గాంధీ చేపట్టిన చంపారన్ ఉద్యమమైనా.. చరణ్ సింగ్ తీసుకొచ్చిన భూ సంస్కరణలైనా.. చెరుకు రైతుల కోసం టికాయిత్ పడ్డ కష్టమైనా.. హర్యానా రైతులకు దేవీలాల్ చేసిన కృషైనా.. మహారాష్ట్ర రైతుల కోసం శరద్ జోషి ఎత్తిన గళమైనా.. ప్రాంతానికో, రాష్ర్టానికో, వర్గానికో పరిమితం
కానీ, స్వతంత్ర భారత చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక నాయకుడు రైతే కేంద్రంగా దేశ రాజకీయాన్ని తిరగరాస్తున్నాడు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అంటూ పదం కలిపాడు! రైతే కేంద్రంగా రాజకీయ ఉద్యమానికి ఊపిరినిచ్చాడు!!
స్వతంత్ర భారత చరిత్రకు ముందైనా, తర్వాతైనా.. దేశంలో రైతు రాజ్యం కోసం ఉద్యమం చేసింది లేదు.. ఉద్యమాల ఉగ్గు పాలు తాగిన ఒక నాయకుడు.. పోరాటాలనే శ్వాసగా పీల్చిన ఒక నేత..
ఉద్యమాన్ని నరనరాన నింపుకొన్న ఒక లీడర్.. రైతు రాజ్యం రావాలని ఆక్షాంక్షిస్తున్నారు.. రైతే రాజు కావాలని కోరుకుంటున్నారు.. అందుకే.. దేశ రైతుకు ‘బీఆర్ఎస్’తో అండనిచ్చారు! దేశ ప్రజలకు ‘కేసీఆర్’ అనే ధైర్యాన్నిచ్చారు!!
(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, 17 జనవరి (నమస్తే తెలంగాణ): రైతుల కోసం పోరుబాటలు.. ధర్నాలు.. నిరసనలు.. ఆందోళనలు జరిగాయి. చిన్న చిన్న ఉద్యమాలూ నడిచాయి. అవి ఒక జిల్లాకో, ఒక ప్రాంతానికో, ఒక రాష్ర్టానికో మాత్రమే పరిమితమయ్యాయి. అలాంటిది దేశంలోని అన్నదాతలందరినీ ఏకం చేసి కేంద్రంలోని రైతు వ్యతిరేక ప్రభుత్వంపై రణన్నినాదం చేశారు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు. ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో రైతుల గుండెల్లో ధైర్యం నింపారు. ఇప్పుడు ఆ రైతు రాజకీయ ఉద్యమానికి బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నాందిగా నిలవబోతున్నది. బీజేపీ వ్యతిరేక పక్షాలను, ప్రజాస్వామ్యవాదులను, రైతు నాయకులను కూడగడ్డి, బడాబాబుల కొమ్ముకాస్తున్న బీజేపీ ప్రభుత్వానికి చరమ గీతాన్ని పాడటానికి మరో రాజకీయ ఉద్యమానికి సీఎం కేసీఆర్ శంఖారావం పూరించనున్నారు.
ఖమ్మంలో తలపెట్టిన ఈ ఆవిర్భావ సభలో కేంద్రంలో రైతు సంక్షేమ ప్రభుత్వ ఏర్పాటు ఎంత అవసరమో నొక్కి చెప్పబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలే దేశానికి మాడల్ అని నినదించబోతున్నారు. తెలంగాణలో రైతులకు అమలు అవుతున్న పథకాలు దేశంలో అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని, రైతే రాజు అన్న నినాదాన్ని మరోసారి నిజం చేయాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిస్తూ రాజకీయ ఉద్యమానికి తెరలేపనున్నారు.
కేసీఆర్ తెలంగాణ సీఎంగా కొనసాగుతూనే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా స్వయంగా ఇందిరా పార్కు వద్ద ధర్నా చేసి తన నిజాయితీని నిరూపించుకొన్నారు. ఇతర రాష్ర్టాల సీఎంలూ రైతు ఉద్యమానికి మద్దతునిచ్చినా, ఎవరూ స్వయంగా ధర్నా లో పాల్గొనే సాహసం చేయలేదు. కానీ, కేసీఆర్ ఆ సాహసం చేశారు. కేంద్ర రైతు వ్యతిరేక విధానాలను నిలదీశారు, నిలదీస్తున్నారు. ఉద్యమంలో అమరులైన పంజాబ్, బీహార్ రైతు కుటుంబాలకు ఆపన్న హస్తం అందించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా రైతులకు అండగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తించి, నెత్తికి రుమాలు చుట్టారు.
రైతు కేంద్రంగా చారిత్రక ఉద్యమాలు
ఆంగ్లేయుల పాలనలోనే దేశంలో రైతు ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఆ నాడే భూసంస్కరణల కోసం రైతులు ఉద్యమించారు. శిస్తులు చెల్లించని రైతుల నుంచి భూములను లాక్కున్న బ్రిటిష్ పాలకులకు ఎదురు తిరిగారు. రైతు సమస్యలపై 1768 నుంచి 1800 వరకు ఆంగ్లేయులతో పోరాడిన చరిత్ర మన రైతాంగానికి ఉన్నది. స్వాతంత్య్రానంతరం దున్నేవాడికే భూమి, జై జవాన్ జై కిసాన్ లాంటి ఎన్నో నినాదాలు దేశ రాజకీయాల్లో రైతుల ప్రాధాన్యాన్ని చాటి చెప్పాయి. ప్రపంచ వాణిజ్య సంస్ధ (డబ్ల్యూటీవో) విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 1994 లో పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగాయి. గ్రామీణ, వ్యవసాయ రంగానికి ప్రాతినిధ్యం వహించిన దేశ నాయకుల్లో అగ్రగణ్యులు దేవీలాల్, చరణ్సింగ్, శరద్ అనంతరావు జోషి లాంటి ఎందరో నాయకులను ఉదహరించవచ్చు.
ఈ తరం నాయకుల్లో రాకేశ్ టికాయత్ ఒకరు. మాజీ ఉప ప్రధాని దేవీలాల్ రైతుల పక్షాన నిలబడి ఒక్క కలం పోటుతో అప్పట్లోనే 60 వేల కోట్ల పంట రుణాలు రద్దు చేయించారు. రాకేశ్ టికాయిత్ తండ్రి మహేంద్ర సింగ్ టికాయిత్ కూడా అలనాటి ప్రముఖ రైతు నాయకుడే. భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో రైతు ఉద్యమాలు చేస్తూ రాకేశ్ టికాయత్ 44 సార్లు జైలుకు వెళ్లారు. ఈయన కూడా బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చారంటే రైతుల పట్ల, రైతు సంక్షేమం పట్ల కేసీఆర్కు ఉన్న చిత్తశుద్ధి ఎంత గొప్పదో చెప్పుకోవచ్చు.
తెలంగాణను పచ్చగా చూడాలి..
అదే నా ఆకాంక్ష (26.4.2017)
నా వయస్సు ఇప్పుడు 64. తెలంగాణ కావాలనుకున్నా, సాధించా. బంగారు తెలంగాణ కావాలనుకుంటున్నాను. నాకు ఎవరితోనూ పంచాయతీ లేదు. కొట్లాట లేదు. బతికి ఉన్న ఈ మిగిలిన కాలంలో తెలంగాణ పచ్చగా కళకళలాడుతుంటే.. దుఃఖం లేని రైతు కండ్లు చిరునవ్వుతో ఉంటే చూడాలనే కాంక్ష తప్పితే, నాకు మరో కాంక్ష లేదు. దయచేసి మీరు నా అన్నాదమ్ములుగా, అక్కాచెల్లెళ్లుగా, నా ఆకాంక్ష నెరవేర్చుతారని భావిస్తున్నా.
ఇది నా స్వప్నం (06.11.2017)
తెలంగాణ రైతులు కరెంటు కోసం దశాబ్దాల తరబడి అనేక బాధలు పడ్డారు. సమైక్య రాష్ట్రంలో రైతులకు కరెంటు ఇచ్చే అంశం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. పరిస్థితిలో మార్పు తేవాలని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే అనుకున్న. దీని ఆవశ్యకతను విద్యుత్తు అధికారులకు విడమరిచి చెప్పిన. విద్యుత్తు సంస్థలు అహోరాత్రులు పనిచేసి, అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించినయి. ప్రస్తుతం మూడు జిల్లాల్లో 24 గంటల కరెంటు ఇస్తున్నం. రైతులందరికీ 24 గంటల కరెంటు
ఇవ్వాలన్నది నా స్వప్నం.
అసాధ్యాలు.. సుసాధ్యం చేశాం (01.11.2020)
రాష్ట్రం రావడం అసాధ్యమన్నారు. అది సాధించాం. కరెంటు, కాళేశ్వరం జలాలు.. ఇలా ప్రతిదీ ఉమ్మడి రాష్ట్రంలో అసాధ్యమన్నారు. అవన్నీ సుసాధ్యం చేశాం. ప్రతి రైతు ఖాతాలో రూ.2 లక్షల నుంచి 5 లక్షలు నిల్వ ఉండటమే బంగారు తెలంగాణ. అదే నా కల. ఆ స్వప్నం కచ్చితంగా సాధ్యమవుతుంది.
దండగన్న సాగును పండగ చేశాం (15.1.2023)
తెలంగాణ వ్యవసాయరంగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక ప్రగతి అందించే స్ఫూర్తితో, దేశ రైతాంగానికి వ్యవసాయం పండుగైన నాడే.. భారతదేశానికి సంపూర్ణ క్రాంతి చేకూరుతుంది. ఒకనాడు దండుగన్న వ్యవసాయం తెలంగాణలో నేడు పండుగైంది. యావత్ భారత ప్రజల సహకారంతో, సమష్టి కృషితో దేశ వ్యవసాయరంగ నమూనాను సమూలంగా మార్చి గుణాత్మక అభివృద్ధికి బాటలు వేయాలి.
స్వయం సమృద్ధి సాధించాలి (28.08.2020)
దేశంలో 15 కోట్ల కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాయి. పరోక్షంగా కొన్ని కోట్లమంది ఆధారపడ్డారు. 135 కోట్ల జనాభా కలిగిన దేశానికి ప్రపంచంలో ఇతర దేశమేదీ తిండి పెట్టలేదు. ఆహార ఉత్పత్తుల్లో మనమే స్వయం సమృద్ధి సాధించాలి. – సీఎం కేసీఆర్