సిద్దిపేట, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ తొలి ఎన్నికల ‘ప్రజా ఆశ్వీరాద’ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అనుకున్న లక్ష్యానికి మంచి ప్రజలు తరలిరావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్తేజం కనిపించింది. సభా ప్రాంగానికి ఎదురుగా ఉన్న తాటిచెట్లు ఎక్కి గీత కార్మికులు బీఆర్ఎస్ పార్టీకి సంఘీభావాన్ని తెలిపారు. వారికి సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. సభ సాయంత్రం 4 గంటలకు ఉండగా, మధ్యాహ్నం 2 నుంచే జనం తండోపతండాలుగా తరలివచ్చారు. పట్టణంలోని రోడ్లన్నీ కిక్కిరిసి పోయాయి.
సీఎం కేసీఆర్ సాయంత్రం 4.34 గంటలకు హెలికాప్టర్లో హుస్నాబాద్కు చేరుకున్నారు. అక్కడి నుంచి 4.45 గంటలకు ఎన్నికల ప్రచార రథంలో సభాస్థలికి చేరుకున్నారు. కేసీఆర్ చేరుకోగానే సభ ప్రాంగణం కేరింతలతో దద్దరిల్లింది. ప్రజలనుద్దేశించి 21 నిమిషాలపాటు కేసీఆర్ ప్రసంగించారు. అనంతరం ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్కు బీఫాం అందజేశారు. హైదరాబాద్లో ఇవ్వలేదని, ఈ సభసాక్షిగా ఎమ్మెల్యే సతీశ్కుమార్కు బీఫారం అందజేస్తున్నానని కేసీఆర్ చెప్పగానే ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు.