KCR | హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాలపై తెలంగాణ హకులను కాపాడుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత వైఖరిని నిరసిద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతకు ప్రభుత్వం అంగీకారం తెలపటం దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హకులపై గొడ్డలిపెట్టు అని ఆందోళన వ్యక్తం చేశారు. కేఆర్ఎంబీకి సాగర్, శ్రీశైలం సహా కృష్ణా ప్రాజెక్టులను అప్పగించటం రైతాంగ వ్యతిరేక నిర్ణయమని తెలిపారు. ఆదివారం నందినగర్లోని నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ అత్యున్నత స్థాయి సమావేశం కొనసాగింది. సమావేశానికి కృష్ణాబేసిన్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందుబాటులో ఉన్న పార్టీ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయం వల్ల తెలంగాణ జలహక్కులకు వాటిల్లబోయే ప్రమాదాన్ని రైతాంగానికి, ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్పై చేస్తున్న ఆరోపణలకు దీటుగా జవాబివ్వాలని, జలహక్కుల సాధనకు బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో చేసిన కృషిని వివరిద్దామని సూచించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి వాటిల్లబోయే ఆటంకాలను కూడా ప్రస్తావించాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా సోమవారం బీఆర్ఎస్ సీనియర్ నేతలు పత్రిక సమావేశాన్ని నిర్వహించే అవకాశమున్నది. సమావేశంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రు లు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, శ్రీనివాస్గౌడ్, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సునీతాలక్ష్మారెడ్డి, పట్నం మహేందర్రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రాజెక్టుల అప్పగింత అంశం నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికల అనంతరం తొలిసారిగా కేసీఆర్ తెలంగాణభవన్లో అడుగుపెట్టబోతున్నారు. కృష్ణా బేసిన్ పరిధిలోని ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి, ఖమ్మం, హైదరాబాద్ ఐదుజిల్లాల ముఖ్యకార్యకర్తలతో భేటీ కానున్నారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశం కొనసాగే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు, కార్యకర్తలను కదిలించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నారు. పార్టీ ముఖ్యకార్యకర్తలకు స్వయంగా కేసీఆరే దిశానిర్దేశం చేయనున్నారు. అందులో భాగంగా నల్లగొండలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సమాలోచనలు చేస్తున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో సభ నిర్వహించాలని యోచిస్తున్నారు.