Kadiyam Srihari | హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): కర్ణాటకలో ఎన్నికల హామీలను అమలుచేయలేక చేతులెత్తేసిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలోనూ అదే పనిచేయబోతున్నదని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనుమానం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను ఎప్పుడు అమలు చేస్తారో తెలిపే షెడ్యూల్తో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ సన్నాహక సమావేశం అనంతరం ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, గండ్ర వెంకటరమణారెడ్డి, అరూరి రమేశ్, బీఆర్ఎస్ నేత కే వాసుదేవరెడ్డితో కలిసి కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తుందా? చేయదా? అని కర్ణాటక పరిణామాలను చూస్తే అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృ ష్ట్యా హామీల అమలు సాధ్యం కాదని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆర్థిక సలహాదారు బసవరాజ్ రాయరెడ్డి తేల్చేశారు.
హామీల్లో కొన్ని కోతలు పెట్టాల్సిందేనని తేల్చిచెప్పారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అదేపని చేయబోతున్నదా? సీఎం రేవంత్రెడ్డి కాని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాని ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలి. రైతు రుణమాఫీ, రైతుబంధు, కనీస మద్దతు ధరతోపా టు ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్, 200 యూనిట్ల ఉచిత కరెంటు హమీల అమలు విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. కాలయాపన చేయటానికే శ్వేతపత్రాల విడుదల, ప్రజాపాలన దరఖాస్తు, వాటి క్రోడీకరణ, కంప్యూటీకరణ అంటూ నాటకాలాడుతున్నారు’ అని కడియం మండిపడ్డారు.
తొందరపాటు గుర్తుచేస్తున్నాం
హామీలను అమలు చేయాలనే ప్రభుత్వానికి తాము గుర్తు చేస్తున్నామని కడియం శ్రీహరి తెలిపారు. కొత్త ప్రభుత్వం కుదుటపడేదాకా వేచిచూడాలన్నదే తమ ఉద్దేశమని, డిసెంబర్ 9వ తేదీ నుంచి అమలు చేస్తామని సీఎం ప్రజలకు స్పష్టమైన తేదీలు ప్రకటించిన నేపథ్యంలోనే బాధ్యతాయుత ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వానికి గుర్తుచేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వంపై తమకేమీ అక్కసులేదని తేల్చిచెప్పారు. ప్రజాతీర్పును గౌరవించి ప్రతిపక్ష పాత్రనే పోషిస్తున్నామని తెలిపారు.
ఎన్నికల సమయంలో దళితబంధు పథకాన్ని రెండు లక్షలు పెంచి రూ.12 లక్షలు ఇస్తామని చెప్పిందని, దీనిపై ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. దళితబంధు, గృహలక్ష్మి వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందా? చేయదా? స్పష్టత ఇవ్వాలని కోరారు. ఎంసీహెచ్ఆర్టీని రాజకీయ సమావేశాల వేదికగా మార్చటం సరికాదని అన్నారు. అధికారిక కార్యక్రమాల నిర్వహణకు, అధికారుల శిక్షణ కోసం ఉద్దేశించిన ఎంసీహెచ్ఆర్డీలో సీఎం రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీ సమావేశాలు నిర్వహించటం వల్ల ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నారని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దు
ప్రజాప్రతినిధుల విధి, నిధుల నిర్వహణ విషయంలో ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదని కడియం విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేల (ఎస్డీఎఫ్)కు రూ.10 కోట్లకు కేటాయిస్తామని సీఎం పేర్కొనటాన్ని ఆయన స్వా గతించారు. అదే సమయంలో ఆ నిధులను ఇన్చార్జి మంత్రుల ద్వారా ఖర్చుచేస్తామని చెప్పటాన్ని తప్పుబట్టారు. ఇన్చార్జి మంత్రు ల ద్వారా సీడీఎఫ్ నిధులు ఖర్చుచేయటం అప్రజాస్వామికమని విమర్శించారు. గతం లో ఎప్పుడూ ఎస్డీఎఫ్ నిధులను పూర్తిగా ఇన్చార్జి మంత్రులకు కేటాయించలేదని తెలిపారు. 50 శాతం ఇన్చార్జిలకు, మరో 50 శాతం నిధులను సంబంధిత ఎమ్మెల్యేలకు కేటాయించారని గుర్తుచేశారు. ఫార్ములా ఈ -రేసింగ్ నిధులు దుర్వినియోగమైతే విచార ణ చేసి బాధ్యులపై చర్య తీసుకోవచ్చని, కా నీ, రేస్నే రద్దుచేయటం సరికాదన్నారు.