దిగులు మేఘం కమ్మిన మరాఠ్వాడ రైతాంగంలో నిలువెల్లా విద్యుత్తేజాన్ని నింపారు కేసీఆర్. ఛేదించాల్సిన లక్ష్యం చూపించారు. పిడికిలి బిగించేలా చేశారు. బద్దలు కొట్టడమే తరువాయి. కంధార్ లోహాలో ఆదివారం బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన రెండో సభ.. దగాపడిన రైతాంగంలో ఒక చైతన్యాన్ని రగిలించింది. దావత్ల ప్రలోభాలను దాటుకుని, పోలీసుల ఆంక్షల్ని చీల్చుకుని అశేషంగా తరలివచ్చిన జనం కేసీఆర్కు నీరాజనం పలికారు. మహారాష్ట్రలో రానున్న కిసాన్ తుఫాన్కు అది రెండో ప్రమాద హెచ్చరిక.
‘శివాజీ మహరాజ్ జన్మించిన ఈ పావనధాత్రికి, మరాఠా భూమికి నమస్కరిస్తున్నాను’ అంటూ కేసీఆర్ ప్రారంభించిన ప్రసంగం.. మండుటెండలోనూ చండ ప్రచండంగా సాగింది. అక్కడి రైతు గోసను వ్యక్తీకరిస్తూ, పాలకులను నిలదీస్తూ.. ఒక్కో ప్రశ్నను సూటిగా వదులుతుంటే సభాప్రాంగణం చప్పట్లతో మార్మోగింది. ‘అంబేద్కర్ జన్మించిన నేలన దళితబంధు లాంటి పథకం ఎందుకు అమలు కాలేదు? గోదావరి, కృష్ణా నదుల పురిటిగడ్డపై కరువు ఎందుకు తాండవిస్తున్నది?’ అంటూ ఒక్కో మాటను వడిసెలో రాయిలా విసిరారు కేసీఆర్.
నాందేడ్ సభతో షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వం రైతులకు ఎకరానికి రూ.6 వేలు సాయం అందిస్తామని ప్రకటించాల్సి వచ్చింది. తొలి అడుగులోనే గులాబీ జెండా సాధించిన విజయమిది. అందుకే మలిసభలో మరో ప్రశ్నను అక్కడి పాలకుల ముందుంచారు కేసీఆర్. ‘మహారాష్ట్ర రైతులు బాగుపడే వరకు నేను వస్తూనే ఉంటాను. తెలంగాణ మాడల్ను అమలు చేసి చూపండి. నేను ఆగిపోత’ అని సవాల్ విసిరారు. అందుకే..
జనం కేసీఆర్లో తమను చూసుకున్నారు. ముక్తకంఠంతో జైకొట్టారు.
దేశ్కా నేతా కైసా హో.. కేసీఆర్ జైసా హో..
నలుదిక్కులు పిక్కటిల్లేలా పిడికిలెత్తి నినదించారు..
‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’
నన్ను మహారాష్ట్రకు రావొద్దని డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ అంటున్నడు. తెలంగాణ తరహా రైతు మాడల్ను మహారాష్ట్రలో అమలు చేసేదాకా బరాబర్ వస్తా. ఎకరానికి 10వేల చొప్పున రైతుబంధు ఇస్తవా? నాణ్యమైన 24గంటల కరెంటు ఫ్రీగా ఇస్తవా? ప్రాజెక్టుల నుంచి నీళ్లు మళ్లించి ఉచితంగా పొలాలకు పారిస్తవా? రూ.5లక్షల రైతు బీమా అమలు చేస్తవా? పండిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తదా? ఇవన్నీ చేసి చూపించు. నేను రాను.
– సీఎం కేసీఆర్
హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నేతృత్వంలో మహారాష్ట్రలో సృష్టించబోయే రైతు తుఫాన్ను ఎవరూ అడ్డుకోలేరని తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ వ్యవస్థాపకుడు కేసీఆర్ మహారాష్ట్ర గడ్డపై గర్జించారు. ‘నన్ను మహారాష్ట్రకు రావొద్దని డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ అంటున్నడు. తెలంగాణ తరహా రైతు మాడల్ను మహారాష్ట్రలో అమలు చేసేదాకా బరాబర్ వస్తా. రైతులతో కలిసి పోరాటం చేస్తూనే ఉంటా’ అని ప్రకటించారు. బీఆర్ అంబేద్కర్ వంటి అమూల్య వజ్రం పుట్టిన గడ్డమీద దళితబంధు వంటి పథకం తెచ్చేదాక మహారాష్ట్రకు వస్తూనే ఉంటానని స్పష్టంచేశారు. నాందేడ్ జిల్లా కంధార్ లోహాలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ బహిరంగసభలో సీఎం కేసీఆర్ మహాగర్జన చేశారు. నాందేడ్ సమావేశం తర్వాత బీఆర్ఎస్కు మరాఠ్వాడా గడ్డపై ఇది రెండో సభ. ‘శివాజీ మహరాజ్ జన్మించిన పావన ధాత్రికి, మరాఠా భూమికి నమస్కరిస్తున్నాను’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అశేష జనవాహిని ఆలోచింపజేసేలా ప్రసంగించారు. సీఎం కేసీఆర్ స్పీచ్ ఆయన మాటల్లోనే..
రైతు తుఫాన్ను అడ్డుకోలేరు
పశ్చిమ మహారాష్ట్ర నుంచి ఇటీవల కొందరు నా దగ్గరికి వచ్చి.. సోలాపూర్ ఎందుకు రారు? అని అడిగారు. తప్పకుండా వస్తానని వారికి చెప్పాను. కాకపోతే నామీద నాందేడ్ ప్రజలకు ప్రేమ ఎక్కువ ఉన్నది. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్లు కూడా అంతే ప్రేమతో నన్ను అక్కడికి రమ్మని ఆహ్వానిస్తున్నారు. నాందేడ్ నుంచి ఈ బహిరంగ సభకు వచ్చేవాళ్లను అడుగడుగునా రాకుండా అడ్డుకున్నారు. నా ఉపన్యాసం వినకుండా అనేక ఇబ్బందులకు గురిచేశారు. దారి మళ్లింపు చర్యలు చేపట్టారు. గ్రామాల్లో గొర్లు, మేకలు కోసి దావత్లు ఇస్తున్నారు. రైతుల్లో వచ్చే తుఫాన్ను ఇటువంటి చర్యలు అడ్డుకోలేవు. మనల్నెవరూ ఆపలేరు. కర్షక ద్రోహులంతా ఆ తుఫాన్లో కొట్టుకుపోతరు.
ఫడ్నవీస్.. తెలంగాణ మాడల్ అమలు చేస్త్తవా?
ఇటీవల నేను నాందేడ్ వచ్చి వెళ్లిన తర్వాత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నా మీద ఏవేవో మాట్లాడారు. తెలంగాణకు చెందిన కేసీఆర్కు ఇక్కడేం పని? అని అన్నారు. మీరు తెలంగాణను చూసుకోండి అంటూ చెప్పారు. ఆయనకు ఒక్కటే చెప్తున్న. నేను భారతీయుడిని. దేశంలోని ప్రతీ రాష్ట్రంలోనూ నాకు పని ఉన్నది. ఇక్కడి ప్రభుత్వాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా.. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు విధానాలను మహారాష్ట్రలో మీరు అమలు చేయగలరా?
1) తెలంగాణ రైతులకు ప్రతి ఎకరానికి పెట్టుబడి సాయంగా రూ.10 వేలు ఇస్తున్నాం. మహారాష్ట్రలో అమలు చేయగలరా?
2) రైతులకు ఉచితంగా నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంటును మేం ఇస్తున్నాం. మీరెందుకు ఇవ్వరు?
3) రైతులకు ప్రాజెక్టుల నుంచి ఉచితంగా సాగునీటిని అందిస్తున్నాం. అదే పని ఇక్కడ చేసి చూపగలరా?
4) తెలంగాణలో రైతులు ఏ కారణం వల్ల మరణించినా వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండేందుకు, వారి కుటుంబాలు నిలదొక్కుకునేందుకు రూ.5 లక్షల రైతుబీమా ఇస్తున్నాం. మీరు అమలు చేస్తారా?
5) రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. తెలంగాణవ్యాప్తంగా దాదాపు 7వేల కొనుగోలు కేంద్రాలు తెరిచాం.
మహారాష్ట్రలోనూ ఈ పద్ధతిని అమలు చేయగలరా?
ఇవన్నీ మీరు చేస్తే.. నేను మహారాష్ట్ర రాను. తెలంగాణ రైతు మాడల్ను అమలు చేయనంతవరకు, నేను ఇక్కడికి బరాబర్ వస్తూనే ఉంటాను. రైతులతో కలిసి పోరాటం చేస్తూనే ఉంటాను. రైతుల హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం ఆగదు. మహారాష్ట్రలో ప్రతి ఎకరానికీ నీళ్లు అందేవరకు బీఆర్ఎస్ విశ్రమించదు.
దళితబంధు అమలయ్యేదాకా బాజాప్తా వస్తా..
మహారాష్ట్రలో దళితులు, ఆదివాసీల జీవనం దుర్భరంగా మారింది. ఈ వర్గాలను ఇంకా ఎంతకాలం అలాగే వదిలేద్దాం? ఇలా ఉండటం నాగరిక సమాజానికి మంచిది కాదు. ఈ దుస్థితి నుంచి దళితులను దూరం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచించింది. దళితవర్గాల అభ్యున్నతే ధ్యేయంగా దళితబంధు పథకాన్ని తీసుకొచ్చింది. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ప్రభుత్వమే ఉచితంగా ఆర్థిక సహాయం చేస్తున్నది. దళితులు వారి ఇష్టానుసారం, అభిరుచి, అనుభవం ప్రకారం వ్యాపారాలు చేసుకోవచ్చు. తద్వారా వారు శాశ్వతంగా ఆర్థికంగా నిలదొక్కుకొనే అవకాశం కల్పించాం. ఎటువంటి బ్యాంకు లింకేజీ లేకుండా ప్రభుత్వమే దళితులకు అండగా నిలిచింది. భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి వజ్రం పుట్టిన పవిత్రభూమి నుంచి అడుగుతున్నా.. ‘ఫడ్నవీస్.. మహారాష్ట్రలోనూ దళితబంధు పథకాన్ని తీసుకురండి. దళితులు అద్భుతంగా పురోగమించటానికి మీరు చర్యలు తీసుకోండి. అప్పుడు నేను మహారాష్ట్ర రావడం మానేస్తా. మీరు దళితబంధు పథకం తెచ్చేవరకు మహారాష్ట్రకు వస్తూనే ఉంటా. పోరాటం చేస్తూనే ఉంటా.
పార్టీలు కాదు.. ప్రజల జీవితాలు మారాలి..
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నది. అనేక ఉపన్యాసాలు విన్నాం. అనేక పార్టీలు వచ్చాయి. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అనేకమంది చెప్పిన ముచ్చట్లు విన్నాం. వారి పాలనను చూశాం. ఎన్నికలు వచ్చాయి. పోయాయి. ముఖాలు, పార్టీలు మారుతున్నాయి. కానీ, ప్రజల జీవితాలు మారడం లేదు. గతంలో నాందేడ్లోనూ చెప్పిన. మళ్లీ చెప్తున్న. చదువుకున్నవాళ్లు, విజ్ఞులు, ఆలోచనాపరులు, యువతీయువకులు నా మాటలను జాగ్రత్తగా వినండి. నేను చెప్పేది నిజమా? అబద్ధమా? అనేది గుండెపై చేయి వేసుకుని ఆలోచించండి. ఇంటికి వెళ్లిన తరువాత మీ గల్లీలో, మీ ఊరిలో చర్చ పెట్టండి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి. స్వతంత్ర భారత దేశాన్ని 70 ఏండ్లపాటు రెండు పార్టీలే పాలించాయి. కేవలం ఐదేండ్లు మాత్రమే వీపీ సింగ్, చంద్రశేఖర్, చరణ్సింగ్, మొరార్జీదేశాయ్, దేవెగౌడ వంటివారు ప్రధానులు ఉన్నారు. 54 ఏండ్లు కాంగ్రెస్, 16 ఏండ్లు బీజేపీ ఉన్నది. కాంగ్రెస్ పాలనకు, ఇప్పుడు బీజేపీ పాలనకు ఏమైనా తేడా ఉన్నదా? మన జీవితాలేమైనా మారాయా? అనేది ఆలోచించాలి. పార్టీలు, పాలించే నాయకులు మారారు కానీ, ప్రజలకేం ఒరిగింది? రైతులకు ఏం మేలు జరిగింది? దయచేసి ఆలోచించండి.
అన్ని వనరులు ఉన్నా ఎందుకీ దురవస్థ?
అమెరికా, చైనా సహా ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా సారవంతమైన, సాగు యోగ్యమైన భూమి భారత్లో ఉన్నది. దేశంలో అద్భుతమైన పంటలు పండించగలిగిన 41 కోట్ల ఎకరాల భూమి ఉన్నది. పుష్కలమైన సూర్యరశ్మి, అత్యద్భుతమైన వాతావరణం ఉన్నది. మంచివర్షాలు కురుస్తాయి. మన నేలల్లో మామిడి పండుతుంది. ఆపిల్ పండుతుంది. ఇటువంటి వైవిధ్యమున్న దేశం మనది. 140 కోట్ల మానవ వనరులున్నాయి. కానీ, మన పిల్లలు మనకండ్ల ముందే మెక్డోనాల్డ్ పిజ్జాలు.. విదేశీ కంపెనీల డబుల్ రొట్టెల దుకాణాలకుపోయి కొనుక్కొని తింటున్నరు. ఎందుకు మనకీ ఖర్మ..? దేశంలో మహారాష్ట్రతో సహా అనేక ప్రాంతాల్లో 361 బిలియన్ టన్నుల బొగ్గు ఉంది. ఈ నిల్వలతో యావత్తు దేశానికి నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా 125 ఏండ్లపాటు ఇవ్వవచ్చు. కానీ ఎందుకు విద్యుత్తు ఇవ్వడం లేదు? భగవంతుడు పుష్కలమైన నీళ్లు, బొగ్గు ఇచ్చారు. కానీ రైతులకు అవీ ఎందుకు అందడం లేదు? ప్రధాన మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు పాలకులు వాటిని రైతులకు అందకుండా అన్యాయం చేస్తున్నారు.
నీళ్లున్నా.. నాందేడ్ ఎడారిలా ఎందుకున్నది?
నేను హైదరాబాద్ నుంచి నాందేడ్ వరకు విమానంలో వస్తుంటే చూసిన. అంతా ఎండిన భూమి, ఎడారిని తలపించింది. కారణం ఏమిటి? గోదావరి, కృష్ణా నదులు మహారాష్ట్ర నుంచే వెళ్తాయి. కానీ ఇక్కడ తాగునీరు ఇంటింటికీ అందదు. సాగునీరు దొరకదు.
దేశంలో 41 కోట్ల ఎకరాలకు సరిపోను పుష్క లమైన నీరు ఉన్నది. దేశంలోని నదుల్లో 70 వేల టీఎంసీల నీరు ప్రవహిస్తున్నది. ఇందులో కేవలం 19 వేల టీఎంసీల నీటిని మాత్రమే మనం వినియోగించుకుంటున్నాం. మిగిలిన 50వేల టీఎంసీలు మన కండ్ల ముందే సముద్రంలో కలుస్తున్నాయి. ప్రధాని, ఇంతమంది సీఎంలు చూస్తుండగా సముద్రం పాలవుతున్నది.
నీటి కోసం ఏ దేశం దగ్గరనో బిచ్చమెత్తాల్సిన పనిలేదు. ప్రకృతి మనకు పుష్కలమైన నీటి సంపదను ఇచ్చింది. మన అవసరాలకు మించి నీళ్లున్నా మన రైతులు ఎందుకు నీటి కోసం తిప్పలు పడాలి? ఎందుకు వంచనకు గురికావాలి? కొందరు ప్రసంగిస్తే మైకులు పగిలిపోతాయి. ముచ్చట్లు చెప్తరు కానీ నీళ్లు మాత్రం ఇవ్వరు. వాళ్లు చెప్పే ముచ్చట్లు వింటే కండ్లుతిరిగి పడిపోవుడే.
బడ్జెట్లో నిధులు.. గులాబీ జెండా బలం
కేసీఆర్ నాందేడ్కు ఒకే ఒక్కసారి వచ్చి వెళ్తేనే రైతులకు ఎకరాకు రూ.6 వేలు ఇచ్చేటట్టు బడ్జెట్లో పెట్టిండ్రు. మరి అంతకుముందు ఎందుకు ఇవ్వలేదు? ఇది గులాబీ జెండా బలం. కానీ 6 వేలు కాదు కావాల్సింది.. ఎకరానికి 10 వేలు కావాలి. మరి దీని కోసం కొట్లాడుదామా? వద్దా?. నేను ఒక్కటే అడుగుతున్నాను. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ కొట్లాడుతనే ఉన్నాం. హర్యానా భూమిపుత్రుడు చోటారామ్ జమానా నుంచి, మహేందర్సింగ్ టికాయత్ జమానా నుంచి, బెంగళూర్కు చెందిన ప్రొఫెసర్ నంజుండస్వామి జమానా నుంచి , ఇక్కడి శరత్జోషి జమానా నుంచి రైతుల కోసం పోరాటం జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు అశోక్ నావ్లే నేతృత్వంలో నాసిక్ నుంచి 10 వేల కిలోమీటర్ల పొడవునా పాదయాత్ర జరిగింది. ఇలా అనేకమంది రైతుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇక్కడ దశరథ్ సావంత్ కాకా 84 ఏండ్ల వయసులోనూ పోరాడుతున్నారు. ఇలా అనేకమంది నాయకులతో కలిసి రైతులు ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఇంకెంతకాలం పోరాడాలి?. ప్రతి సంవత్సరం ఎందుకు ఉద్యమించాల్సి వస్తున్నది? ప్రతిసారి రోడ్డెక్కాల్సి వస్తున్నది? ఎప్పటివరకు ఇట్లనే కొట్లాడుదాం? మన నొసటన ఇదే రాసి ఉన్నదా? ఒక్కసారి ఆలోచించండి. అసెంబ్లీకి, పార్లమెంట్కు మనం పంపించిన వాళ్లు ఎక్కడ పడుకున్నారు? ఎక్కడికి పారిపోయారు?
హామీలు నెరవేర్చని క్షమాపణ ఎందుకు?
ఇదే వేదిక మీద కూర్చున్న భారత రాష్ట్రసమితి కిసాన్ సెల్ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చడూనీ 13 నెలలపాటు రైతు ఉద్యమంలో పాల్గొన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన ఈ ఆందోళనలో 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. మరి ఇంతమంది రైతులు చనిపోతే దేశ ప్రధానమంత్రి ఒక్క మాటైనా మాట్లాడలేదు. కానీ పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు రాగానే రైతులను క్షమాపణ కోరారు. మనమేమైనా పిచ్చోళ్లమా? క్షమాపణ చెప్పగానే సరిపోయిందా? ఇచ్చిన హామీ ఒక్కటైనా నెరవేరిందా? ఏదైనా మేలు జరిగిందా?
సాధించుకునే తాకత్ లేదా?
మనం ఎప్పుడైతే ఐక్యంగా నిలబడి కొట్లాడుతామో, అప్పుడు ఇదే పాలకులు దిగివచ్చి క్షమాపణ చెప్తారు. ఎకరానికి రూ.6 వేలు ఇస్తామంటారు. ఇంకెన్నో డ్రామాలు చేస్తారు. కానీ 10 వేలు ఎందుకు ఇవ్వకూడదు? ఒకరు ఇవ్వ డం ఏంది? మనం తీసుకోవడం ఏంది? రైతన్నలు, కార్మికులు, దళితులు ఒక్కసారి ఆలోచించాలె. ఎవరి దగ్గరా భిక్షమెత్తుకోవాల్సిన అవస రం మనకు లేదు. దరఖాస్తులు పెట్టాల్సిన అగ త్యం లేదు. వాటిని పోరాడి సాధించుకొనే తాకత్ మనలో లేదా? మనం ఎందుకు ఎవరిచుట్టో తిరగాలి? రైతులే పాలకులు కావొద్దా? అన్నివిధాలా ఆలోచించిన తర్వాతే నేను ఓ ఉద్యమానికి దిగిన. అదే అబ్కీ బార్ కిసాన్ సర్కార్. నేను ఒకే ఒక్కమాట చెప్తున్నాను. జాతి పేరుతో, ధర్మం పేరుతో కొట్లాడుకుంటూ ఉన్నంతకాలం మన జీవితాల్లో మార్పు రాదు. న్యాయం జరగదు, రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉంటాయి. రైతులంతా ఐక్యంగా ఉంటే ఆరు వేలు ఎలా వచ్చాయో? అదే ఐక్యమత్యాన్ని ప్రదర్శిస్తే మన సమస్యలకు పరిష్కా రం లభిస్తుంది. ఇవ్వాల్సింది ఒడిలో వచ్చి పడుతుంది. రైతుల ఐక్యమత్యమే మన బలం అదే మన మంత్రం.
ఒక్క ఝలక్ ఇద్దాం
పాలకులు రైతుల గురించి ఎందుకు ఆలోచించడం లేదు? వారి ధీమా ఒక్కటే. రైతులు బీజేపీకో, కాంగ్రెస్కో, ప్రాంతీయ పార్టీకో ఓట్లేస్తారు. ఎవరికి వేయకుండా వారు ఉండలేరనేదే వారి ధీమా. అందుకే ప్రస్తుత రాజకీయ పార్టీలు రైతులను తేలిగ్గా తీసుకుంటున్నాయి. అందుకే మన మాటను, డిమాండ్ను ఖాతరు చేయడం లేదు. ప్రతి ఎకరానికి నీరు రావాలి. విద్యుత్తు ఇవ్వాలి. ఇవన్నీ రావాలంటే ఒకే ఒక్క ఝలక్ ఇద్దాం.
లోహా సభ నుంచి నేను ప్రకటిస్తున్నాను. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ రిజిస్ట్రేషన్ చేయించాం. వచ్చే మహారాష్ట్ర స్థానికసంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం. అన్ని జిల్లా పరిషత్లపై గులాబీ జెండా ఎగరబోతున్నది. వీటన్నింటినీ గెలుచుకుంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరాక తప్పదు. మూడు, నాలుగు ఏండ్లుగా బాబూరావ్ కదమ్, యువ నాయకుడు గణేశ్ కదమ్ ధర్మాబాద్ నుంచి ఎన్నో ఏండ్లుగా పోరాడుతున్నారు. తమకు తెలంగాణ మాడల్ అమలు చేయాలని 80 గ్రామ పంచాయతీల నుంచి తీర్మానం చేయించారు. లేనిపక్షంలో మమ్మల్ని తెలంగాణలోనైనా కలపాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంతమంది సర్పంచులు తీర్మానం చేశారో.. వారందరినీ పిలిచి నాందేడ్లో సమావేశం పెట్టమని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. ఒక్క సరిహద్దు గ్రామాలు మాత్రమే ఎందుకు? ఔరంగాబాద్, విదర్భ, సోలాపూర్, పశ్చిమ మహారాష్ట్ర నుంచి అందరినీ పిలవండి. ప్రభుత్వంలో చలనం రావాలంటే, ప్రభుత్వం మన గురించి ఆలోచించాల్సిన అనివార్యత రావాలంటే.. వచ్చే పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఒక్క ఝలక్ ఇచ్చి చూపించండి. అప్పుడు ఏమేమి రావో, ఎట్లా రావో చూద్దాం.
రైతులతో మజాక్ చేస్తున్నారా?
ఫసల్ బీమా యోజన ఎవరికైనా అందుతున్నదా? రైతులతో మజాక్ చేస్తున్నారా? అందుకే నేను మీతో చేసే విజ్ఞప్తి ఒక్కటే. జాతి, మతం గొడవలు కాదు.. కావాల్సింది కిసాన్ వాదం ఒక్కటే. ఏకతాటిపై నిలబడండి. ఈ రోజు ఎంతోమంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మహారాష్ట్ర నుంచి ఎన్నో డిమాండ్లు వస్తున్నాయి. సోలాపూర్ రమ్మంటున్నారు. పశ్చిమ మహారాష్ట్ర రమ్మంటున్నారు. ఇది ఛత్రపతి శివాజీ, జ్యోతిబాఫూలే, సావిత్రీబాయి ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి ఎంతోమంది మహనీయులు జన్మించిన పవిత్ర భూమి. కానీ పాలకులు సాగునీరు, తాగునీరు, విద్యుత్తు ఇవ్వలేకపోయారు.
రైతుల బలవన్మరణాలను వారు లెక్కలోకి తీసుకోవడమే మానేశారు. మీ త్యాగం తో గద్దె నెక్కినవారు మజా చేస్తున్నారే తప్ప, పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. వీటన్నింటికీ మనమే ముందు అడుగు వేసి కిసాన్ సర్కార్ను తీసుకొస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. తెలంగాణలో అన్ని నెరవేరినప్పుడు మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదు. గ్రామ గ్రామానికీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. మీ సభ్యత్వం తీసుకుంటారు. ప్రతి గ్రామంలో కమిటీలు వేస్తారు. మన మనోసంకల్పం నెరవేరబోతున్నది. విజయం ప్రాప్తిస్తుంది. ఆత్మహత్యలు బంద్ అవుతాయి. నేను చెప్పిన విషయాలపై మీరు గ్రామాలకు వెళ్లి చర్చించండి. ప్రతి గ్రామంలో కిసాన్ జెండా ఎగరాలి. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్. జై తెలంగాణ, జై మహారాష్ట్ర.. జై భారత్ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
ఎట్లుండె తెలంగాణ.. ఎలా మారింది?
9 ఏండ్ల కిందట తెలంగాణ మహారాష్ట్ర కంటే అధ్వానంగా ఉండేది. ప్రతిరోజూ నా కండ్లళ్ల నీళ్లొచ్చేవి. ప్రతిరోజూ నలుగురు, ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకునేటోళ్లు. సోదరులారా ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీకు కావాల్సినవన్నీ నేను తీసుకొస్తా.. అని వారికి ధైర్యం చెప్పాను. చెప్పినట్టే వారికి ఇప్పుడు నీళ్లు వచ్చినయి. విద్యుత్తు అందుతున్నది. నివాసాలు వచ్చాయి. ఒకప్పుడు మహారాష్ట్ర కంటే వెనుకబడిన తెలంగాణ బాగుపడింది. ఇప్పుడు దేశానికే ఆదర్శంగా మారింది. తెలంగాణ బాగుపడినప్పుడు మహారాష్ట్ర ఎందుకు కాదు? ఇవన్నీ చేయడానికి పదేండ్లకు మించి పట్టదు. తెలంగాణ కంటే మహారాష్ట్ర అన్నివిధాలా సుసంపన్నంగా ఉంది. తక్కువ వ్యవధిలోనే మహారాష్ట్రను అభివృద్ధి చేయవచ్చు. మనసు పెట్టి ఆలోచించండి. నాందేడ్లో విమానం దిగినప్పుడు అక్కడ అధికారులు వచ్చి చెప్పారు. ఇక్కడ విమానాశ్రయం 4.45కే మూసివేస్తారు. త్వరగా రావాల్సి ఉంటుందని వారు చెప్పారు. 24 గంటలు పనిచేయాల్సిన ఎయిర్పోర్టు కేవలం పగలు మాత్రమే నడిచే పరిస్థితా? దేశం ముందుకు పోతున్నదా? వెనకకు పోతున్నదా? దేశంలో ప్రస్తుతం ఈ తమాషా నడుస్తున్నది.
జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తాకత్ చూపెట్టాలి
కంధార్-లోహా సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగాన్ని స్థానిక ప్రజలు ఆద్యంతం ఆసక్తిగా ఆలకించారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీల ద్వంద్వ విధానాలను కేసీఆర్ పూసగుచ్చినట్టుగా వివరించారు. తెలంగాణ రైతు ల కష్టాలు కడబాపినవిధంగానే మహారాష్ట్ర రైతుల కష్టాలు తొలగిస్తానని.. బీఆర్ఎస్ పార్టీని హత్తుకోవాలని కేసీఆర్ పిలుపునివ్వగానే సభికులు నినాదాలతో మద్దతు పలికారు. ‘నా బాధ మీ గుండెను తాకితే చాలు దేశం మారిపోతుంది’ అంటూ కేసీఆర్ పలికిన మాటలు మరాఠీ ప్రజల హృదయాలను కదిలించాయి. ‘ఇప్పటివరకూ ఎంతోమందిని ఎమ్మెల్యేలు, ఎంపీలు చేశాం. ఇకపై మనమే ఎన్నికల్లో గెలుద్దాం. రైతులు ఐక్యంగా ఉండాలి. ఒకసారి పాలకపార్టీలకు ఝలక్ ఇవ్వాలి. వచ్చే జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తాకత్ చూపెట్టాలి’ అంటూ కేసీఆర్ అనగానే ‘జరూర్ జరూర్’ అంటూ సభికులు స్పందించారు.
లోహా సభ ఏర్పాట్లను ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, షకీల్, బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు మాణిక్రావు కదం, కంధార్ మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గే, దిలీప్ దోండ్గే, శివరాజ్ దోండ్గే పర్యవేక్షించారు. సభకు కేసీఆర్ వెంట ఎంపీలు సంతోష్కుమార్, దీవకొండ దామోదర్రావు, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ మహారాష్ట్ర జనరల్ సెక్రటరీ హిమాన్షు తివారి, ఒడిశా బీఆర్ఎస్ నాయకుడు అక్షయ్కుమార్, మాజీ ఎమ్మెల్యే దీపక్ ఆత్రం, మాజీ ఎంపీ హరిబాహు రాథోడ్, బీఆర్ఎస్ నాయకులు అమృత్ లాల్ చౌహాన్, భాస్కర్ గుడాల, రాఘవ, బీఆర్ఎస్ కిసాన్ సెల్ జాతీయ అధ్యక్షుడు గుర్నామ్సింగ్ చదూనీ, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, కన్నాడ్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ జాదవ్, సురేశ్ గైక్వాడ్ తదితరులు హాజరయ్యారు.