LRS | ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ బుధవారం నిరసనలకు దిగనున్నది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం అన్ని నియోజకవర్గాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్, హెచ్ఎండీ కార్యాలయాల వద్దకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 7న జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలను కలిసి వినతిపత్రాలు అందజేయనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నగరంలో ఉదయం 10.30 గంటలకు జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ జిల్లాశాఖ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్తో పాటు మేయర్ విజయలక్ష్మి, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు నిరసన చేపట్టనున్నారు.
అమీర్పేట మైత్రివనంలో ఉన్న హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయం వద్ద మాజీ మంత్రులు పద్మారావు గౌడ్, ఎమ్మెల్యేలు కృష్ణారావు, కేపీ వివేకానంద్, సికింద్రాబాద్ పార్లమెంటరీ స్థానం ఇన్చార్జి తలసాని సాయి, ఆయా నియోజకవర్గాల కార్పొరేటర్లు పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టనున్నారు. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ఫీజును రద్దు చేసి.. ఉచితంగా భూములు క్రమబద్ధీకరిస్తామని ప్రకటించగా.. తాజాగా ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు ఫీజు వసూలు చేస్తుండడంపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. ఇందులో భాగంగా ఉచితంగానే క్రమబద్ధీకరణ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళనకు పిలుపునిచ్చారు.