హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సన్నద్ధం చేయడానికి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నియోజకవర్గ స్థాయి సమావేశాల నిర్వహణకు పూనుకొన్నది. అందులోభాగంగా సోమవారం తొమ్మిది నియోజకవర్గాల సమావేశాలు నిర్వహించనున్నది. చేవెళ్ల, పరిగి నియోజకవర్గాల సమావేశాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు.
ఉదయం 11 గంటలకు చేవెళ్ల నియోజకవర్గ సమావేశం స్థానిక కేజీఆర్ గార్డెన్లో, మధ్యాహ్నం 2 గంటలకు పరిగి నియోజకవర్గ సమావేశం ఎస్ గార్డెన్లో జరుగనున్నది. ఈ నియోజకవర్గాలతోపాటు ఆలేరు, నర్సంపేట, ఖైరతాబాద్, ఆందోల్, జగిత్యాల, జుక్కల్, వర్ధన్నపేట సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాలకు పార్టీ ముఖ్య నేతలు హాజరవుతారు.