KTR | హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది చిత్తశుద్ధి లేని శివ పూజ లాంటిది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పార్లమెంట్లో చేయాల్సిన పనిని శాసన సభలో చేసి.. నెపాన్ని ఇతరుల మీద తోసేసే
కాంగ్రెస్ ప్రయత్నం మంచిది కాదు అని కేటీఆర్ హితవు పలికారు. బీసీ ఐకాస ధర్నాకు బీఆర్ఎస్ నైతిక మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో బీసీ జేఏసీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో సమావేశమైన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
పూటకో మాటతో బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ నిప్పులు చెరిగారు. 2004లో ఆర్ కృష్ణయ్యను తీసుకొని ప్రధానమంత్రి దగ్గరకి వెళ్లి కేసీఆర్ మూడు విషయాలు చెప్పారు. ఒకటి దేశంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలి, రెండు జనాభాకి అనుగుణంగా రాష్ట్రాలకు రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాలి, మూడు చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు కావాలని కేసీఆర్ అడిగారు. భారత దేశ స్థాయిలో ఈ మూడు అంశాల మీద మాట్లాడిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ గుర్తు చేశారు.
బీసీ రిజర్వేషన్లపైన మా పార్టీ విధానాన్ని చాలా స్పష్టంగా మా పార్టీ చెప్పింది. గతంలో శాసనసభలో రెండుసార్లు రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసి పంపించింది. కానీ కాంగ్రెస్ పార్టీ లెక్క ప్రచారం చేసుకోలేదు. కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా రిజర్వేషన్లు పెడతామని శాసనసభలో చెప్పినప్పుడు మేము ఆ పార్టీ తరఫున మద్దతు ఇచ్చాము. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల పైన ఐదు రకాలుగా మాట్లాడుతోంది. రాజ్యాంగ సవరణ ద్వారా, పార్టీ తరఫున రిజర్వేషన్లు ఇస్తామని, ఆర్డినెన్స్ ద్వారా, బిల్లు ద్వారా, మరోసారి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే బీసీ రిజర్వేషన్లు వస్తాయని చెప్పారు. ఇన్ని రకాలుగా మాటలు మార్చిన కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని మేము తప్పకుండా ప్రశ్నిస్తూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.
బీసీ రిజర్వేషన్లకు మా పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. తప్పులు చేసిన కాంగ్రెస్ పార్టీని కచ్చితంగా మా పార్టీ తరఫున నిలదీస్తూనే ఉంటాము. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీ సంఘాల ప్రతి ప్రయత్నాన్ని మా పార్టీ తరఫున సపోర్ట్ చేస్తాము. బీసీ రిజర్వేషన్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు, ఆయన నాయకత్వంలో రానే రావు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి బలహీన వర్గాలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేదాకా నిలదీస్తూనే ఉంటాము. బీసీ డిక్లరేషన్లు ఇస్తామని చెప్పిన లక్ష కోట్ల బడ్జెట్ నుంచి మొదలుకొని బీసీ సబ్ప్లాన్ వంటి హామీలపైన నిలదీస్తూనే ఉంటాము. కాంగ్రెస్ తెచ్చిన 42 శాతం రిజర్వేషన్ కేవలం స్థానిక సంస్థల కోసం తీసుకువచ్చారు కానీ, విద్య, ఉపాధికి సంబంధించిన రిజర్వేషన్ల వాటా మిగిలిన అన్ని రంగాల్లో రావాల్సిన అవసరం ఉన్నది. కాంట్రాక్టులనుంచి మొదలుకొని అన్నింటికి సంబంధించిన వాటిలో 42 శాతం వాటా రావాలి అని బీసీ సమాజం డిమాండ్ చేయాలి అని కేటీఆర్ సూచించారు.
కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నటువంటి కార్యక్రమాల అమలుపైన మనం నిలదీయాల్సిన అవసరం ఉన్నది. బీసీ సంఘాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నిటి పైన నిలదీయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. విద్య, ఉపాధి వంటి 42 శాతం రిజర్వేషన్ అన్ని రంగాల్లో గనక ఇస్తే లక్షల మంది బీసీ బిడ్డలకు లాభం జరుగుతుంది. బీసీ రిజర్వేషన్ల అంశంలో చిత్తశుద్ధి లేని శివపూజలాంటివి. రేవంత్ రెడ్డికి బీసీల అంశంలో ఎలాంటి చిత్తశుద్ధి లేదు. రాహుల్ గాంధీ, మోడీ ఇద్దరూ కలిసి ఒక్క మాట అంటే ఒక్క నిమిషంలో బీసీ రిజర్వేషన్ల అంశం తేలిపోతుంది. ఇండియా, ఎన్డీఏ రెండు కూటములు కలిస్తే బీసీ రిజర్వేషన్ బిల్లు వెంటనే చట్టంగా మారుతుంది.
పార్లమెంటులో బిల్లు పెడితే కచ్చితంగా అనుకూలంగా పాస్ అవుతుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.
బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి తీసుకెళ్తే మేము వచ్చి మద్దతు ప్రకటిస్తాము.
ప్రధానమంత్రి స్వయంగా ఓబీసీ కాబట్టి, ఆయనకి బీసీ రిజర్వేషన్ల పైన చిత్తశుద్ధి ఉంటే మంచిది. పార్లమెంటులో బిల్లు పెడితే కచ్చితంగా మా నలుగురు రాజ్యసభ ఎంపీలు ఓటు వేసేది మొదట బీఆర్ఎస్ పార్టీయే. తెలంగాణ ఉద్యమం మాదిరే, సమస్యను ఢిల్లీ దాకా తీసుకువెళ్లి తెలంగాణ సాధించుకున్నట్లుగానే బీసీ రిజర్వేషన్లను సాధించుకుందాం. 18వ తేదీన బీసీ సంఘాలు నిర్వహించే బంద్కు మా పార్టీ మద్దతు ఇస్తుంది అని కేటీఆర్ స్పష్టం చేశారు.