Srinivas Goud | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలతో పాలన సాగిస్తోంది అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణలో అన్ని గ్యారంటీలు అమలయ్యాయని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ భవన్లో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
ప్రజలను కొన్ని సార్లు మోసం చేయవచ్చు.. అన్ని సార్లు మోసం చేయలేరు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై అదే మోసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోంది. రిజర్వేషన్ల పెంపుపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు జీవో తెచ్చారు.. ఆరునెలల లోపే రిజర్వేషన్లు పెంచుతామన్నారు.. అపుడే ఎందుకు జీవో తేలేదు. జీవోతోనే పని అయ్యేదుంటే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం ఎందుకు, బిల్లు గవర్నర్, రాష్ట్రపతి దగ్గరకు ఎందుకు..? జీవో తెచ్చినట్టే తెచ్చి కోర్టులో కేసులు వేయించారు. కోర్టులో కేసు ఉన్నా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ జీవో చెల్లదని వారి ఆత్మసాక్షికి తెలియదా..? అని శ్రీనివాస్ గౌడ్ నిలదీశారు.
ఇతర రాష్ట్రాల్లో జీవో ద్వారా రిజర్వేషన్లు పెంచితే కోర్టులు కొట్టేశాయని ఈ ప్రభుత్వానికి తెలియదా? అసెంబ్లీలో బిల్లును ఆమోదించి ప్రధానిని ఎందుకు కలవలేదు. ప్రధాని దగ్గరకు అఖిల పక్షాన్ని ఎందుకు తీసుకెళ్లలేదు..? కాంగ్రెస్, బీజేపీలు కలిసి బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా కుట్ర చేస్తున్నాయి. మహారాష్ట్రలో జీవో ద్వారా రిజర్వేషన్లు పెంచి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే సుప్రీంకోర్టు మొత్తం ఎన్నికల ప్రక్రియను కొట్టివేసింది. అలాంటి పరిస్థితిని రాష్ట్రంలో తీసుకు రాదలుచుకున్నారా? ఆర్థికంగా వ్యయ ప్రయాసలకు ఓర్చి ఎన్నికల్లో గెలిచిన వారి పరిస్థితి కోర్టు కొట్టేస్తే ఏమిటి ? బీసీలను ఈ ప్రభుత్వం ఆర్థికంగా దివాళా తీయించాలనుకుంటుందా? అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
సుప్రీంకోర్టులో ఎవరు చిన్న పిటిషన్ వేసినా మొత్తం ఎన్నికల ప్రక్రియను రద్దు చేసే అవకాశం ఉంది. బీసీలను కాంగ్రెస్ తెలివి లేని వాళ్ళుగా భావోస్తోందా..? ఎన్నికల్లో గెలిచిన బీసీల పదవులు రద్దయితే వారికి ఉన్నత పదవులు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇస్తుందా..? కామారెడ్డి డిక్లరేషన్లో పేర్కొన్న ఏ ఒక్క అంశాన్ని అమలు చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తన చేతుల్లో ఉన్న హామీలు కూడా అమలు చేయడం లేదు. బీహార్ ఎన్నికల్లో తెలంగాణ బీసీలకు ఏదో చేశామని చెబుతూ కాంగ్రెస్ అక్కడి ప్రజలను మోసం చేస్తోంది అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు.
విద్యా ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు జీవో ఎందుకు జారీ చేయలేదు. తొమ్మిదో షెడ్యూల్లో చేర్చినపుడే బీసీ రిజర్వేషన్ల పెంపునకు చట్టబద్దత వస్తుంది తప్ప ఇంకో మార్గం లేదు. తొమ్మిదో షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు కాంగ్రెస్ ఏ ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ సహకరిస్తుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కు అనుగుణంగా కాంగ్రెస్ కేబినెట్లో నామినేటెడ్ పోస్టుల్లో నియామకాలు జరగాలి. 42 శాతం రిజర్వేషన్ల పెంపునకు అన్ని పార్టీలు అఫిడవిట్లు ఇవ్వాలనేది తప్పుడు వాదన. ఒక వేళ హైకోర్టులో పార్టీల అఫిడవిట్లకు ఆమోదం దొరికినా సుప్రీంకోర్టులో అలా జరుగుతుందని హామీ ఇస్తారా..? అని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.