Minister Indrakaran Reddy | రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే విజయమని, ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలం మొండిగుట్టలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ హయాంలో తెలంగాణకు చేసిందేమి లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డిజీల్, గ్యాస్, ఇతర నిత్యావసర సరుకుల ధరలను పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోందని ఆరోపించారు. పెరిగిన ధరలతో మహిళలు గ్యాస్ పొయ్యి వెలిగించలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పెట్రోల్, డీజీల్ ధరల పెరుగుదలతో వాహనాలను బయటికి తీయలంటేనే వాహనదారులు బెంబేలెత్తుతున్నారన్నారు.
మరో వైపు బీజేపీ కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ.. బీజేపీయేతర ప్రభుత్వాలపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణకు చిల్లిగవ్వ కూడా ఇవ్వడం లేదని, బీజేపీ ప్రభుత్వ తీరును ఎండగడితే.. ఈడీ, సీబీఐ, ఐటీలాంటి దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తుందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్లాంటి నాయకులను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక ఎమ్మెల్సీ కవిత, ఇతర బీఆర్ఎస్ నేతలను దర్యాప్తు సంస్థల ద్వారా వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో బీజేపీ నాయకులే నీతిమంతులైనట్లు, కేవలం బీజేపీయేతర పార్టీ నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు సీయం కేసీర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. దీంతో మౌలిక వసతులు మెరుగుపడ్డాయని, అన్ని వర్గాల ప్రజల ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. అయితే, పొరుగు రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, మహారాష్ట్ర నుంచి మన జైత్రయాత్న ప్రారంభం కానుందని చెప్పారు.
కాంధార్ లోహ వేదికగా నిర్వహించిన బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్ చేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను మంత్రి ఇంద్రకరణ్రెడ్డి డిమాండ్ చేశారు. అడెల్లి మహా పోచమ్మ ఆలయ పునః నిర్మాణ పనులకు మంత్రి భూమిపూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని, అందుకే స్వరాష్ట్రంలో ఎన్నో రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, అమలు చేస్తున్నారన్నారు.
ఒక్క తెలంగాణ రైతులే కాదు దేశానికి అన్నం పెట్టే అన్నదాతలందరూ బాగుపడాలనే సంకల్పంతో బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి, దేశ వ్యాప్తంగా మోడల్ పాలనను అందిచేందుకు సీఎం కేసీఆర్ శాయశక్తుల కృషి చేస్తున్నారని వెల్లడించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్కు మా రాష్ట్రంలో ఏం పని అని ప్రశ్నించారని, లోహా సభలో సీఎం కేసీఆర్ దానికి సరైన సమాధానం ఇచ్చారన్నారు. కేసీఆర్ కోరినట్లు రైతుల కోసం ఎకరానికి రూ.10వేల చొప్పున రైతుబంధు, నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్ట్ ద్వారా పంట పోలాలకు నీళ్లను అందించడం, రూ.5 లక్షల రైతుబీమా, పండిన పంటకు గిట్టుబాటు ధర చెల్లిస్తారో లేదో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.