హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమం పేరుతో వైసీపీ సరారు సంక్షోభ పాలన కొనసాగిస్తున్నదని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. గురజాల, విజయవాడ నియోజకవర్గాలకు చెందిన పలువురు మంగళవారం ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతున్నా పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.
సీఎం జగన్మోహన్రెడ్డి రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారని ఆరోపించారు. నవరత్నాల పేరుతో ప్రజలను నయవంచన చేస్తూ ఏపీని దివాలా దిశగా తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్, ప్రభుత్య ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని దయనీయ స్థితిలో ప్రభుత్వం ఉన్నదని మండిపడ్డారు. వైసీపీ హయాంలో అన్నిరంగాలు నిర్వీర్యమైయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దశలో ఏపీలో కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీయే రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని స్పష్టం చేశారు. రానున్న ఎన్నకల్లో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించనున్నదని ధీమా వ్యక్తం చేశారు. ఆయా ప్రాంతాల నేతలు తెల్లపోగు ఆదాం, ఉమామహేశ్వరరావు, నాగేళ్ల కోటేశ్వరరావు, ఎంబీ చంద్రపాల్ తదితరులు చేరిన వారిలో ఉన్నారు.