ కెనాల్ ను కాళేశ్వరంతో అనుసంధానించాలని భావించామని, కాళేశ్వరం జలాలను మూసీ దాటిచ్చి ఉదయసముద్రం, అక్కడి నుంచి పెద్దదేవులపల్లి చెరువులో పడితే.. కోదాడ, హుజూర్నగర్, నాగార్జునసాగర్కు జీవితంలో నీళ్ల కరువు ఉండబోదని, రెండు పంటలు పండే అవకాశముంటుందన్నారు.
ఒకప్పుడు కరువు ప్రాం తాలుగా ఉన్న తిరుమలగిరి, తుంగతుర్తిలో సైతం నేడు చెరువులు నిండి మత్య్స సంపద పెరుగుతున్నదని చెప్పారు. కోదాడలో పాదయాత్ర చేస్తుంటే తనకు కాళేశ్వరం జలాలు కనిపించలేదని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అనడం సిగ్గుచేటని విమర్శించారు. నీళ్లు వస్తున్నాయో లేదో నడిగూడెం, మోతె, మునగాల ప్రజలే చెప్పాలని కోరారు. నల్లగొండకు శాశ్వతంగా విముక్తి కల్పించే పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వమే తెస్తుందని స్పష్టంచేశారు. ‘కోదాడ నుంచి గతంలో ఎన్నడూ బీసీలకు పోటీచేసే అవకాశం రాలేదు. చదువుకున్న వ్యక్తి అని పిలి చి మల్లయ్యయాదవ్కు టికెట్ ఇచ్చాం. కోదాడ లో బీసీ, ఎస్సీ, ఎస్టీలు తమ చైతన్యం చూపించాలి. 50 -60 శాతం ఉన్నామని నరుకుడు కాదు.. నవంబర్ 30న సత్తా చూపించాలి. బలిసిన వాళ్లు ఒకటై కుట్రలు చేసున్నారు.
ఆ కుట్రల ముందు బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎందుకు ఓడిపోవాలి? దీనిపై అంతా చర్చ పెట్టాలి. బీసీలంతా కోదాడలో విజయబావుటా ఎగురవేయాలి. మల్లయ్యను బంపర్ మెజార్టీతో గెలిపిస్తే రూ.10 కోట్లతో బీసీ భవన్ కట్టించే బాధ్యత నాది’ అని సీఎం హామీ ఇచ్చారు. భవిష్యత్తులో సూర్యాపేట జిల్లాను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించారు. ఇప్పటికే సూర్యాపేట జిల్లాకు మెడికల్ కాలేజీ వచ్చిందని, పారిశ్రామిక ఉత్పత్తులు పెరుగుతున్నాయని చెప్పారు. ఇక్కడికి మచిలీపట్నం దగ్గర కాబట్టి, ఈ ప్రాం తంలోనే వందల, వేల ఎకరాల్లో డ్రైపోర్టులు రాబోతున్నాయని, అద్భుతమైన అభివృద్ధి జరిగే అవకాశమున్నదని వివరించారు.
దేశంలో ఏ రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తలేరు. చివరకు ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా కరెంటు ఇస్తలేరు. కేవలం తెలంగాణలోనే అనేక వ్యయప్రయాసలకోర్చి కరెంటు ఇస్తున్నం. 25 వేలకోట్లు కాదు, ఇంకో రూ.10 వేల కోట్లు ఖర్చయినా కరెంటిస్తాం.
– సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటా: ఎమ్మెల్యే బొల్లం
కోదాడకు నువ్వే పెద్ద దిక్కు అని ఆశీర్వదించి రెండోసారి బీఆర్ఎస్ అభ్యర్థిత్వం ఖరారు చేసి పంపిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటానని కోదాడ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ చెప్పారు. కోదాడలో ఆదివారం జరిగిన ప్రజాఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ప్రజలు ఒకసారి దీవించి గెలిపిస్తే సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి సహకారంతో వందల కోట్లు తెచ్చి నియోజకవర్గాన్ని అందరూ మెచ్చేలా అభివృద్ధిపథంలో నడిపించానని చెప్పారు. మరోసారి ప్రజలు దీవిస్తే నియోజకవర్గాన్ని నందనవనంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. 2018లో సీఎం కేసీఆర్ పిలిచి తనకు పదవి ఇచ్చిన దైవ సమానులని కొనియాడారు. మరోసారి తనను ఎమ్మెల్యేగా ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే మీ రుణం తీర్చుకుంటానని బొల్లం మల్లయ్యయాదవ్ ప్రతినబూనారు.
కాంగ్రెస్కు ఓటేస్తే తోడేలు మంద మీదపడ్డట్టే
ఎన్నికలొచ్చినప్పుడు పోటీ చేసే పార్టీల చరిత్ర, ప్రజల పట్ల వారి ఆలోచన, అధికారమిస్తే గతంలో ఏంచేశారు? భవిష్యత్తులో ఏంచేస్తారు? అని ఆలోచించాలని ప్రజలకు కేసీఆర్ సూచించారు. ఓటు మన పంట పొలా లు ఎండాల్నా.. పండాల్నా? అన్నది నిర్ణయిస్తదని వివరించారు. విపక్షాలకు ఓట్లు తప్ప ప్రజల మేలు పట్టదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ గత పదేండ్లుగా అధికారం లేక ఆకలితో ఆవురావురుమంటున్నదని, చాన్స్ ఇస్తే గొర్రెల మందపై తోడేళ్లు పడినట్టు పడి పంటికంటకుండా మింగుదామనే ఆలోచనతో ఉన్నదని హెచ్చరించారు. పసలేని, పిసపిస మాట్లాడే కాంగ్రెస్నాయకులతో ఏం కాదని ఎద్దేవా చేశారు.
ఎన్నికల రాగానే అనేక మంది నాయకులు ప్రచారానికి వస్తారు. నిన్ననే కర్ణాటక నుంచి ఉప ముఖ్యమంత్రి వచ్చాడు. మరొకాయన ఉత్తరప్రదేశ్ నుంచి లుంగీ కట్టుకొని వస్తాడు. ఆయన రాష్ట్రంలో అన్నానికి గతిలేదు. తెలంగాణకు ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్ వంటి రాష్ర్టాలనుంచి నాట్లు వేయడానికి కూలీలు వస్తున్నారు. కానీ ఆ రాష్ర్టాల సీఎంలు మాత్రం ఇక్కడికొచ్చి మనకు పాఠాలు చెప్తున్నారు. ఎట్ల నవ్వాలనో అర్థంకావడంలేదు.
– సీఎం కేసీఆర్
కేసీఆర్ సార్ మీ రుణం తీరనిది: ప్రభుత్వ విప్ సునీత
ఎడారిగా ఉన్న ఆలేరును సస్యశ్యామలం చేశారు. 24 గంటల కరెంటు ఇచ్చి దేవుడయ్యారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ప్రపంచమే గుర్తించేలా పునర్నిర్మించారు. ఇన్ని చేసిన మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి సార్.. మా చర్మం వలిచి మీకు చెప్పులు కుట్టించినా ఆ రుణం తీరనిది.. అంటూ ఆలేరు ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేమంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నవాబ్పేట రిజర్వాయర్, కొండపోచమ్మ సాగర్ ప్రధాన కాల్వలతో నియోజకవర్గానికి సాగునీళ్లు వచ్చాయని తెలిపారు.
2014కు ముందు నియోజకవర్గంలో 25 వేల ఎకరాలు మాత్రమే సాగయ్యేదని, రాష్ట్రం ఏర్పాటయ్యాక 2.16 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయన్నారు. శామీర్పేట, పెద్దకందుకూరు, చొల్లేరు, బిక్కేరు వాగులపై 29 చెక్డ్యామ్లు నిర్మించామని, ఇంటింటికీ మిషన్ భగీరథ జలాలు అందజేశామని వివరించారు. గుట్టలో వైద్య కళాశాల ఏర్పాటుకు అనుమతిచ్చినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఆలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. రాజాపేట మండలం రఘునాథపురం, తుర్కపల్లి మండలం మాదాపురంను మండలాలుగా ఏర్పాటు చేయాలని, తుర్కపల్లి, ఆత్మకూరు(ఎం)లో జూనియర్ కాలేజీలు మంజూరు చేయాలని కోరారు. బొమ్మల రామారంలోని జూనియర్ కాలేజీని డిగ్రీ కళాశాలగా అప్గ్రేడ్ చేయాలని కోరారు.
తెలంగాణ వచ్చి కర్ణాటకను చూడాల్నా?
కర్ణాటకలో కరెంటు గురించి గొప్పగా చెప్పిన ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్కు సీఎం కేసీఆర్ చురకలంటించారు. ‘ఎన్నికల రాగానే అనేక మంది నాయకులు ప్రచారానికి వస్తారు. నిన్ననే కర్ణాటక నుంచి ఉప ముఖ్యమంత్రి వచ్చాడు. మరొకాయన ఉత్తరప్రదేశ్ నుంచి లుంగీ కట్టుకొని వస్తాడు. ఆయన రాష్ట్రంలో అన్నానికి గతిలేదు. తెలంగాణకు ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్ వంటి రాష్ర్టాలనుంచి నాట్లు వేయడానికి కూలీలు వస్తున్నారు. కానీ ఆ రాష్ర్టాల సీఎంలు మాత్రం ఇక్కడికొచ్చి మనకు పాఠాలు చెప్తున్నారు. ఎట్ల నవ్వాలనో అర్థంకావడంలేదు.
ప్రచారానికి ఎవరు రావాలె? మనకన్న దండిగా ఉన్నోళ్లు రావాలె. కానీ కర్ణాటక నుంచి డీకే శివకుమార్ వచ్చి.. కావాలంటే కర్ణాటకకు వచ్చి చూసుకో.. మా గొప్పతనమేందో తెలుసా? రైతులకు 5 గంటల కరెంటు ఇస్తున్నం అంటున్నాడు. ఆయన ప్రచారానికి వచ్చాడా? ఇజ్జత్ తీసుకోవడానికి వచ్చాడా? 24 గంటల కరెంటు ఇచ్చే రాష్ర్టానికి వచ్చి అలా మాట్లాడడం దేనికి? బస్సులు పెడతాం వచ్చి చూడండి అంటూ సవాల్ చేస్తున్నడు. అట్ల అనేందుకు సిగ్గుండాలె. 24 గంటల కరెంట్ ఇచ్చే తెలంగాణ, ఐదు గంటల కరెంట్ ఇచ్చే కర్ణాటకను చూసి నేర్చుకోవాల్నా? ఇంతకన్నా దిగజారుడుతనం ఉంటదా? ఏం మాట్లాడుతున్నవో ఒళ్లు తెలిసే మాట్లాడుతున్నవా?’ అంటూ నిప్పులు చెరిగారు.
బీఆర్ఎస్లోకి కల్లూరు
యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత కల్లూరు రామచంద్రారెడ్డి బీఆర్ఎస్లో చేరారు. ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కల్లూరుతోపాటు ఆలేరు నియోజకవర్గంలోని మరో పది మంది సీనియర్ నేతలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కల్లూరును కేసీఆర్.. సభకు పరిచయం చేశారు. రామచంద్రారెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 13 వేల ఓట్లు సాధించారు. ఆదివారం ఉదయమే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కల్లూరు చేరికతో ఆలేరులో బీఆర్ఎస్కు మరింత జోష్ వచ్చింది.
కన్నీళ్లు తుడిచాం.. నీరు పారించాం: ఎమ్మెల్యే గాదరి
రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రెస్ తుంగతుర్తి నియోజకవర్గంలో రక్తం పారిస్తే.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నీళ్లు పారించిందని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిశోర్కుమార్ చెప్పారు. ఆదివారం తుంగతుర్తిలో జరిగిన సమర శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. నాడు కాంగ్రెస్ పాలనలో ఈ ప్రాంతం కక్షలు, కన్నీళ్లతో రగిలిపోయేదని చెప్పారు. 2014, 2018లో ఉద్యమ రథసారధి, సీఎం కేసీఆర్ తనకు అవకాశం ఇచ్చి ఈ ప్రాంతానికి పంపితే తుంగతుర్తి ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించారని తెలిపారు.
బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాంతానికి కాళేశ్వరం జలాలను తీసుకొచ్చి సాగు నీరు పారించామని వివరించారు. సీఎం కేసీఆర్ కృషి వల్లే ఈ నియోజకవర్గంలో 1.50 లక్షల ఎకరాలకు కాళేశ్వర జలాలు అందుతున్నాయని చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా నిండని ఈ ప్రాంత చెరువులు నేడు మత్తళ్లు దుంకుతున్నాయని తెలిపారు. నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే మూడోసారీ కారు గుర్తుకు ఓటేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని గాదరి కిశోర్కుమార్ కోరారు.
కోదాడ నియోజకవర్గం నుంచి గతంలో ఎన్నడూ బీసీలకు పోటీచేసే అవకాశం రాలేదు. చదువుకున్న వ్యక్తి అని పిలిచి మల్లయ్యయాదవ్కు టికెట్ ఇచ్చాం. కోదాడ నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు తమ చైతన్యం చూపించాలి. 50 -60 శాతం ఉన్నామని నరుకుడు కాదు.. నవంబర్ 30 నాడు సత్తా చూపించాలి.
– సీఎం కేసీఆర్
గొంగిడి సునీత నా బిడ్డ
తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆలేరు నియోజకవర్గం పరిస్థితి దారుణంగా ఉండేదని, ఒక్కో రైతు డజను బోర్లు వేసి అప్పులపాలై గోసపడ్డారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు ఆలేరు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, రాజాపేట మండలంలో భూముల ధరలు ఎలా పెరిగాయో అందరికీ తెలుసు అని అన్నారు. ‘సునీత నా బిడ్డ. చాలా సౌమ్యురాలు. ఎమ్మెల్యే కాకముందే 2001లో మొట్టమొదట నేను జెండా ఎగరేసిన నాడు నాతో నడిచింది.
జడ్పీటీసీగా గెలిచి స్థానిక ప్రజాప్రతినిధులుగా గెలిచి, ఎమ్మెల్యేగా ఎదిగింది. బిడ్డ మీద తండ్రికి ఎంత ప్రేమ ఉంటుందో తెలుసు. ఆమె అడిగిన పనులన్నీ తప్పకుండా ఈ టర్మ్లో నెరవేరుస్తా’ అని హామీ ఇచ్చారు. ఆలేరులో ఒకనాడు యాసంగిలో 27 వేల ఎకరాలే సాగయ్యేదని, నేడు 2.16 లక్షల ఎకరాలు సాగవుతున్నదని చెప్పారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని కలియుగ వైకుంఠంగా తీర్చిదిద్దుకున్నామని, యాదగిరి గుట్ట ఆలయ శిఖరం ఎత్తుతో సమానంగా సునీతా మహేందర్రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
తుంగతుర్తిని చూస్తేనే తృప్తి
గోదావరి జలాలు రావాలంటే నాటి కమ్యూనిష్టు నాయకుడు బీఎన్ రెడ్డి నాయకత్వంలో ఉద్యమించాలనే నినాదాలు ఒకనాడు తుంగతుర్తి ప్రాంతంలో గోడలపై కనిపించేవని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. ఎన్ని పోరాటాలు చేసినా ఏ ప్రభుత్వమూ కనికరం చూపలేదని, ఏ చెరువులోనూ చారెడు నీళ్లు కనిపించేవికాదని తెలిపారు. అటువంటిది నేడు ఏ చెరువు చూసినా ఒక్క వర్షానికే మత్తడి దుంకే పరిస్థితి ఉన్నదని చెప్పారు. తుంగతుర్తిని చూస్తేనే తృప్తి కలుగుతున్నదని సంతోషం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకొని గోదావరి జలాలు తెచ్చుకోబట్టే నేడు లక్షా 30 వేల ఎకరాలకు నీళ్లు వస్తున్నాయని పేర్కొన్నారు. దేవాదుల నీళ్లు కూడా తిరుమలగిరి మండలంలోని ఏడెనిమిది గ్రామాలకు రావాల్సి ఉన్నదని, త్వరలోనే వస్తాయని చెప్పారు.
తుంగతుర్తిలో సుమారు 2 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని తెలిపారు. నల్లగొండ జిల్లా దామరచెర్ల మండలంలో రూ.30 వేల కోట్లతో దేశంలోనే మొట్టమొదటి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ను నిర్మిస్తున్నామని, రాబోయే నాలుగైదు నెలల్లో 4000 మెగావాట్ల విద్యుత్తు అదనంగా ఉత్పత్తి కాబోతున్నదని వెల్లడించారు. బీఆర్ఎస్ అభ్యర్థి గ్యాదరి కిషోర్ చేసిన సేవలకు, సాధించిన నీటికి, తెచ్చిన సబ్స్టేషన్లకు, ఆయన పడిన కష్టానికి ఈసారి లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. కిషోర్ను లక్ష మెజారిటీతో గెలిపిస్తే మొత్తం తుంగతుర్తి నియోజకవర్గానికి దళితబంధును అమలుచేస్తామని హామీ ఇచ్చారు.
‘పీసీసీ అధ్యక్షుడు 24 గంటల కరెంటు వద్దంటుండు. పైసలు వేస్ట్ అంటుండు. 3 గంటల కరెంటే చాలు అంటుండు. అది సరిపోతదా? ప్రజలు చెల్లించే పన్నులను రైతుబంధు పేరిట దుబారా చేస్తున్నామని ఉత్తమ్కుమార్రెడ్డి అంటుండు. రైతుబంధు అంటే దబారానా?
– సీఎం కేసీఆర్