KCR | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (KCR)కు శుక్రవారం ఎడమతుంటి మార్పిడి (హిప్ రీప్లేస్మెంట్) శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయిందని యశోదా హాస్పిటల్ వైద్యులు తెలిపారు.శస్త్రచికిత్స చేసిన తర్వాత కేసీఆర్ను రూమ్కి షిఫ్టు చేసినట్లు వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స తర్వాత ఆయన కోలుకునేందుకు కనీసం ఎనిమిది వారాల సమయం పడుతుందని వెల్లడించారు. శనివారం ఉదయం మరోసారి పరీక్షించి ఫిజియో థెరపీ, పౌష్టికాహారంపై సూచనలు చేస్తామని తెలిపారు. సీనియర్ ఆర్ధోపెడిక్ సర్జన్లు, అనెస్థీషియన్లతో కూడిన టీం ఆయనకు విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారు.
గురువారం రాత్రి ఎర్రవెల్లిలోని ఫామ్హౌజ్లో కాలుజారి పడిపోయిన కేసీఆర్ని ఆయన కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోద దవాఖానకు తరలించిన సంగతి తెలిసిందే. డాక్టర్ ఎంవీ రావు ఆధ్వర్యంలోని వివిధ వైద్యుల టీమ్స్ వైద్య పరీక్షలు నిర్వహించారు. అటుపై ఆయనకు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయాలని నిర్ణయించారు. శుక్రవారం సాయంత్రం కేసీఆర్కు సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సతీమణి శోభ, కేటీఆర్, కూతురు కవిత, ఎంపీ సంతోష్ రావు, ఎమ్మెల్యేలు టీ హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితర బీఆర్ఎస్ నేతలు ఉదయం నుంచి దవాఖానలోనే ఉంటూ ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కనీసం ఎనిమిది వారాల్లో కేసీఆర్ పూర్తిగా కోలుకుంటారని యశోద దవాఖాన వైద్యులు చెప్పారు.