KCR | పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. నల్లగొండ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆ నాడు రాష్ట్రం కోసం కొట్లాడినం. ఆ నాడు జలసాధన ఉద్యమంలో మండలానికో బ్రిగేడియర్ వచ్చి నెలపదిహేను రోజులు తిరిగి ప్రజలను చైతన్యం చేశాం. ఆ రోజు నేనే రాసిన పాట. పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమి లేకపోయె’ అని. ఆ రోజు ఏడ్చినం. ఈ రోజు గోదావరి, కృష్ణ కలిపి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకునే ప్రయత్నాలు చేసుకుంటున్నాం. బోనగిరి దగ్గర బస్వాపూర్ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యింది. డిండి ప్రాజెక్టు పూర్తి కాబోతున్నది. పాలమూరు ఎత్తిపోతల కోసం నోర్లు తెరుచుకొని చూస్తున్నరు దేవరకొండ, మునుగోడు వగైరా ప్రాంతాల ప్రజలు. పైన పాలమూరు ఎత్తిపోతల అయితే పాలమూరుతో పాటు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజలు ఎదురుచూస్తున్నరు ఎప్పుడు నీళ్లు వస్తయని’ అన్నారు.
‘ఎవరు సహకరించకున్నా ఇదే కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు వందలకొద్ది కేసులు వేసినా పదేళ్లు పంటిబిగువున కొట్లాడుతూ.. కేంద్రం పోరాటం చేస్తూ ముందుకు తీసుకుపోయాం. ఆనాడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ ఇచ్చిన గవర్నమెంట్ ఆ రోజు ఏడాది కోసం తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోండి.. ఆ తర్వాత ఎవరి వాటా వారికి వస్తుందని చెప్పింది. ఆ నాడు బిల్లు పాస్ కావాలి.. తెలంగాణ రావాలి.. ఇదో ఆటంకం కాకూడదని.. సరే కానివ్వండి తర్వాత చూసుకుందామని చెప్పాం. ఆ తర్వాత ఢిల్లీలో మోదీ ప్రభుత్వం వచ్చింది. వాళ్లకు వందల ఉత్తరాలు రాసినం. అయ్యా మునిగిందే మేం నీళ్లల్లో.. నాశనం అయ్యాం.. మా బతుకులు ఆగమైపోయినయ్.. వెంటనే నీళ్ల పంపిణీ చేయండి.. ట్రిబ్యునల్ వేయాలని అడితే వేయలేదు. వేయకపోతే సుప్రీంకోర్టుకుపోయాం. సుప్రీంకోర్టుకుపోయి తగాదా పెట్టాం. ఆ తర్వాత కూడా వేయలేదు. ఒక రోజు మీటింగ్ జరిగితే.. గట్టిగా నిలదీస్తే కేసు వాపస్ తీసుకుంటే ట్రిబ్యునల్ వేస్తామని చెప్పారు. సరేనని కేసు విత్డ్రా చేసుకున్నాం. ఆ తదనంతరం ట్రిబ్యునల్ త్వరగా వేయలేదు. వంద ఉత్తరాలు నేను రాసిన’ అంటూ గుర్తు చేశారు.
‘లోక్సభను స్తంభింపజేసినం. ఎంపీలకు మీరు ఏమైనా మంచిదే కొట్లాడాలని చెబితే.. వారం రోజులు లోక్సభ జరుగనివ్వలేదు. అట్ల కొట్లాడినం. ఆ ఒత్తిడికి తలొగ్గి.. ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు ట్రిబ్యునల్కు వేశారు. ఇప్పుడు జరగాల్సిందే ఏంటీ ? ఏ గవర్నమెంట్ ఉన్నా.. మా గవర్నమెంటే ఉండి ఉన్నా ఏం చేయాలి..? ట్రిబ్యునల్ ముందు గట్టిగా వాదించి.. చరిత్ర మొత్తం చెప్పి.. మన అవసరాలు, కరువు చెప్పి, బాధలు చెప్పి.. మన వాటా ఇంత రావాలని కొట్లాడాలే. అది మొగోడు చేయాల్సిన పని. ప్రజల మీద ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని. మీకేం కోపం వచ్చిందో.. ఏం భ్రమలో పడ్డరో.. పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నరు. ఆ తర్వాత ఏం నడుస్తుందో మూడో నెల మీరే కళ్లారా చూస్తున్నరు. చిన్న చిన్న విషయాలు ఫర్వాలేదు. మన జీవితాలను దెబ్బకొట్టేటటువంటి కృష్ణా జలాలు కేఆర్ఎంబీ భద్రప్పల్లాగా పోయి గర్నమెంట్ అప్పగించింది’ అంటూ కేసీఆర్ ధ్వజమెత్తారు.