Congress | నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిన కాంగ్రెస్ సర్కార్లో అలజడి మొదలైందా? బీఆర్ఎస్ వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక, ప్రజలకు వివరణ ఇచ్చుకోలేక ఆంక్షల కుట్రలకు తెరలేపిందా? ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు నల్లగొండలో బీఆర్ఎస్ నిర్వహించాలనుకున్న సభను అడ్డుకోవాలనుకుంటున్నదా? జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఈ అనుమానాలే కలుగుతున్నాయి. నల్లగొండకు కేసీఆర్ వస్తే ప్రజలు రోడ్లపైనే ఆపేస్తారని, ఆ తర్వాత జరిగే పరిణామాలకు తమ ప్రభుత్వం బాధ్యత వహించదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సోమవారం నల్లగొండలో హెచ్చరించారు. ఆయన హెచ్చరికల అనంతరం నల్లగొండ జిల్లాలో 30,30(ఏ) యాక్ట్ను అమలులో పోలీసు అధికారులు ప్రకటించారు.
ఒకవేళ బీఆర్ఎస్ సభ నిర్వహిస్తే ఆ సభకు ఆర్టీసీ బస్సులు ఇవ్వొద్దని ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్టు చర్చ జరుగుతుంది. శ్రీశైలంతో పాటు నాగార్జునసాగర్ ప్రాజెక్టును కేఆర్ఎంబీ పరిధిలోకి తెచ్చేందుకు కాంగ్రెస్ సర్కార్ ఒప్పుకున్నది. ఈ రెండు ప్రాజెక్టులు నిర్వహణ బోర్డు పరిధిలోకి వెళ్తే తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని బీఆర్ఎస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నది. కాంగ్రెస్ సర్కార్ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నది. అందులో భాగంగా నల్లగొండ కేంద్రంగా భారీ బహిరంగసభను పెట్టి ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. అలా బీఆర్ఎస్ నల్లగొండ సభపై ఆలోచన చేసిందో లేదో సీఎం రేవంత్రెడ్డితో పాటు ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఎదురుదాడికి దిగారు. దీనికి కొనసాగింపుగా సోమవారం నల్లగొండ జిల్లాలో పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీఎం ఆఫీస్ డైరెక్షన్ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్లగొండ కలెక్టరేట్లో ప్రత్యేకంగా ప్రెస్మీట్ నిర్వహించి అడ్డగోలు, అసంబద్ధ ఆరోపణలు చేశారు.
అమలులోకి 30, 30(ఏ)యాక్ట్
నల్లగొండ జిల్లాలో నెల రోజుల పాటు 30,30(ఏ) పోలీస్ యాక్ట్-1861ను అమలు చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. ఈ చట్టం ప్రకారం పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకో వంటి కార్యక్రమాలను నిర్వహించకూడదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలా ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించకూడదని పేర్కొన్నారు. ఇలాంటి చట్టం గతంలో జిల్లాలో ప్రత్యేక సందర్భాల్లో మినహా సాధారణ సమయాల్లో అమలు చేసింది లేదు. ప్రస్తుతం జిల్లా పరిధిలో సమస్యాత్మక పరిణామాలు ఏమీ లేకపోయినా ఈ యాక్ట్ను అమలులోకి తేవడం చర్చనీయాంశంగా మారింది. త్వరలో కృష్ణా జలాలపై బీఆర్ఎస్ తలపెట్టిన బహిరంగసభ నేపథ్యంలోనే ఈ యాక్ట్ అమలును ప్రకటించారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయమై ఎస్పీ చందనాదీప్తి స్పందిస్తూ ముందుస్తు అనుమతి లేకుండా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదన్నదే ఈ యాక్ట్ ఉద్దేశమని చెప్పారు. ఇది సాధారణంగా ప్రతీ నెలా అమలు చేసే యాక్ట్నేనని పేర్కొన్నారు. ఇందులో ప్రత్యేకత ఏమీ లేదంటూ వివరణ ఇచ్చారు.
బస్సులు ఇవ్వొద్దంటూ..
నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహిస్తే దానికి జనం తరలిరాకుండా అడ్డుకునే ప్రయత్నాలను కూడా కాంగ్రెస్ సర్కార్ మొదలుపెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ బహిరంగ సభకు ఆర్టీసీ బస్సులు ఇవ్వొద్దని సోమవారం ముందస్తు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులకు ప్రభుత్వ పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. బీఆర్ఎస్ సభ తేదీ, స్థలం ఖరారయ్యాక సర్కార్ ఆంక్షలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. ఆర్టీసీ నల్లగొండ రీజనల్ మేనేజర్ శ్రీదేవి స్పందిస్తూ మహాలక్ష్మి ప్రయాణాల రద్దీ నేపథ్యంలో శుభకార్యాలు, ప్రత్యేక కార్యక్రమాలకు బస్సులు ఇవ్వవద్దని 15 రోజుల కిత్రమే తమకు ఆదేశాలు వచ్చినట్టు తెలిపారు. తాజాగా ఎలాంటి ఆదేశాలు లేవని పేర్కొన్నారు.