సూర్యాపేట, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): అనేక మాయమాటలు, అలవికాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఎన్నికల ముందు చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. నల్లగొండలో సోమవారం బీఆర్ఎస్ నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ‘పదేండ్ల నిజం ముందు వంద రోజుల అబద్ధం కనిపిస్తున్నది. 420 హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ నేతలు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్రెడ్డి చెప్పారు. ఐదు నెలలు గడుస్తున్నా ఆ ఊసే లేదు. రుణాలు తీసుకున్న రైతుల ఆస్తులను జప్తు చేస్తామని బ్యాంకులు నోటీసులు పంపిస్తుంటే సర్కారు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నది. మనం కడుపులో చల్ల కదలడకుండా రైతుబంధు పది రోజుల్లో ఇచ్చినం. నేడు రైతుబంధు రాక చాలా గ్రామాల్లో రైతులు కుతకుత ఉడుకుతున్నరు. పైగా, ఇక్కడి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టండి అంటడు. మరో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి రైతుబంధు దుబారా అని, కేసీఆర్ డబ్బు వేస్ట్ చేసిండని అంటుండు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడకముందే ఇంత అహకారంగా మాట్లాడుతున్నరు. రేపు ఓటు వేస్తే ఏమంటారో! రైతుబందు, రుణమాఫీ, నీళ్లు, కరెంట్ ఇవ్వకున్నా, నాగార్జునసాగర్ను కేఆర్ఎంబీకి అప్పగించినా రైతులు, ప్రజలు మాకే ఓట్లేసిర్రు అని అంటరు. ఈ విషయాలను బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది’ అని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ఇప్పటి నుంచే కాంగ్రెస్ మోసాన్ని ప్రజలకు వివరిస్తే ఎంపీ సీట్లు గులాబీ పార్టీవేనని వెల్లడించారు. ‘డిసెంబర్ 9న రుణమాఫీ పొందిన వారంతా కాంగ్రెస్కు ఓటేయండి. మోసపోయినవాళ్లు బీఆర్ఎస్కు ఓటేయండి’ అని రైతులకు చెప్పాలని సూచించారు.
నల్లగొండ, ఖమ్మంలోనే మానవ బాంబులు
‘రేవంత్ ప్రభుత్వం ఐదేండ్లు ఉండాలి. ఇచ్చిన 420 హామీలు అమలు చేయాల్సిందే. లేదంటే మనమే మెడలు వంచి అమలు చేయించాల్సిన బాధ్యత తీసుకుందాం. రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆలోచన, కుట్రలు చేయాల్సిన అవసరం మా పార్టీకి లేదు. ఆయన ప్రభుత్వాన్ని కూల్చే మానవ బాంబులు నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోనే ఉన్నారు. సీఎం అయ్యాక కూడా రేవంత్రెడ్డి చేష్టల్లో మార్పు కనిపిస్తలేదు. లోక్సభ ఎన్నికల తర్వాత షెల్టర్ కోసం కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్లే మొట్టమొదటి వ్యక్తి రేవంత్రెడ్డే అయితడు. ఇది జరిగి తీరుతది. గుర్తు పెట్టుంకోండి’ అని కేటీఆర్ తెలిపారు.
ఇక రేవంత్ సర్కారుకు ముచ్చెమటలే: జగదీశ్రెడ్డి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయ్యిందని, ఇక ఆ సర్కారును ఆటాడించే పనిని కేసీఆర్ మొదలు పెట్టారని మాజీమంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమం పట్టని రేవంత్ సర్కార్ రోజుకో సమస్యను తెచ్చి ప్రజల్లో బీఆర్ఎస్ను చులకన చేయాలని ప్రయత్నిస్తున్నా కొంత సమయం ఆగాలని సంయమనంతో ఉన్నామని, కేసీఆర్ బయటకు వచ్చారు తస్మాత్ జాగ్రత్త అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘మనం ఏం చేయాలో కేసీఆర్ నిన్న మనకో డైరెక్షన్ ఇచ్చారు. కేసీఆర్ చెప్పిన మాటలను గ్రామాల్లో అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ మాటలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి’ అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొనే వ్యక్తికి బాధ్యత ఉం టుందని కేసీఆర్ హుందాతనాన్ని చూపి 110 రోజు లు ఆగాలని మాకు చెప్పిర్రు. కానీ, ఇదే కాంగ్రెస్ రాజస్థాన్లో అధికారం కోల్పోయిన 10 రోజులకే బీజేపీ సర్కారు కరెంటు ఇస్తలేదని సెక్రటేరియట్పై దాడి చేసింది. వంద రోజులిచ్చినా విషం కక్కారు తప్ప హామీలపై చర్చించలేదు’ అని వెల్లడించారు. నాయకులను తయారు చేసే కర్మాగారం బీఆర్ఎస్ ఫ్యాక్టరీ అని, ఇవాళ వేదికపై ఉన్న మిత్రులందరినీ కేసీఆరే తయారుచేశారని తెలిపారు. సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిశోర్, నలమోతు భాస్కర్రావు, నోముల భగత్, బొల్లం మల్లయ్యయాదవ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చెరిపేస్తే చెరగని సత్యం కేసీఆర్: కేటీఆర్ తెలంగాణలో చెరిపేస్తే చెరగని సత్యం కేసీఆర్ అని కేటీఆర్ అన్నారు. సోమవారం ఎక్స్ వేదికగా తలసరి ఆదాయ వివరాలపై ఆయన స్పందించారు. ‘2022-23లో రూ.3.09 లక్షల తలసరి ఆదాయంతో పెద్ద రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ నం.1గా ఉన్నది. అయినా ఏం చేసినవ్ కేసీఆర్? అని మీడియా, ప్రతిపక్షాలు అంటాయి.
కానీ, చెరిపేస్తే చెరగని సత్యం కేసీఆర్ సాధించిన ఆర్థిక ప్రగతి’ అని పేర్కొన్నారు.
కేసీఆరే మళ్లీ రావాలంటున్నరు..
కేసీఆర్ ఇచ్చిన దానికంటే మించి ఏదో ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ మాయమాటలకు జనం మోసపోయారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ఎండిన పొలాలను పరిశీలించేందుకు సూర్యాపేట జిల్లాకు వస్తే రైతన్నలు.. ‘సారూ మీరే కావాలి. మళ్లీ మీరే రావాలి’ అని దీనంగా వేడుకుంటున్నరు. దీన్నిబట్టే కాంగ్రెస్ సర్కారు అబద్ధాలు, చేస్తున్న మోసాలు ప్రజలకు అర్థమవుతున్నాయని తెలుస్తున్నది. ఏ ఊరికి పోయినా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండడని మేము అనుకోలేదని ప్రజలే అంటున్నరు. కేసీఆర్ సూర్యాపేట, తుంగతుర్తికి వస్తే జనంలో ఎమోషన్ కనిపించింది. ఆ వీడియోలు చూస్తుంటే నల్లగొండ జిల్లాలో మనం ఎట్లా ఓడిపోయామో అర్థం కాలేదు. జరిగింది కలా? నిజమా? అని గుండె కలుక్కుమన్నది. మొన్న ఒక వీడియో వచ్చింది. ముషంపల్లికి చెందిన మల్లయ్య అనే రైతు కేసీఆర్ సార్ మళ్లీ రావాలి.. కేసీఆర్ ఉన్నప్పుడే మేము బాగున్నాం అని అన్నడు’ అని వెల్లడించారు. ‘రేవంత్ సర్కార్లో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ వేయలేదు. ఒక్క కాంపిటేటివ్ పరీక్ష పెట్టలేదు. కానీ నేడు సీఎం రేవంత్రెడ్డి గొప్పగా హైదరాబాద్లో సభలు పెట్టి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి తాము 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని పచ్చి అబద్ధాలు చెప్తుండు. బీఆర్ఎస్ హయాంలో పూర్తయిన ప్రక్రియకు నేడు తామే ఉద్యోగాలు పుట్టించి ఇచ్చినట్టు తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నరు. మనం ఇచ్చి చెప్పుకోలేకపోయాం’ అని పేర్కొన్నారు.