గోదావరిఖని, మే 5: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరిఖని, మంచిర్యాలకు రావడంతో పెద్దపల్లిలో తన గెలుపు ఖాయమైందని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాల్లో బీఆర్ఎస్ అధినేత నిర్వహించిన రోడ్ షోలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయని హర్షిస్తూ.. కేసీఆర్ తనపై చూపిన అభిమానాన్ని ఎన్నటికీ మరిచిపోలేనని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటానని తెలిపారు. ఉద్యమం నుంచి వెన్నంటి ఉన్న తనకు అనేక పదవులు ఇవ్వడంతోపాటు పెద్దపల్లి పార్లమెంట్ నుంచి అవకాశం కల్పించారని చెప్పారు. ఆగర్భ శ్రీమంతుడికి, భూగర్భ కార్మికుడికి మధ్య జరిగే పోటీలో సింగరేణి కార్మికులు ఆలోచన చేసి ఓటు వేయాలని సూచించారు.
సింగరేణిని కాపాడుకోవాలన్నా.. కార్మికుల గళాన్ని వినిపించాలన్నా అన్ని వర్గాల ప్రజలు తనకు మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన గోదావరిఖనిలో ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సింగరేణి ప్రాంతమన్నా.. కోల్బెల్ట్ ప్రజలన్నా కేసీఆర్కు ప్రాణమని, అందుకే ఈ ప్రాంతంపై ప్రత్యేక ప్రేమను చూపుతున్నారని గుర్తుచేశారు. సింగరేణి కార్మికులకు అనేక హక్కులు కల్పించారని, 19 వేల కొలువులు ఇప్పించి సింగరేణిలో యువరక్తం నింపిన ఘనత కేసీఆర్దేనని ప్రశంసించారు. శుక్ర, శనివారాల్లో గోదావరిఖని, మంచిర్యాలలో రోడ్ షోలలో కేసీఆర్ పాల్గొని అందరిలోనూ భరోసా నింపారని చెప్పారు. ఎవరూ ఊహించని విధంగా ఈ రోడ్ షోలకు వేలాది మంది సింగరేణి కార్మికులు, అన్ని వర్గాల ప్రజల స్వచ్ఛందంగా వచ్చి బీఆర్ఎస్కు అండగా ఉంటామని మద్దతు పలికారని కొప్పుల పేర్కొన్నారు.