హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు చెప్పారు. ఖమ్మం నుంచి వెళ్లిన వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధి బృందం గురువారం న్యూఢిల్లీలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ తాను రైతు బిడ్డనని, వ్యవసాయం కోసం రైతు, కూలీలు ఎంత కష్టపడతారో దగ్గరనుంచి చూశానని చెప్పారు. అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకొనే వారని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే పార్లమెంట్లో అనేకసార్లు రైతు వ్యతిరేక చట్టాలను, మోటర్లకు మీటర్లను అడ్డుకోవడం జరిగిందని గుర్తు చేశారు. దేశానికి వెన్నెముకగా ఉన్న అన్నదాతలు సమగ్ర వ్యవసాయ చట్టం కోసం చేయని పోరాటం లేదని అన్నారు.పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ముందురోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా రైతు చట్టాల గురించి పార్లమెంటులో చర్చించాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు.
రైతుకు గిట్టుబాటు ధరకు సంబంధించిన చట్టంపై కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే చర్చించాలని కూడా తాను కోరినట్టు చెప్పారు. వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 200 రోజులు పనిదినాలు కల్పించాలని, రోజుకు రూ.600 చొప్పున కూలి ఇవ్వాలని, కేంద్ర బడ్జెట్లోరూ. 2,50,000 కోట్ల నిధులు కేటాయించాలని, ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని, దళిత గిరిజనులపై జరుగుతున్న దాడులను నివారించాలని, ఖాళీగా ఉన్న పోస్టులును భర్తీ చేసి ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని ఇంకా అనేక డిమాండ్లను వ్యవసాయ కార్మిక సంఘం తమ వినతిపత్రంలో ప్రస్తావించింది. వీటిని పార్లమెంట్లో ప్రస్తావించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నామా భరోసా ఇచ్చారు.
ఎంపీని కలిసిన వారిలో వ్యవసాయ కార్మిక సంఘంతోపాటు కేవీపీఎస్ నాయకులు మెరుగు సత్యనారాయణ, యర్రా శ్రీనివాసరావు, నందిపాటి మనోహర్, సాగర్, కేవీ రెడ్డి, తేలపోలు రాధాకృష్ణ, కే లక్ష్మణరావు, వేణు, బంధం శ్రీనివాసరావు తదితరులున్నారు.